Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బీజింగ్ : కరోనా మూలాలను గుర్తించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యుహెచ్ఓ) స్పెయిన్ వంటి ఇతర దేశాల్లో కూడా పర్యటించాలని చైనా ప్రభుత్వ సీనియర్ ఆరోగ్య సలహాదారు వాంగ్ గువాంగ్ఫా అన్నారు. 2019, మార్చిలోనే స్పెయిన్లోని బార్సాలోనాలో వ్యర్థనీటిలో కరోనా వైరస్ను గుర్తించినట్లు మీడియాలో వార్తలు వచ్చాయని తెలిపారు. ఇందుకుగానూ ఆయన ఇంకా ధ్రువీకరించబడని బార్సిలోనా యూనివర్సిటీ శాస్త్రవేత్తల అధ్యయనాన్ని ప్రస్తావించారు. వైరస్ గుర్తింపునకు మొదటి ఆధారంగా ఉన్న ఈ అధ్యయనంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. వైరస్ మూలాలను గుర్తించే నిమిత్తం డబ్ల్యుహెచ్ఓ బృందం వచ్చే వారం చైనాలో పర్యటించనున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 'స్కోపింగ్ మిషన్' పేరుతో డబ్ల్యుహెచ్ఓ ఈ పర్యటన చేపడుతోంది. ఈ నేపథ్యంలో వాంగ్ గువాంగ్ఫా గ్లోబల్స్ టైమ్స్ అనే మీడియా సంస్థతో మాట్లాడుతూ వైరస్ వ్యాప్తి గొలుసులో చైనా ఒక లింక్ మాత్రమేనని అన్నారు. కరోనా మూలానికి చెందిన పలు అధ్యయనాల దృష్ట్యా బృందం ఇతర దేశాల్లో కూడా పర్యటించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.