- అధ్యయన బృంద నివేదిక బడులల్లో కళకళలాడుతూ విద్యాభ్యసనాన్ని కొనసాగించాల్సిన పిల్లలు ఇండ్లకే పరిమిత మయ్యారు. బడి తలుపు తెరుచుకోలేదు. కరోనా కత్తి విద్యారంగంపై వేలాడుతూనే వుంది. భవిష్యత్ తరాల చదువు ఏంకానున్నదో అయోమయంగా వున్నది. మార్చిలోనే ఆగి పోయిన చదువు ఎప్పుడు మొదలవుతుందో తెలియదు. ప్రభుత్వాలు ఏమి చెయ్య బోతున్నాయో, ఎలా పరిష్కరించ బోతున్నాయో కూడా ఇప్పటివరకు ఏ రకమైన చర్చా చేయలేదు. ముఖ్యంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రుల అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నమూ చేయలేదు. ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ విద్యా వ్యవస్థను కాపాడుకునే బాధ్యతలో భాగంగా ఉపాధ్యాయ సంఘ బృందం ఈ ఆపద కాలంలోనూ ఇంటింటి సర్వేను నిర్వహించి వారి అభిప్రా యాలను, వాస్తవిక పరిస్థితులను తెలుసుకోవటం బహుశ దేశం లోనే ప్రథమంగా జరిగింది. వాటి వివరాలేమిటో ఇపుడు తెలుసుకుందాం. కరోనా వైరస్ ద్వారా వ్యాపిస్తున్న కోవిడ్-19 వ్యాధి ప్రపంచ దేశాలను భయ కంపితులను చేస్తోంది. ఈ వ్యాధి నిరోధానికి వాక్సిన్గాని, నివార ణకు మందులుకాని సమీప కాలంలో (మార్చి, ఏప్రిల్-2021 వరకూ) రాకపోవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించి వ్యాధి విస్తరణ పెరుగుతున్న దృష్ట్యా ఈ కాలంలో తీసుకోవలసిన జాగ్రత్తలను ఎప్పటి కప్పుడు తెలియ జేస్తోంది. ఈ ప్రభావం అన్ని రంగా లతో పాటు విద్యా రంగంపై పడుతుందని, పాఠశాలలు దీర్ఘ కాలంగా మూత పడటం వలన విద్యార్థుల మానసికస్థితి, సామాజిక ఇబ్బందులు వివరిస్తూ పాఠశాలలు పున:ప్రారంభానికి యునెస్కో, ప్రపంచ ఆరోగ్య సంస్థ ముందు చూపుతో 2020 మార్చి, ఏప్రిల్, మే నెలల్లో రిపోర్టులు తయారు చేసి అన్ని దేశాలకు పంపారు. భారత ప్రభుత్వం వాటిని పరిశీలించి పాఠశాలల పున: ప్రారంభానికి మార్గదర్శకాలు విడుదల చేసింది. పాఠశాలల పున:ప్రారంభ అవసరాన్ని యునిసెఫ్ స్పష్టంగా చెప్పింది. పాఠశాలలు సుదీర్ఘకాలం తెరవకపోతే ఏర్పడే బోధనా సమయాల్లోని అంతరాయాలు, తరగతిగదిలో ఉపాధ్యాయుడు - విద్యార్థుల మధ్య అనుబంధంలో ఏర్పడే అవరోధాలు, పిల్లల నేర్చుకొనే సామర్థ్యంపైన, పాఠశాలల్లో కొనసాగటంపైన తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. ఇప్పటికే అట్టడుగు వర్గాల పిల్లలు పాఠశాలకు దూరంగా ఉన్నారు. ''పాఠశాలలు పున: ప్రారంభం కాక పోతే ధనవంతుల పిల్లల కన్నా 5 రెట్లు మంది పాఠశాలకు దూరమవుతారు. ఇలా పిల్లలు పాఠశాలకు దూరమైతే బాలికలలో లైంగికదోపిడి, బాల్య వివాహాలు, గర్భధారణ ప్రభావము, గృహ హింస పెరుగుతాయి. బాలకార్మిక వ్యవస్థ పెరుగు తుంది. దీర్ఘకాలిక మూసివేతలు రోగనిరోధక కార్యక్రమాలు, మధ్యాహ్న భోజనం, మానసిక ఆరోగ్యం, మానసిక, సామాజిక మద్దతు వంటి పాఠశాల ఆధారిత సేవలకు అంతరాయం కల్పింస్తుంది. పిల్లలు తమ తోటి పిల్లలతో కలిసి పరస్పరం భావాలను పంచుకోవటానికి దూరమై ఒత్తిడికి లోనౌతారు. ఈ ప్రతికూల ప్రభావాలు పేద, అట్టడుగు వర్గాల పిల్లలపై గణనీయ ప్రభావాన్ని చూపుతాయి. ఇది భావి సమాజానికి ప్రమాదకరం. కనుక అన్ని దేశాల్లో విద్యార్థులు, సిబ్బంది, ఉపాధ్యాయులు, వారి కుటుంబాల ఆరోగ్యాలను రక్షించటానికి సహేతుక చర్యలు తీసుకొంటూ పాఠశాలలు పున:ప్రాంరభించటం సురక్షితం'' అని యునిసెఫ్ పేర్కొన్నది. ఈ నివేదికలు, మార్గ దర్శకాలను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్రంలో పాఠ శాలల పున:ప్రారంభ అవకాశాలు, బోధనా విధానాలు, కుటుంబ పరిస్థితి, తల్లిదండ్రుల అభిప్రాయాలు వారి నుండి స్వయంగా సేకరించి ప్రభుత్వానికి అందించి పాఠశాలల పున:ప్రారంభానికి మార్గదర్శకాలు కోరాలని, అది ఒక సామాజిక బాధ్యతగా భావించి తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ జూన్ 22 నుండి 27 వరకు రాష్ట్ర వ్యాప్తంగా సర్వే నిర్వహించింది. ఈ సర్వే రాష్ట్రంలోని 33 జిల్లాలలోని 489 మండలాలలోని 1868 గ్రామాల్లో 1729 మంది ఉపాధ్యాయులు నిర్వహించారు. వారు 22,502 కుటుంబాలను, 39,659 మంది విద్యార్థులను కలిసి సమాచారం సేకరించారు. జులై 3న ఈ సర్వే నివేదికను ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, టియస్యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు విడుదల చేసి, టియస్యుటిఎఫ్ సూచనలతో సహా ముఖ్యమంత్రికి, ఇమెయిల్ ద్వారా పంపించారు. విద్యా శాఖ మంత్రికి, విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి అంద జేశారు. పాఠశాలల ప్రారంభంపై తల్లిదండ్రుల అభిప్రాయాలు ఈ నెల 20 లోగా తెలియజేయాలని ఈ నెల 17న కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ అండర్ సెక్రటరీ రాజేష్ సంప్లే అన్ని రాష్ట్రాల విద్యాశాఖ కార్యదర్శులకు ఒక లేఖ రాశారు. ఆ మేరకు టియస్యుటిఎఫ్ సర్వే నివేదికను కేంద్ర మానవ వనరుల శాఖ కార్యదర్శికి ఈ నెల 20ననే ఇమెయిల్ ద్వారా పంపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఇవే అంశాలపై యంఈఓల ద్వారా అధికారిక సర్వేను నిర్వహిస్తుండటం విశేషం. సర్వే వివరాలు 39,659 మంది విద్యార్థులలో 30,458 మంది ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారు. 9201 మంది ప్రయివేటు పాఠశాలల్లో చదువుతున్నారు. 22,502 కుటుంబాల్లో 8911 కుటుంబాలకు స్మార్ట్ఫోన్లు లేవు. ఫోను ఉన్న 13,591 మందిలో 10,601 మంది తమ పిల్లలకు ఫోన్ ఇచ్చే అవకాశం లేదన్నారు. ఫోన్ ఉన్నా డాటా లేని వారు 7958 మంది. సరిపడ డాటా ఉన్న వారు కేవలం 1495 (11 శాతం) మంది మాత్రమే! ఇంటర్నెట్ ఉన్న కుటుంబాలు కేవలం 2182 (9.7 శాతం) అయితే 19,172 (85.2 శాతం) ఇండ్లలో టి.వి. ఉంది. సర్వే చేసిన పిల్లలు చదివే పాఠశాలల్లో టి.వి లేదని 10,778 మంది, టి.వి ఉండి పని చేయటం లేదని 8282 మంది చెప్పారు. ఇక పాఠశాలలకు ఇంటర్నెట్ ఉందని 5355 మంది, గ్రామ పంచాయితీకి టీవి సౌకర్యం ఉందని 2610 మంది చెప్పారు. ఉండి పని చేయటం లేదని 856 మంది, ఇంటర్నెట్ కనెక్షన్ ఉందని 2903 మంది చెప్పారు. 39,659 మంది పిల్లల్లో 25,859 మంది పాఠశాలకు నడచి వెళ్తుంటే 4561 మంది బస్సులలోనూ, మిగిలినవారు ఇతర వాహనాల్లోనూ (ఆటో, సైకిల్, మొ||) వెళ్తున్నారు. తమ పిల్లలు చదువుతున్న పాఠశాలలో మంచి నీటి వసతి ఉందని 19,689 మంది చెప్తే, ఉన్నా తాగే అవకాశం లేదని 1598 మంది, అసలు మంచి నీటి వసతి లేదని 1215మంది చెప్పారు. పాఠశాలల్లో టాయిలెట్స్, శానిటేషన్ సౌకర్యలు ఉన్నాయని 18,339 తమ పాఠశాలల్లో ఆ సౌకర్యాలు లేవని 162 మంది, పాఠశాలల్లో టాయిలెట్స్ ఉన్నా నీటి సౌకర్యం లేదని 2543 మంది చెప్పారు. ఇంకా తరగతి గదులు భౌతిక దూరం పాటించేందుకు అనుకూలంగా ఉన్నాయని 18,339 మంది చెప్పగా, గ్రామంలో ప్రభుత్వ ఆసుపత్రి ఉందని 7988 మంది చెప్పారు. 6908 మంది తమ ఆసుపత్రులలో డాక్టరు ఉన్నా రని, 15,594 మంది తమకు డాక్టరు అందుబాటులో లేరని చెప్పారు. పాఠశాలల పున: ప్రారంభం విషయంలో 21,017 మంది ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకొని పాఠశాలలు పున: ప్రారంభిం చాలని ఆఫ్లైన్లో (ముఖా ముఖి) బోధన జరగాలని కోరగా 1485 మంది ఆన్లైన్ బోధన కోరుతున్నారు. ఆన్లైన్ తరగతులు ఉపయోగకరం కాదని ప్రైవేటు పాఠశాలల విద్యార్థుల తల్లిదండ్రులు 5220 మందిలో 70.9 శాతం భావిస్తే, 24.7 శాతం పాక్షికంగా ఉపయోగ కరమని, 4.4 శాతం మాత్రమే ఉపయోగ కరమనీ చెప్పారు. అదే ప్రైయివేటు పాఠశాలల పిల్లల్లో 68.7 శాతం పాఠాలు అర్థం కావటం లేదని, 27.7 శాతం మంది కొంతమేరకే అర్థం అవుతు న్నాయని, 3.6 శాతం మంది మాత్రమే అర్థం అవుతు న్నాయని చెప్పారు.ఈ అభి ప్రాయాలను విశ్లేషిం చినపుడు పెద్ద సంఖ్యలో తల్లి దండ్రులు పాఠశాలలను పున:ప్రారం భించాలని కోరుతున్నారని అర్థమవుతోంది. ఆన్లైన్ విద్యాబోధనకు చాలా తక్కువ శాతం అనుకూలంగా ఉన్నారు. ఆన్లైన్ తరగతులపై ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కూడ సంతృప్తికరంగా లేరు. విద్యావేత్తలు, మానసిక నిపుణులు చెప్తున్నట్లు విద్యార్థి ఆన్లైన్ బోధనను ఇష్ట పడటంలేదు. ఇక ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులలో ఎక్కువ మందికి స్మార్ట్ఫోన్ అందుబాటు ఉండే పరిస్థితి లేదు. ఆన్లైన్ బోధనలో పాఠశాల స్థాయిలో విద్యార్థులకు తల్లిదండ్రుల సహకారం అవసరం. గ్రామీణ ప్రాంతాల్లోని తల్లిదండ్రుల నుండి ఈ సహకారం ఆశించటం అర్థరహితం. వారిలో ఎక్కువమంది ప్రతిరోజూ పనికి వెళ్తేగాని పూట గడవనివారు. విద్యార్థులం దరికీ ప్రభుత్వమే స్మార్ట్ఫోన్లు, టాబ్లు ఇచ్చి ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చినా, బోధనలో సహకారం లభించనపుడు అది దుష్పలితాలనే ఇస్తుంది. పిల్లలు పాఠశాలలకు వెళ్తేనే భౌతిక దూరాన్ని పాటించటం, మాస్కులు ధరించటం, పరిశుభ్రంగా ఉండటం జరుగుతుందని, టీచర్ల మాటనే పాటిస్తారని సర్వే సమయంలో తల్లిదండ్రులు అన్నారు. ఇది పిల్లలపై ఉపాధ్యాయుని ప్రభావాన్ని మరొకసారి రుజువు చేసింది. ఈ సర్వేలో రెండు విషయాలు స్పష్టమయ్యాయి. (1) పాఠశాల విద్యలో ఆన్లైన్ బోధన తరగతి బోధనకు ప్రత్యామ్నాయం కాదు. (2) అన్ని జాగ్రత్తలు తీసుకొని పాఠశాలను తెరిస్తే ఎక్కువ మంది తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలకు పంపటానికి సిద్ధంగా ఉన్నారు. కనుక ప్రభుత్వం పాఠశాలల్లో ఆరోగ్య పరిరక్షణకు నిధులను అదనంగా కేటాయించి, పిల్లలకు పౌష్టికాహారాన్ని అందిస్తూ, అన్ని జాగ్రత్తలూ తీసుకొని పాఠశాల పున:ప్రారంభం కోసం కృషి చేస్తుందని ఆశిద్దాం.