Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-అమెరికాలో కార్మికుల ఆందోళన బాట
-వైరస్ పట్ల యాజమాన్యాల స్పందన శూన్యం
వాషింగ్టన్ : కరోనా కేసుల నమోదులో అమెరికా రోజుకో కొత్త రికార్డు నెలకొల్పుతోంది. అక్కడ రోజుకు వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నిర్ధారణ అవుతున్నాయి. ఇటీవలి కాలంలో రోజుకు 50 వేలకు పైగా కేసులు నమోదవుతున్న పరిస్థితి అమెరికాలో నెలకొంది. కరోనా వ్యాప్తిని నియంత్రించడంలో, రక్షణ చర్యలు తీసుకోవడంలో ట్రంప్ సర్కార్ ఘోరంగా విఫలమైందన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఇదే సమయంలో తాము పనిచేస్తున్న సంస్థల్లో యాజమాన్యాలు తగిన కరోనా రక్షణ చర్యలు తీసుకోవడం లేదని పలు రంగాలకు చెందిన కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పనిప్రదేశాల్లో తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని హాస్పిటళ్లు, మాంసం ప్యాకింగ్ ప్లాంట్లు, ఆటోరంగంలోని పరిశ్రమలు, ఇతర ఇతర రంగాల కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఒకవైపు అధిక లాభాల కోసం అధిక ఉత్పత్తి చేయండని యాజమాన్యాలు కార్మికులపై ఒత్తిడి తెస్తుండగా.. తమను వైరస్ బారి నుంచి కాపాడే రక్షణ చర్యలు ఏవి అని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. ఇందులో భాగంగా అమెరికా వ్యాప్తంగా నిరసనలు తీవ్రమౌతున్నాయి.
కొలరడోలోని గ్రీన్లే ప్రాంతంలో ఉన్న జేబీఎస్ బీఫ్ ప్రాసెసింగ్ యూనిట్కు చెందిన వందలాది మంది మాంసం ప్యాకింగ్ కార్మికులు గత శుక్రవారం సమ్మెకు దిగారు. ఈ ప్రాంతంలో దాదాపు 287 మంది కార్మికులు కరోనా బారిన పడగా, ఎనిమిది మంది మృతిచెందారు. యునైటెడ్ ఫుడ్ అండ్ కమర్షియల్ వర్కర్స్(యూఎఫ్సీడబ్ల్యూ)ను ధిక్కరించి ఈ సమ్మెకు వెళ్లినట్టు కార్మికులు తెలిపారు. ప్రమాదకర పరిస్ఠితులకు అనుగుణంగా తగిన రక్షణ చర్యలు, వేతనాలు లేకపోవడంపై వారు ఆగ్రహం వ్కక్తం చేశారు. విధుల్లో చేరాలని కార్మికులకు యాజమాన్యం నుంచి బెదిరింపులు వచ్చినా వారు ఏమాత్రం వెనక్కు తగ్గలేదు. ఈ జేబీఎస్ బీఫ్ ప్రాసెసింగ్ యూనిట్లో దాదాపు 3 వేల మంది కార్మికులు పనిచేస్తుంటారు. కరోనా నుంచి రక్షణ లేని పరిస్థితుల నేపథ్యంలో వీరు తమ విధులు నిర్వర్తిస్తున్నారు. ఒకే మాస్కును రోజుల తరబడి వినియోగిస్తున్నామనీ, అనారోగ్యంగా ఉన్న లేదా కరోనా లక్షణాలు ఉన్న వ్యక్తి పక్కనే ఉన్నా పనిచేయాల్సిందేనని యాజమాన్యం తీవ్రమైన ఒత్తిడి తెస్తోందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆరోగ్య రక్షణ రంగంలో కూడా సమ్మెలు, ఆందోళనలు జరుగుతున్నాయి. దేశంలో ఇప్పటి వరకూ దాదాపు లక్ష మందికి కరోనా సోకగా, 800 మంది మరణించారు. ఏఎంఐటీఏ హెల్త్ ప్రతిపాదించిన కాంట్రాక్టు ప్రపోజల్ను వ్యతిరేకిస్తూ ఇల్లినాయిస్ రాష్ట్రంలోని జోలియట్లో 720 మంది నర్సులు సమ్మెకు దిగారు. రోగి నుంచి నర్సులకు కూడా కరోనా సోకుతున్న నేపథ్యంలో సిబ్బందిని పెంచాలన్న తమ డిమాండ్ను తాజా ప్రతిపాదన పట్టించుకోలేదని వారు విమర్శిస్తున్నారు. దీంతో పాటుగా ఆటోమొబైల్ రంగంలో కూడా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఇటీవలి కాలంలో వచ్చిన నష్టాలను పూడ్చుకునేందుకు యాజమాన్యాలు కార్మికుల ఆరోగ్య రక్షణను ఏమాత్రం పట్టించుకోకుండా బలవంతంగా వాహనాల ఉత్పత్తి చేయిస్తున్నారు. మిచిగాన్లోని గ్లోబల్ ఆటోమోటివ్ సప్లైయర్-డెన్సోలో ఒక కార్మికుడు శుక్రవారం కరోనాతో మృతిచెందారు. ఈ విషయాన్ని కంపెనీ కూడా ధ్రువీకరించింది. మిచిగాన్లోని ఇతర ప్లాంట్లలో కూడా 18 మందికి కరోనా సోకినట్టు తెలిపింది. 10 రోజుల క్రితం టెక్సాస్లోని జనరల్ మోటార్స్ ప్లాంట్లో 23 కేసులు వచ్చాయి. అయినా కూడా ప్లాంట్ను తాత్కాలికంగా మూసివేసేందుకు యాజమాన్యం సుముఖత వ్యక్తం చేయడం లేదు. ఈ విధంగా పలు పరిశ్రమల్లో, రంగాల్లో కార్మికులు కరోనా బారిన పడుతున్నా యాజమాన్యాలు తగిన రీతిలో స్పందించడం లేదన్న విమర్శలు తీవ్రంగా వస్తున్నాయి.