Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-చైనా విదేశాంగ శాఖ
అధికార ప్రతినిధి జావో
బీజింగ్ : తమ దేశ ప్రయోజనాలకు హాని కలిగించాలన్న అమెరికా కుట్రలను తిప్పికొట్టేందుకు అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నామని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జావో లిజియాన్ హెచ్చరించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ హాంకాంగ్ వ్యవహారాలు, చైనా అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడాన్ని అమెరికా మానుకోవాలని హితవు పలికారు. హాకాంగ్లో జాతీయ భద్రతా చట్టం అమలు విషయంలో చైనాకు వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు స్పందనగా లిజియాన్ పైవిధంగా స్పందించారు. హాంకాంగ్లో జాతీయ భద్రతా చట్టం అమలుకు సంబంధించిన బిల్లుకు చైనా నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ (ఎన్పిసి) ఆమోదించిన విషయం తెలిసిందే. హాంకాంగ్లో వేర్పాటువాదం, అణచివేత, ఉగ్రవాదం, విదేశీ జోక్యాన్ని సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు , జాతీయ భద్రతకు కాపాడుకునేందుకు ఈ చట్టం తోడ్పడుతుందని చైనా పేర్కొ న్న విషయం తెలిసిందే. గత జూన్ నుంచి హాకాంగ్లోలో కొన్ని అరాచక శక్తులు చేలరేగుతున్నాయని, ఇటువంటి వేర్పాటువాద, విచ్చిన్నకర శక్తులకు ముకుతాడు వేసేందుకు ప్రస్తుతం ఉన్న లీగల్ సిస్టమ్, ఎన్ఫోర్స్మెంట్ మెకానిజంను మెరుగుపర్చడమే ఈ చట్టం ఉద్దేశమని చైనా కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
ఇటువంటి సమయంలో ఎన్పిసి నిర్ణయం పూర్తిగా చైనా అంతర్గత వ్యవహారమని, ఈ విషయంలో జోక్యం చేసుకునేందుకు ఏ ఇతర దేశానికి హక్కు లేదని లిజియాన్ స్పష్టం చేశారు. హాంకాంగ్ వ్యవహారంలో విదేశీ శక్తుల జోక్యాన్ని తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అమెరికా వ్యాపారాలకు, పెట్టుబడులకు హాంకాంగ్ ప్రధాన కేంద్రంగా ఉందని తెలిపారు. అమెరికాకు చెందిన దాదాపు అన్ని భారీ కంపెనీలు హాంకాంగ్లో ఉన్నాయని, 1300కు పైగా కంపెనీలు, 300 ప్రాంతీయ ప్రధాన కార్యాలయాలు, 400 ప్రాంతీయ కార్యాలయాలు హాంకాంగ్లో ఉన్నాయని చెప్పారు. గత దశాబ్ధ కాలంలో హాంకాంగ్తో వాణిజ్యం ద్వారా అమెరికా దాదాపు 297 బిలియన్ డాలర్ల మేర లాభం పొందిందని, అమెరికా వాణిజ్య భాగస్వామ్యుల్లో హాంకాంగ్ మొదటి స్థానంలో ఉందని పేర్కొన్నారు. ఇటువంటి సమయంలో హాంకాంగ్లో వాణిజ్యం ద్వారా అభివృద్ధి చెందేందుకు అమెరికా కంపెనీలను ఆహ్వానించేందుకు తాము అన్ని వేళలా సిద్ధంగా ఉంటాయని, అయితే హాంకాంగ్ వ్యవహారాలు, చైనా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని అమెరికాను కోరారు.