Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-వేగం పుంజుకున్న కరోనా:డబ్ల్యూహెచ్ఓ
వాషింగ్టన్ : ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి వేగం పుంజుకుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) హెచ్చరించింది. డిసెంబర్ నుంచి ఇప్పటి వరకూ నమోదైన మొత్తం కోటి దాటిన కేసుల్లో దాదాపు 60 శాతం ఒక్క జూన్ నెలలోనే వెలుగు చూశాయనీ, దీన్ని చూస్తుంటే కరోనా విసృతి మరింత దారుణంగా పెరుగుందున్న సంకేతాలే కనిపిస్తున్నాయే తప్ప తగ్గే సూచనలు లేవని పేర్కొంది. డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అథనామ్ గెబ్రేయెసెస్ బుధవారం మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఒక్కరోజులోనే రికార్డు స్థాయిలో లక్ష 60 వేలకు పైగా కేసులు నమోదయ్యాయని చెప్పారు. ఇటీవల నుంచి చూసుకుంటే అమెరికా మొదటిసారిగా బుధవారం ఒక్కరోజేలోనే 50 వేల కొత్త పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఈ నేపథ్యంలో కరోనాపై పోరుకు సంబంధించి సమగ్ర విధానాలను అవలంభించాలని దేశాలకు సూచించారు. 'ప్రతి కేసులో గుర్తించడం, ఐసోలేట్ చేయడం, పరీక్షలు నిర్వహించడంతో పాటు ప్రతి కాంటాక్టును గుర్తించి వారిని క్వారంటైన్ చేయాలి' అని టెడ్రోస్ పేర్కొన్నారు. ఆరోగ్య కార్యకర్తలను సిద్ధం చేయడంతో పాటు వారికి తగిన శిక్షణ ఇవ్వాలనీ, ప్రజలకు స్వీయ రక్షణకు సంబంధించి సూచనలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. విచ్ఛిన్నకరమైన విధానాలను అవలంభించే దేశాలకు రానున్న కాలంలో సుదీర్ఘమైన, కష్టమైన కాలం ఎదురుకానుందని హెచ్చరించారు. గత ఆరు నెలల్లో నేర్చుకున్న పాఠం ఏంటంటే..' దేశంలోని పరిస్థితులు ఎలా ఉన్నా వైరస్ను ఎదుర్కోవడంలో ఎటువంటి ఆలస్యం చేయకూడదు. లేకుండా అది మొత్తం పరిస్థితులను తారుమారు చేస్తుంది' అని టెడ్రోస్ పేర్కొన్నారు. వైరస్ విసృతి నేపథ్యంలో బహిరంగ ప్రదేశాలు, జనసమూహం ఉండే ప్రాంతాల్లో మాస్కులు ధరించడం ద్వారా ప్రాణాలను రక్షించుకోవచ్చని ఆయన మరోసారి పేర్కొన్నారు.అమెరికాలో కాలిపోర్నియా నుంచి ఫ్లోరిడా వరకూ రెస్టారెంట్లు, బార్లను మూసివేశారు. భారీ కేసుల నమోదు నేపథ్యంలో ఈనెల 4న జరగనున్న వారాంతపు వేడుకలకు హాజరుకానున్న సందర్శకులకు పలు రాష్ట్రాలు 14 రోజుల క్వారంటైన్ విధించాయి.