Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-అంతర్జాతీయ సమాజానికి నోబెల్ గ్రహీతలు, ప్రముఖుల విన్నపం
ఢాకా : కరోనా సంక్షోభం నేపథ్యంలో నిస్సహాయ ప్రజలకు అండగా ఉండాల్సిన అవసరం ఉందని 18 మంది నోబెల్ బహుమతుల గ్రహీతలతో సహా వంద మంది ప్రముఖలు విజ్ఞప్తి చేశారు. ఇందులో భాగంగా అంతర్జాతీయ సమాజం కరోనా వ్యాక్సిన్ను అత్యవసర వస్తువుగా పరిగణించి ఉచితంగా అందించాలని కోరారు. ఈ మేరకు ఆదివారం విడుదల చేసిన ఈ ప్రకటనపై నోబెల్ గ్రహీతలు, ఇతర ప్రముఖులు సంతకాలు చేసినట్లు ఢాకా కేంద్రంగా ఉన్న యూనస్ సెంటర్ వ్యవస్థాపకుడు, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మహ్మద్ యూనస్ పేర్కొన్నారు. పలుదేశాల మాజీ అధ్యక్షులు, రాజకీయ నాయకులు, ప్రపంచ ప్రసిద్ధ కళాకారులు ఈ చొరవ తీసుకున్న వారిలో ఉన్నారు.
ఈ ప్రకటనపై సంతకాలు చేసిన వారి జాబితాలో రష్యా మాజీ అధ్యక్షుడు మైఖైల్ గోర్బచేవ్, మలాలా యూసఫ్జారు, హాలీవుడ్ నటుడు జార్జి క్లూనీ, ధామస్ బాచ్, అండ్రియా బోసెల్లి, కైలాస్ సతార్ధి, దక్షిణాఫ్రికాకు చెందిన మత బోధకుడు ఆర్చ్ బిషప్ దెస్మండ్ టూటు, తదితరులు ఉన్నారు. కరోనా వ్యాక్సిన్ను అందుబాటులోకి తెచ్చేందుకు ఏకం కావాల్సిందిగా ప్రపంచ దేశాలకు చెందిన ప్రభుత్వాలు, ఐక్యరాజ్యసమితి, ప్రపంచ ఆరోగ్య సంస్థ, కార్పొరేషన్లు, మీడియా సంస్థలకు వారు పిలుపునిచ్చారు. ఎటువంటి వివక్ష లేకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న బలహీనవర్గాల ప్రజలకు అండగా ఉండేందుకు అందరూ సంయుక్త బాధ్యత తీసుకోవాలని వారు కోరారు.
ఈ కరోనా వైరస్ మహమ్మారి అన్ని దేశాల ఆరోగ్య వ్యవస్థలో ఉన్న బలాలను, బలహీనతలను బహిర్గతం చేసిందని పేర్కొన్నారు. ఆరోగ్య సదుపాయాలను అందించడంలోని అవరోధాలను, అసమానతలను ఇది తేటతెల్లం చేసిందని అన్నారు. ఇక రానున్న రోజుల్లో కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం ఎంతవరకూ విజయవంతం కాగలదనేది, అది ఎంత మేరకు అందరికీ అందుబాటులో ఉంటుందనే విషయంపై అధారపడి ఉంటుందని పేర్కొన్నారు.