Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-విదేశీ విద్యార్థులకు ట్రంప్ సర్కార్ షాక్
వాషింగ్టన్ : అమెరికాలోని విదేశీ విద్యార్థులకు ఆ దేశ ప్రభుత్వం షాకిచ్చింది. కరోనా వైరస్ ఉధృతి నేపథ్యంలో అమెరికాలో డిగ్రీ చదువుతున్న విదేశీ విద్యార్థులు తమ విద్యాసంస్థలు పూర్తిస్థాయిలో ఆన్లైన్ తరగతులకు మారితే దేశం విడిచివెళ్లిపోయాలని ప్రకటించింది. లేదా బహిష్కరణకు గురయ్యే ప్రమాదం, ఇమిగ్రేషన్ తీసుకునే చర్యలు ఎదుర్కోవాల్సిఉంటుందని హెచ్చరింది. మొత్తానికి వారు ఒక సెమిస్టర్ కోల్పోవాల్సి ఉంటుంది. అమెరికా ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ఐసీఈ) సోమవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.
అలాగే వచ్చే విద్యా సంవత్సరానికి గానూ పూర్తి స్థాయిలో ఆన్లైన్ క్లాసులు నిర్వహించే స్కూళ్లలో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు విదేశాంగ శాఖ వీసా జారీ చేయదు. అలాంటి వారిని దేశంలోకి అనుమతించదు. సెప్టెంబరు నుంచి డిసెంబర్ వరకు సాగే సెమిస్టర్ను ఉద్దేశించి ఈ ప్రకటన చేశారు. ఇప్పటికే అమెరికాలో నమోదు చేసుకున్న విదేశీ విద్యార్థులు వ్యక్తిగతంగా బోధన చేసే పాఠశాలలకు బదిలీ చేసుకోవాల్సి ఉంటుంది.
ప్రస్తుతం నమోదు చేసుకున్న విద్యార్థులు దేశం విడిచివెళ్ళాలి లేదా చట్ట ప్రకారం ఉండటానికి వ్యక్తిగతంగా బోధన చేసే పాఠశాలకు బదిలీ చేసుకోవడం, ఇతర చర్యలు తీసుకోవాలని తెలిపింది. లేదా ఇమిగ్రేషన్, చట్ట ప్రకారం తీసుకునే చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని పేర్కొంది.
కరోనా వైరస్ నేపథ్యంలో అంతర్జాతీయ ప్రయాణ నిబంధనలు కఠినతరం చేయడంతో అమెరికాలోని విదేశీ విద్యార్థులు తమ స్వదేశాలకు వెళ్లడం కష్టంగా మారింది. అలాగే అమెరికా బయట వున్న విద్యార్థులు తమ కోర్సుల కోసం అమెరికాలోని కాలేజీలకు, విశ్వవిద్యాలయాలకు చేరుకోవడంపై కూడా అనిశ్చితి నెలకొంది. ఇలాంటి సమయంలో అమెరికా ఈ ప్రకటన చేసింది.కరోనా వైరస్ పేరుతో ట్రంప్ ప్రభుత్వం ఇమిగ్రేషన్ విధానంలో అనేక మార్పులు చేసింది. జూన్ 22 చేసిన ప్రకటనతో డిసెంబర్ 31 వరకూ దేశంలోకి చట్టబద్ధమైన వలసలను గణనీయంగా తగ్గించింది.
కాగా, ట్రంప్ ప్రభుత్వం తాజా చర్యపై హార్వర్డ్ విశ్వవిద్యాలయం అధ్యక్షుడు లారీ బాకోవ్ తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేశారు. కొత్త మార్గదర్శకాలు విదేశీ విద్యార్థులు, ముఖ్యంగా ఆన్లైన్ ప్రోగ్రామ్స్లో ఉన్న వారికి సంక్లిష్ట సమస్యగా ఉన్నాయని అన్నారు. ఇది తెలివిలేని, క్రూరమైన విధానమని యుఎస్ సెనేటర్ ఎలిజబెత్ వారెన్ ట్వీట్ చేశారు. అమెరికా ప్రభుత్వ తాజా నిర్ణయం భారత్పై అధిక ప్రభావం చూపించే అవకాశం ఉంది. 2017, 18 లెక్కల ప్రకారం అమెరికాకు చైనా (47,87,732) తరువాత అధిక సంఖ్యలో విదేశీ విద్యార్థులు భారత్ (2,51,290) నుంచే వెళతారు.