ఉత్కళ రాజ్యాన్ని పాలించే భూపతిరాజు కవి ప్రేమికుడు. ఎందరెందరో కవులు వచ్చి తమ కవిత్వాన్ని వినిపించేవారు. తోచినట్లుగా వారిని సత్కరించేవాడు. ఓ సారి శంకరయ్యనే కవి సభకు వచ్చి, తాను రాజు మీద రాసిన పంచరత్నాలు పాడి వినిపించాడు. సంతోషించిన రాజు శాలువ, ఐదు వరహాలతో పాటు కవి నడిచి వచ్చాడని తెలిసి ఒక గుర్రాన్ని కూడా బహూకరించాడు. శ్రమలేకుండా ఎక్కి తిరుగుతూ, నానా రాజా సందర్శనము చేసుకుని జీవించమని హితబోధ చేశాడు. శంకరయ్య మహా ప్రసాదమని గుర్రాన్ని తీసుకుని ఇంటికి వెళ్లిపోయాడు. తాను రాసిన తాళ పత్ర ప్రతులు గుర్రం మీద పెట్టుకుని రాజుల వద్దకు వెళ్లేవాడు. రాజుల ముందు కవిత్వం వినిపించగా, వారు సంతోషించి తోచినంత ఇస్తే, అదే మహా ప్రసాద మనుకుంటూ ఇంటికి వెళ్లిపోయేవాడు. కవి గారికి నాలుగేళ్ల పాటు కాలం సుఖంగా జరిగి పోయింది. భూపతి రాజు మీద సామంత రాజైన సందీప వర్మ తిరుగుబాటు చేసి, రాజ్యాన్ని ఆక్రమించుకున్నాడు. అతనికి కవులన్నా, కళలన్నా విపరీతమైన కోపం. వారిని తన సభకు రానిచ్చేవాడు కాదు. పొరుగు రాజులతో మరి సంబంధాలతోటే పక్క రాజ్యం నుండి ఎవరినీ తన రాజ్యంలోకి రానిచ్చేవాడు కాదు. దీనితో ఆదరణ లేక కుటుంబం గడవక గుర్రాన్ని అమ్ముదామనుకున్నాడు శంకరయ్య. ఒకనాడు తాను గుర్రాన్ని సంతకు తీసుకపోయి, అమ్మకానికి పెట్టాడు . ఒక జట్కా అతను వచ్చి ''కవి గారి గుర్రమా? ఒక్కడివే ఎక్కి విలాసంగా తిరిగి ఉంటావు. నా బండిలో ఒక్కోసారి పది మంది ప్రయాణీకులు కూడా ఎక్కుతారు. ఇంత సుఖంగా తిరిగిన గుర్రం నా బండిని లాగలేదు. నాకీ గుర్రం వద్దు'' అని వెళ్లిపోయాడు . తరువాత ఒక గొర్రెల యజమాని వచ్చాడు. అతనితో మాట్లాడాడు కవి. ''కవి గారి గుర్రమా? సుఖంగా, రహదారుల మీద, రాజ ప్రాసాదాల్లో తిరిగి వుంటుంది. నా గొర్రెలు చెట్లెంట, పుట్టల వెంట పొలాల గట్ల మీద, కంపచెట్లల్లో తిరుగుతుంటాయి. వాటి వెంట మేము మందతో వెళుతుంటాము. మా వెంట సామానుంటది. దాన్ని మోసుకుంటూ తిరగడమంటే, నీ గుర్రంతో కాని పనిలే. నాకీ గుర్రం వద్దు'' అని వెళ్లిపోయాడు. ఇంక అటువైపు ఎవరూ రావడం కూడ లేదు. మధ్యాహ్నం తాను తెచ్చుకున్న అన్నం తినడానికి బావి వద్దకు వెళ్లాడు. సుబ్బయ్యనే రైతు కూడా అన్నం తినడానికి అక్కడకు వచ్చాడు. తను కాడెద్దుల్ని అమ్ముదామని వచ్చాడు. కవి గారి ముఖం చూసి, విచారానికి కారణం అడిగాడు శంకరయ్య. జరిగినదంతా చెప్పి, ''కాని కాలం వచ్చింది. కుటుంబం గడవడం కూడా కష్టంగా వుంది. గుర్రాన్ని ఎలా అమ్మాలో అర్ధం కావడం లేదు'' అన్నాడు. ''కవి గారి గుర్రాన్ని, ఏనుగును ఎవరూ కొనరు. ఇలా చేయి, అబద్దం ఆడినట్లు కూడా ఉండదు'' అని చెవిలో రహస్యం చెప్పాడు. కవిగారు సంతోషపడ్డాడు. వెంటనే సంతకు వెళ్లి ''ఇది రాజు గారి గుర్రం. దీన్ని కొనడానికి, దక్కించుకొని, మీ ఇంట ఉంచుకోవడానికి అదష్టం ఉండాలి. మీలో ఎవరో ఆ అదష్టవంతుడు. రండి.....జనులారా. రాజు గారి గుర్రం బహు చౌక......'' అని కేకేసి చెప్పాడు. ''రాజు గారి గుర్రమంటే, మహా వేగవంతమైనది. శక్తివంతమైనది, కూడా. అది కూడా చెప్పండి'' అన్నాడు అక్కడికి వస్తూ రాగినయ్యనే సైనికుడు. ''అది ప్రత్యకంగా చెప్పనవసరం లేదండి. మీ బోటి పెద్దవారు వెంటనే అర్ధం చేసుకుంటారు'' అన్నాడు లౌక్యంగా. ''ఎంత చెబుతున్నావు గుర్రాన్ని?'' అడిగాడు. ''పదిహేను వరహాలు. రాజు గారి గుర్రం కదా?'' అన్నాడు. ''కాస్త తగ్గించుకుని పన్నెండు వరహాలకి వ్వకూడదూ?'' అన్నాడు ప్రాదేయ పడుతున్నట్లు. ''మీరు గుర్రం మీద బాగా మోజుపడ్డారు. అలాంటి వారే దీన్ని ప్రేమగా చూసుకుంటారు. గుర్రం క్షేమం నాకు ముఖ్యం. ఎందుకంటే, ఇది రాజసంగా బతికింది. యుద్ధాలు చేసింది. మీ మాటే కానీయండి'' అన్నాడు. సైనికుడు పన్నెండు వరహాలు కవి గారికిచ్చి గుర్రాన్ని తీసుకుని వెళ్లిపోయాడు. ''పెద్ద పెద్ద కావ్యాలు రాశాను కానీ, గుర్రాన్ని అమ్మడానికి దారి తెలీక పోయెనే...? ఒక సామాన్య రైతుకు తెలిసిన చిట్కా తెలీక పోయె...'' అనుకుంటూ పన్నెండు వరహాలతో ఆనందంగా ఇంటికి వెళ్లిపోయాడు. - పుప్పాల కష్ణమూర్తి, 9912359345