Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బీజింగ్ : కరోనా వైరస్కు సంబంధించి చైనాకు వ్యతిరేకంగా అమెరికా కోర్టుల్లో దాఖలైన వ్యాజ్యాలు అమోదయోగ్యం కాదనీ, అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధంగా ఉన్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. అలాగే ఈ వ్యాజ్యాలు చైనా సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించే విధంగా ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు. కరోనా వైరస్కు చైనా దేశాన్ని బాధ్యత చేస్తూ అమెరికాకు చెందిన సెనేటర్లు, ప్రభుత్వ అధికారులు, మీడియా సంస్థలు, ప్రభుత్వేతర సంస్థలు అమెరికా కోర్టుల్లో పలు వ్యాజ్యాలు దాఖలు చేశాయి.
కరోనా కారణంగా ఇతర దేశాలు తీవ్రంగా నష్టపోయాయనీ, అందుకు చైనా నుంచి ఆయా దేశాలకు పరిహారం అందించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరాయి. అమెరికా కోర్టుల్లో దాఖలైన వ్యాజ్యాలు చైనా ప్రభుత్వంపై చట్టపరమైన చర్యలు కోరుతున్నాయి. మిస్సోరి రాష్ట్ర అటార్నీ జనరల్ జిల్లా కోర్టులో వ్యాజ్యం వేశారు. ఇలా ఒక దేశానికి చెందిన రాష్ట్రం ఇతర దేశ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘిస్తూ జిల్లా కోర్టులో కేసు వేయడం అనేది అరుదు అని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. అమెరికాలో దాఖలవుతున్న వ్యాజ్యాలు అన్ని స్థానిక చట్టాలను అనుసరించి ఉన్నాయనీ, వాస్తవానికి ఇతర దేశంపై కేసు పెట్టాలంటే అది అంతర్జాతీయ చట్టాలకనుగుణంగా జరగాలనీ, కానీ దేశీయ చట్టాల ద్వారా అంతర్జాతీయ చట్టాలతో పోటీ పడాలని చూస్తున్నారని అభిప్రాయపడ్డారు.
మరోవైపు కరోనా చైనా ల్యాబుల్లో పుట్టిందనీ, అది 'చైనీస్ వైరస్' అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సమయం వచ్చినప్పుడల్లా పలుమార్లు ఆరోపిస్తూ వస్తున్నారు. ఇదే సమయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ)పై కూడా విమర్శలు గుప్పిస్తూ బెదిరింపులకు పాల్పడ్డారు. డబ్ల్యూహెచ్ఓ చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు. సంస్థకు నిధులను కూడా నిలిపేస్తామని హెచ్చరించారు. కాగా, ట్రంప్ ఆరోపణలను పలు దేశాలతో పాటు శాస్త్రవేత్తలు ఖండించారు. ట్రంప్ ఆరోపణలు నిరాధారమైనవని వారు పేర్కొన్నారు.