Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బీజింగ్: తాము తయారు చేసిన కరోనా వైరస్ (కోవిడ్-19) వ్యాక్సిన్ ఈ ఏడాది చివరి నాటికి మార్కెట్లోకి రావచ్చునని చైనా ప్రభుత్వ ఆస్తుల పర్యవేక్షణ, పరిపాలన కమిషన్ (ఎస్ఏఎస్ఏసీ) తెలిపింది. రాయిటర్స్ నివేదిక ప్రకారం.. చైనా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వీచాట్లో ఎస్ఏఎస్ఏసీ ఈ సమాచారాన్ని వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం.. వూహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోలాజికల్ ప్రొడక్ట్స్, బీజింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోలాజికల్ ప్రొడక్ట్స్లు ఈ టీకాను తయారు చేశాయి. రెండు వేల మందికి పైగా రోగులకు ఈ టీకాను ఇచ్చారు. ఈ టీకా ఈ ఏడాది చివరికి లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో మార్కెట్లోకి రావచ్చునని ఎస్ఏఎస్ఏసీ తెలిపింది. ఈ టీకా క్లినికల్ ట్రయల్ రెండవ దశకు చేరుకున్నది. వూహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోలాజికల్ ప్రొడక్ట్స్, బీజింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోలాజికల్ ప్రొడక్ట్స్ రెండూ ప్రభుత్వ ఔషధ సంస్థల సమూహం సినోఫార్మ్తో అనుబంధంగా ఉన్నాయి. సైనోవియం నిర్వహణను ఎస్ఏఎస్ఏసీ పర్యవేక్షిస్తుంది. బీజింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోలాజికల్ ప్రొడక్ట్స్ ప్రతి ఏటా 10 నుంచి 12 కోట్ల మోతాదులో వ్యాక్సిన్ ఉత్పత్తి చేయగలదని నివేదిక పేర్కొంది. అయితే, చైనాలో మొత్తం ఐదు సంస్థలు కరోనా వైరస్ వ్యాక్సిన్లపై పరీక్షలు జరుపుతున్నాయి. అయితే, బీజింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోలాజికల్ ప్రొడక్ట్స్ తయారుచేసిన టీకాపై మరే సంస్థ స్పందించలేదు. మోడరనా కంపెనీ ఆఫ్ అమెరికా, బ్రిటన్కు చెందిన ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం తయారుచేసిన కరోనా వ్యాక్సిన్ కూడా ప్రారంభ పరీక్షల్లో విజయం సాధించినట్టు ప్రకటించాయి.