Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రొటెస్ట్ బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళనలు
- నిరసన హక్కును కాలరాస్తూ చట్టం చేయటంపై ఆగ్రహం
- లాఠీలు..బాష్పవాయుగోళాలు.. గ్యాసోలీన్ బాంబులతో ఖాకీల దాడి
ఏథెన్స్ : ప్రజలకు నిరసన తెలియజేసే హక్కు లేదా? స్వేచ్ఛగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయకూడదా? అంటూ గ్రీస్లో ఆందోళనలు, నిరసనలు హోరెత్తుతున్నాయి. ప్రజాందోళనపై పలు నిబంధనలు విధిస్తూ తాజాగా అక్కడి ప్రభుత్వం పార్లమెంట్లో చట్టం చేసింది. దాంతో రాజధాని ఏథేన్స్ సహా పలు నగరాల్లో నిరసనల్లో ఊపందుకున్నాయి. ప్రజలు పెద్ద సంఖ్యలో వీధుల్లోకి వచ్చారు. ముఖ్యంగా ఏథెన్స్లోని పార్లమెంట్ ముందు కొత్త చట్టానికి వ్యతిరేకంగా 10వేలమంది ప్లకార్డులతో ప్రదర్శన చేపట్టారు. వీటిని అడ్డుకోవడానికి పోలీసు బలగాలు పెద్ద ఎత్తున భాష్పవాయు గోళాలను ప్రయోగించాయి. గ్యాసోలీన్ బాంబులతో భద్రత బలగాలు దాడిచేశాయి. ఊహించనివిధంగా ప్రభుత్వం అణచివేత చర్యలతో.. వందలాదిమంది నిరసనకారులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రతిపక్ష పార్టీలు సహా పలు ప్రజా సంఘాలు, ఎన్జీఓలు, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్... కొత్త చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ప్రొటెస్ట్ బిల్లుపై పార్లమెంట్లో చర్చ జరిగిన అనంతరం ఓటింగ్ చేపట్టగా మొత్తం 300 సభ్యుల్లో 187మంది మద్దతు తెలిపారు. ఈ చట్టంలోపేర్కొన్నదాన్ని ప్రకారం, ప్రజా భద్రతకు భంగం వాటిల్లుతుందనే కారణాన్ని చూపి నిరసనలకు అనుమతి ఇవ్వరు. అలాగే కొన్ని ప్రదేశాల్లో మొత్తంగా నిరసనలు చేపట్టడానికి వీల్లేదు. నిరసనల సమయంలో ఎవరైనా గాయపడ్డా, ఆస్తుల విధ్వంసం జరిగినా...దానికి బాధ్యత నిరసనకు పిలుపునిచ్చిన నాయకులదేనని చట్టంలో పొందుపర్చారు. ఈ విధమైన చట్టాన్ని తీసుకొచ్చి ప్రజల గొంతును నొక్కుతారా? అంటూ..ప్రజా సంఘాల నాయకులు, పౌర హక్కుల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈనేపథ్యంలో గురువారం చోటుచేసుకున్న నిరసనల్లో సామాజిక కార్యకర్తలు, ప్రతిపక్ష నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.