Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-దిగువ,మధ్య ఆదాయం ఉన్న ఇండియా, ఇథియోపియాలో ఎక్కువ
- అరికట్టడానికి ప్రభుత్వాలు, ఎంఎన్సీ లు నడుంబిగించాలి : అధ్యయనం
ఈ రెండు దేశాల్లో పౌష్టికాహారలోపం
లండన్ : అభివృద్ధి చెందుతున్న దేశాలలోనే పౌష్టికాహారలోపం అధికంగా ఉన్నదనీ.. అది ఆసియా లోని భారత్, ఆఫ్రికాలోని అత్యంత వెనకబడిన దేశం ఇథియోపియాలలో ఎక్కువగా ఉన్నదని ఒక అధ్యయనంలో తేలింది. దీని ప్రభావం వ్యాపార కార్యకలాపాల మీదా పడుతున్నది. ఈ దేశాల్లో పోషకాహారలోపాన్ని తరిమికొట్టాలంటే ఆయా ప్రభుత్వాలు,ఇందుకోసం పని చేస్తున్న బహుళ జాతి సంస్థలు మరింత కృషి చేయవలసిన అవసరాన్ని నివేదిక నొక్కి చెప్పింది. ఈ మేరకు లండన్ వేదికగా పని చేస్తున్న చాతమ్ హౌస్, వివిడ్ ఎకనామిక్స్ సంయుక్తంగా.. 'అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వ్యాపారం పై పోషకాహారలోపం, ఊబకాయం ప్రభావం' అనే అంశం పై విశ్లేషణ చేపట్టింది. నివేదికలో పేర్కొన్న అంశాల ప్రకారం.. దిగువ, మధ్య ఆదాయ దేశాల్లో వ్యాపార కార్యకలాపాలు కీలక పాత్ర పోషిస్తాయి. కానీ పోషకాహారలోపం, ఊబకాయం వంటి సమస్యలతో సతమతమయ్యే దేశాల్లో ఉద్యోగులు తరుచూ అనారోగ్యానికి గురవుతారు. అంతేగాక వారు 'సిక్ లీవ్స్' ఎక్కువగా పెడతారు. దీనిద్వారా ఉత్పాదకత తగ్గే ప్రమాదం కూడా ఉంది. దీన్ని అరికట్టడానికి ప్రభుత్వాలు తగిన విధానాలను అనుసరించాల్సి ఉన్నది. ఎంఎన్సీ లు కూడా ఈ దేశాల్లో చేయాల్సిన కృషి చాలా ఉంది. పాలిచ్చే తల్లులకు మద్దతునిచ్చే విధానాలు చేపట్టడం, తల్లీపిల్లలకు నిత్యం చెకప్ లు చేయించడం, వారికి సరైన ఆహారాన్ని అందివ్వడం వంటివి విరివిగా చేపట్టాలి. అంతేగాక ఊబకాయంతో బాధపడేవారికి కరోనా సోకితే చనిపోయే ప్రమాదం ఎక్కువగా ఉన్నదని నివేదిక అభిప్రాయపడింది. పౌష్టికాహారం లేకపోవడం వల్లే చిన్నారులు చాలా మంది ఊబకాయం బారిన పడుతున్నారని తెలిపింది. అయితే కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యం లో ప్రజల ఆదాయాలు నానాటికి దిగజారుతుండడంతో వారి పిల్లలకు పోషకాహరం అందించడంలో ఇబ్బందులు పడతారనీ, దాని ప్రభావం పిల్లల ఎదుగుదల మీద ఉంటుందని ఆందోళన వ్యక్తం చేసింది.