Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రవాసీ కోటా ముసాయిదా బిల్లు ఆమోదం
- వెనక్కి రానున్న 8 లక్షల మంది భారతీయులు
నవతెలంగాణ-మాలియా(కువైట్)
కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కువైట్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తమ దేశంలో ప్రవాసీయుల సంఖ్యను తగ్గించుకునేందుకు ప్రవాసీ కోటా ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలిపింది. కువైట్ ప్రధానమంత్రి షేక్ సబా అల్ ఖలీద్ అల్ సబా ప్రతిపాదించగా కువైట్ జాతీయ శాసనసభ కమిటీ దాన్ని ఆమోదించింది. దీంతో ఆ దేశంలో 70 శాతంగా ఉన్న ప్రవాసీయులు మరో ఏడాదిన్నరలోపు 30 శాతానికి పడిపోనున్నారు. కువైట్లో మొత్తం 43 లక్షల జనాభా ఉండగా అందులో విదేశీయులు 30 లక్షలు, భారతీయులు 14 లక్షల వరకు ఉన్నట్టు అంచనా. ఈ బిల్లుతో ప్రస్తుతం 8 లక్షల మంది స్వదేశానికి తిరిగిరానున్నట్టు తెలుస్తోంది. చమురు ధరలు తగ్గిపోవడం, కరోనా విజృంభించడంతో ఈ సంస్కరణలకు నిర్ణయం తీసుకున్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతోపాటు వీసా ట్రేడింగ్ జరిగి ఎక్కువ మంది ఆ దేశంలో ఉన్నట్టు సర్కారు భావించింది. ఈ పరిణామాల నేపథ్యంలో కువైట్లో మరొకసారి క్షమాభిక్షకు అవకాశం కల్పించనున్నట్టు సమాచారం.
కార్మికులపైనే మొదటి వేటు
అక్కడి సర్కారు నిర్ణయించిన ప్రకారం మొదట కార్మికులను, ఆ తర్వాత వీసా కొనుగోలు చేసిన వచ్చిన వారిని తొలగించనున్నారు. అక్రమంగా నివసిస్తున్న వారిని, ఆదాయం తక్కువ ఉన్న లేబర్స్ను పంపివేయనున్నారు. అందులోనూ 15 ఏండ్లు పనిచేసిన వారిపై దృష్టి సారించనున్నారు. ఉన్నత స్థాయిలో ఉన్నవారు మినహా మిగతావారు వెనక్కి రాక తప్పదు. తెలుగు కార్మికులు సుమారు 2 లక్షల మంది వరకు ఉండగా ఎక్కువ మంది కనీస వేతనాలు కూడా పొందడం లేదు. భవన నిర్మాణ కార్మికులు, క్లీనర్లు, అన్స్కిల్డ్ లేబర్స్ అధికం. అటువంటి కార్మికులకే అధికంగా నష్టం జరుగుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. తెలంగాణ నుంచి ఎంతోమంది నిరుద్యోగ యువత కుటుంబ పోషణ కోసం గల్ఫ్ బాట పట్టింది. కువైట్ సర్కారు తీసుకున్న నిర్ణయంతో అప్పులు కూడా తీరిపోకుండా ఇంటిబాట పట్టేవారు అధికంగా ఉన్నట్టు స్వచ్ఛంద కార్యకర్త మురళీధర్రెడ్డి గంగుల 'నవతెలంగాణ'కు వెల్లడించారు. గల్ఫ్ బోర్డు లేని లోటు ఈ సందర్భంగా వెల్లడైందని, ప్రభుత్వాలు ఇప్పటికైనా స్పందించి తిరిగి వచ్చేస్తున్నవారికి ఉపాధి కల్పించాలని కోరారు. టికెట్ ఖర్చులకు ప్రభుత్వాలే సహాయ సహకారాలు అందించాలన్నారు. అమ్నెస్టీకి అవకాశం కల్పిస్తే ఔట్పాస్లు కూడా వెంటనే అందించేలా అధికారుల చర్యలు తీసుకోవాలన్నారు.