Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-హాంకాంగ్లో జాతీయ భద్రతా చట్టం అమలు
బీజింగ్ : హాంకాంగ్ ప్రత్యేక పరిపాలన ప్రాంతం(హెచ్కెఎస్ఎఆర్)లో లీగల్ సిస్టమ్, ఎన్ఫోర్స్మెంట్ మెకానిజాన్ని మెరుగుపరిచేందుకు జాతీయ భద్రతా చట్టం అమలును చైనా నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్(ఎన్పీసీ) తాజాగా ఆమోదించింది. 'ఒక దేశం, రెండు వ్యవస్థలు' అన్న పునాదిని బలపరిచేందుకు ఈ చట్టం ఉపయోగపడుతుందని విశ్లేషకులు అభిప్రాయపడు తున్నారు. హెచ్కెఎస్ఎఆర్ జాతీయ భద్రతకు రక్షణ కల్పిస్తూ లీగల్ వ్యవస్థలో ఉన్న లొసుగులును గుర్తిస్తూ 'ఇక దేశం, రెండు వ్యవస్థలు'ను సమర్ధవంతంగా అమలు చేసేందుకు ఎన్పీసీ తీసుకున్న నిర్ణయం ఉపయుక్తంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ నిర్ణయం తీసుకోవడంలో చైనా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు జాతీయ భద్రతలో తనకు ఉన్న బలమైన సంకల్ప శక్తిని చూపించిందని అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో హాంకాంగ్ ప్రయోజనాలకు రక్షణ కల్పించడంలో, స్వదేశీయులకు భరోసా ఇవ్వడంలో చైనా విధేయత చాటుకుందని, హాంకాంగ్లో ఈ చట్టం అమలు సుదీర్ఘ ప్రభావాలను కలిగి ఉందని పేర్కొన్నారు.
ఒక దేశం అభివృద్ధి చెందాలన్నా, మనుగడ సాధించాలన్నా జాతీయ భద్రత అత్యంత అవసరమైన అంశం. అది దేశానికి చెందిన కోట్లాది మంది ప్రయోజనాలను కూడా కాపాడుతుంది. హాంకాంగ్తో ఒప్పందం కుదిరిన నాటి నుంచి చైనా 'ఒక దేశం, రెండు వ్యవస్థలు' అన్న సూత్రాన్ని ఖచ్చితంగా అమలు చేస్తోంది. హాంకాంగ్ను ' హాంకాంగ్కు చెందిన వారు పాలిస్తున్నారు. దానికి ఉన్నత శ్రేణి స్వతంత్రత ఉంది. హాంకాంగ్లో ఒక దేశం, రెండు వ్యవస్థల విజయవంతాన్ని ప్రపంచమంతా గుర్తించింది' అని పలువురు విశ్లేషకులు, మేధావులు పేర్కొన్నారు. అయితే రోజులు గడిచే కొద్దీ అక్కడ కొన్ని విదేశీ శక్తులు ఆందోళనకు ఆజ్యం పోశాయి. వేర్పాటువాదాన్ని రెచ్చగొడుతూ వ్యవహరించాయి. ఈ నేపథ్యంలో హాంకాంగ్లో జాతీయ భద్రతకు సంబంధించి కొత్త సమస్యలు, సవాళ్లు ఎదురయ్యాయి.
నేరస్తులను చైనాకు తీసుకెళ్లేందుకు గత ఏడాది జూన్లో తీసుకువచ్చిన సవరణ బిల్లు ప్రతిపాదనలకు వ్యతిరేకంగా హాంకాంగ్ వ్యాప్తంగా ఆందోళనలు రేగిన విషయం తెలిసిందే. 'హాంకాంగ్ స్వతంత్ర'కు చెందిన సంస్థలు, స్థానికుల కార్యకలాపాలను చైనా చవిచూసింది. ఈ సమయంలో పెద్దయెత్తున హింస చెలరేగంతో పాటు, ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగాయి. ఇంకా హాంకాంగ్ వ్యవహారాల్లో విదేశీ శక్తుల ప్రమేయం కూడా భారీగా పెరిగింది. ఈ మొత్తం వ్యవహారం 'ఒక దేశం, రెండు వ్యవస్థలు' అన్న పునాది సుత్రానికి ఛాలెంజ్ విసిరింది. చట్టాలు తుంగలో తొక్కబడ్డాయి, దేశ సార్వభౌమత్వం, భద్రత, అభివృద్ధి, ఇతర ప్రయోజనాలకు తీవ్ర ప్రమాదం తెచ్చిపెట్టాయి. ఇటువంటి సమయంలో చట్టాలకు అనుగుణంగా ఉల్లంఘిస్తూ జరుగుతున్న కార్యకలాపాలను నిరోధించేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం చైనాకు ఏర్పడింది. ప్రస్తుతం హాంకాంగ్లో జాతీయ భద్రతకు భంగం కలిగించే వివిధ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. హాంకాంగ్లో జాతీయ భద్రతకు రక్షణ కల్పించడంలో చట్టపరంగా ఉన్న లోపాలు, ఎన్ఫోర్స్మెంట్ మెకానిజం లేమి ఇందుకు కారణంగా కనిపిస్తున్నాయి. ఇటువంటి విధ్వంసక కార్యకలాపాలు ఇంకా కొనసాగితే అది హాంకాంగ్లో భద్రత అనేది లేకుండా పోతుందని, అక్కడి ప్రజల ప్రయోజనాలు దెబ్బతింటాయని, హాంకాంగ్, 'ఒక దేశం, రెండు వ్వవస్థలు' భవిష్యత్తు దెబ్బతింటుందని, ఈ నేపథ్యంలో అక్కడ కూడా జాతీయ భద్రతా చట్టాన్ని అమలు చేయాలని చైనా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.