నవతెలంగాణ-హైదరాబాద్ : నిన్న నారా లోకేశ్ పాదయాత్రలో నందమూరి తారకరత్న సొమ్మసిల్లి పడిపోగా, వెంటనే ఆస్పత్రికి తరలించడం తెలిసిందే. తారకరత్నకు తీవ్ర గుండెపోటు వచ్చిందని వైద్యులు నిర్ధారించారు. గత రాత్రి తారకరత్నను మెరుగైన వైద్యం కోసం కుప్పం నుంచి బెంగళూరు తరలించారు. ప్రస్తుతం తారకరత్నకు బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో అత్యవసర చికిత్స జరుగుతోంది. ఈ నేపథ్యంలో, తారకరత్న తండ్రి మోహనకృష్ణ హృదయాలయ ఆస్పత్రికి చేరుకున్నారు. పురందేశ్వరి, నందమూరి సుహాసిని తదితర నందమూరి కుటుంబసభ్యులు కూడా బెంగళూరు తరలివెళ్లారు. టీడీపీ నేతలు దేవినేని ఉమ, నిమ్మకాయల చినరాజప్ప, పరిటాల శ్రీరామ్ ఇప్పటికే ఆస్పత్రికి చేరుకున్నారు. కాసేపట్లో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా బెంగళూరు ఆస్పత్రికి చేరుకోనున్నారు. నారాయణ హృదయాలయ ఆస్పత్రి వద్ద భారీగా పోలీసులను మోహరించారు.