Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-భారత్, చైనాల ప్రకటన
న్యూఢిల్లీ, వాషింగ్టన్ : సరిహద్దు వివాదంపై పరిష్కారానికి మధ్యవర్తిత్వం వహిస్తానన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదనను భారత్, చైనాలు నిర్ద్వంద్వంగా తిరస్కరించాయి. సరిహద్దు సమస్యలపై ప్రధాని మోడీతో మాట్లాడానని ట్రంప్ చేసిన ప్రకటనపై పలు ప్రశ్నలను లేవనెత్తాయి. ఈ మేరకు మధ్యవర్తిత్వానికి సంబంధించి బుధవారం ట్రంప్ ట్విట్టర్ పోస్టు ద్వారా చేసిన ప్రకటనకు స్పందనగా చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జావో లిజియాన్ శుక్రవారం మాట్లాడుతూ సరిహద్దులోని పరిస్థితులు స్థిరంగా, నియంత్రణలోనే ఉన్నాయని, తమ రెండు దేశాలే ఈ సమస్యను సొంతంగా పరిష్కరించుకోగలవని అన్నారు. ఈ విషయంలో ఏ ఇతర దేశం ప్రమేయం అక్కర్లేదని స్పష్టం చేశారు. మరోవైపు న్యూఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో భారత తరపు నుంచి విదేశాంగశాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ మాట్లాడుతూ సమస్య పరిష్కారానికి భారత్, చైనాలను ఇటు మిలటరీ పరంగా, ఇటు ద్వైపాక్షిక ఇప్పటికే చర్చలు ప్రారంభించాయని అన్నారు. అన్ని మార్గాలను వినియోగించుకొని సరిహద్దు సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకుంటామని చెప్పారు. ట్రంప్ ప్రస్తుతం చెప్పిన విషయం అబద్దమని పేర్కొంది. గతంలో కూడా కాశ్మీర్ విషయంలో మధ్యవర్తితత్వం వహిస్తానన్న ట్రంప్ ప్రకటనను భారత ప్రభుత్వం తిరస్కరించిన విషయం తెలిసిందే. భారత్, అమెరికాకు చెందిన బలగాలు ఇటీవలనే సంబంధాలను ఏర్పరచుకున్నాయి. ఈ సమయంలో భారత రక్షణ మంత్రి రాజనాధ్ సింగ్, అమెరికా రక్షణశాఖ కార్యదర్శి మార్క్ ఎస్పర్ల మధ్య జరిగిన టెలిఫోన్ సంభాషణకు చెందిన వివరాలను పెంటగాన్ శుక్రవారం విడుదల చేసింది. ప్రాంతీయ సమస్యలపై ఇద్దరు చర్చించుకున్నట్టు తెలిపింది. ఇండో పసిఫిక్ ప్రాంతంలో భారత్ నాయకత్వానికి మార్క్ ఈ సందర్భంగా సమర్ధించారు. రక్షణ రంగానికి సంబంధించిన ద్వైపాక్షిక సహకారంపై ఇద్దరూ చర్చించినట్టు, రక్షణ భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు నిర్ణయం తీసుకున్నట్టు భారత రక్షణ మంత్రిత్వశాఖ కూడా పేర్కొంది.