Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-తీవ్ర సంక్షోభంలో కార్మిక వర్గం
-బ్రెజిలియన్ కమ్యూనిస్టు పార్టీ విమర్శ
బ్రెసిలియా : బ్రెజిల్లో నెలకొన్న ఆరోగ్య సంక్షోభం, అధ్యక్షుడు జెయిర్ బోల్సోనారో, ఉపాధ్యక్షుడు మరావో ప్రభుత్వ అనుసరిస్తున్న విధానాలతో దేశంలోని కార్మిక వర్గం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని, కార్మికుల ఇబ్బందులు కొనసాగుతున్నాయని బ్రెజిలియన్ కమ్యూనిస్టు పార్టీ(పీసీబీ) పేర్కొంది. ఈ మేరకు పార్టీకి చెందిన జాతీయ రాజకీయ మండలి తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. దేశంలో ఉధృతంగా ఉన్న కరోనా మహమ్మారి నియంత్రణ పట్ల బోల్సోనారో సర్కార్ నిర్లక్ష్యంతో వహిస్తోందని, దీంతో పరిస్థితి కార్మికులపై 'మారణహోమం'గా తయారైందని విమర్శించింది. సైన్యం, కార్పొరేట్ల సంయుక్త నియంతృత్వం నుంచి 1964 తిరుగుబాటు ద్వారా సాధించుకున్న సామాజిక హక్కులు, ప్రజాస్వామ్య స్వేచ్ఛపై నేడు దాడి జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలో ఇప్పటికే 12 లక్షలకు మందికి పైగా కరోనా భారిన పడ్డారనీ, దాదాపు 55 వేల మరణాలు చోటుచేసుకున్నాయని తెలిపింది. మొదట్లో పెద్ద నగరాల్లో ఈ ఉన్న కరోనా ఇప్పుడు పట్టణాలు, ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపించిందనీ, అనేక మంది కార్మికులు చనిపోతున్నారనీ, వైరస్ వ్యాప్తి ప్రభావం ప్రధానంగా సరైన పారిశుధ్యం, నీటి సదుపాయం అందుబాటులో లేని మురికివాడలు, కార్మికులు నివసించే ప్రాంతాలపై అధికంగా ఉందని పీసీబీ పేర్కొంది. 5 కోట్ల మంది ఉన్న కార్మిక జనాభాకు కనీసం ఆదాయం కల్పించేందుకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదని విమర్శించింది.
ఆర్థిక కార్యకలాపాల పునరుద్ధరణ పేరుతో వ్యాపారవర్గాల ఒత్తిడి మేరకు అన్ని ప్రాంతాల్లో గవర్నర్లు, మేయర్లు డబ్ల్యూహెచ్ఓ నిబంధనలకు విరుద్ధంగా సడలింపులు ఇచ్చారని తెలిపింది. ఈ నేపథ్యంలో కరోనా బాధితుల సంఖ్య మరింత ఎక్కువైందనీ, కేసుల నమోదు, మరణాల్లో భారీగా పెరుగుదల కనిపిస్తోందని పేర్కొంది. కరోనాపై పోరులో లాక్డౌన్ అనేది అనివార్యం, కానీ పెట్టుబడిదారుల ప్రయోజనాలే ముఖ్యంగా ఉన్న బోల్సోనారో ప్రభుత్వ వైఖరి బ్రెజిల్ కార్మికుల పట్ల మరణశాసనంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించింది. దేశంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్న వెయిన్ట్రాబ్ రాజీనామా, అవినీతి కేసులో అధ్యక్షుడి కుమారుడు ఫ్లావియో సన్నిహితుడు క్వైరోజ్ అరెస్టు, బోల్సోనారోకు చెందిన మాజీ రాజకీయ పార్టీ పీఎస్ఎల్కు చెందిన పార్లమెంట్ సభ్యులపై విచారణ వేగవంతం వంటి వాటితో దేశంలో రాజకీయ సంక్షోభం ఏర్పడిందని పీసీబీ పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆయనకు మెజార్టీ ఉన్నా దేశానికి పాలించేందుకు నైతికంగా అనర్హుడని తెలిపింది. ఇదే సమయంలో అమెరికా కరోనా వ్యాప్తి నియంత్రణలో వైఫల్యం, జాతివివక్ష వ్యతిరేక ఆందోళనతో ట్రంప్పై తీవ్ర విమర్శలు వస్తున్నాయని పేర్కొంది.