- సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్ భారత రాజ్యాంగ పరిరక్షణ కాంగ్రెస్తోనే సాధ్యమవుతుందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. రాజ్యాంగం మూల సిద్ధాంతమే కాంగ్రెస్ సిద్ధాంతమన్నారు. రాజ్యాంగాన్ని అందించడంలో కృషి చేసిన కాంగ్రెస్ పట్ల నిబద్ధతతో ఉండాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. శనివారం హైదరాబాద్లోని గాంధీభవన్లో పార్టీ నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో బీజేపీ, టీఆర్ఎస్ రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తున్నాయని విమర్శించారు. ప్రధాని మోడీ రాజ్యాంగ విరుద్ధంగా పాలన సాగిస్తున్నారని విమర్శించారు. దేశ ప్రజల భావప్రకటన స్వేచ్ఛను మోడీ సర్కార్ హరించి వేస్తున్నదని చెప్పారు. రాజ్యాంగాన్ని మార్చి మనుధర్మ శాస్త్రాన్ని అమలు చేయాలని బీజేపీ చూస్తున్నదని విమర్శించారు. దేశంలో ఆర్థిక అసమానతలను బీజేపీ పెంచి పోషిస్తున్నదనీ, ఒకరిద్దరు కార్పొరేట్లకే దేశ సంపదను దోచిపెడుతున్నదని విమర్శించారు.