పాటను తన తోడు నీడగా మలుచుకున్న కె.జె. యేసుదాస్ చెంతకు పలు పురస్కారాలు.. అలవోకగా నడచి వచ్చి అతని స్వరదారల అక్కున చేరాయి. గడచిన ఈ ఆరు దశాబ్దాల కాలంలో తన స్వరంతో సుశోబితం చేసి సంగీతాన్ని శ్వాసించిన యేసుదాస్ విశిష్ట కషికి గుర్తింపుగా భారత ప్రభుత్వం 1973లో ''పద్మశ్రీ'', 2002లో ''పద్మ భూషణ్''తో పాటు భారత రెండవ అత్యున్నత పురస్కారమైన ''పద్మ విభూషణ్'' పురస్కారాన్ని 2017లో ఇచ్చి సత్కరించింది. జాతీయ ఉత్తమ గాయకుడి అవార్డు అత్యధికంగా ఏడుసార్లు అందుకున్న ఏకైక వ్యక్తి యేసుదాస్. కేరళ ప్రభుత్వం నుంచి 24 సార్లు ఉత్తమ గాయకుడి అవార్డు సొంతం చేసుకున్నారు. ఇదీ ఓ రికార్డు. తమిళనాడు ప్రభుత్వం నుంచి 8సార్లు, కర్ణాటక ప్రభుత్వం నుంచి ఐదు సార్లు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 6 సార్లు నంది అవార్డ్, బెంగాల్ ప్రభుత్వం నుంచి ఒకసారి ఆయన ఉత్తమ గాయకుడి అవార్డులు పొందారు. అతనిని ''గాన గంధర్వన్'' గా కూడా పిలుస్తారు. యేసుదాస్ అత్యంత బహుముఖ, ఆల్ టైమ్ గ్రేటెస్ట్ ఇండియన్ సింగర్గా గుర్తింపు పొందారు. అతను ఐదు దశాబ్దాలలో ఎనబైవేలకు పైగా పాటలు పాడినందుకు గాను 2011లో సి.ఎన్.ఎన్-ఐ.బి.ఎన్ అవుట్ స్టాండింగ్ అచీవ్ మెంట్ పురస్కారాన్నిఅందించింది. 2006లో చెన్నైలోని ఎ.వి.ఎం స్టుడియోలో ఒకే రోజు నాలుగు భారతీయ దక్షిణాది భాషలలో 16 సినిమా పాటలను పాడిన ఘనతను కూడా ఆయన సొంతం చేసుకున్నారు.
ఆయన గీతాలు ''స్వరరాగ గంగా ప్రవాహం''..
'భారతీయుడు'లో ''పచ్చని చిలుకలు తోడుంటే.. పాడే కోయిల వెంటుంటే..''
'పెదరాయుడు'లో ''కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా''..
'మేఘసందేశం'లో ''ఆకాశ దేశాన, ఆషాఢ మాసాన మెరిసేటి ఓ మేఘమా''
'అల్లుడుగారు'లో ''ముద్ద బంతి నవ్వులో మూగ బాసలు''..
'అసెంబ్లీ రౌడీ' చిత్రంలో 'అందమైన వెన్నెలలోన.. అచ్చ తెలుగు'
''సొగసు చూడ తరమా..'' ''హే పాండు రంగా! హే పండరి నాథా''..., ''శరణం అయ్యప్పా స్వామీ శరణం అయ్యప్ప''.. అంటూ స్వామివారి పవళింపు సేవ వేళ పాడే 'హరివరాసనం.. విశ్వ మోహనం' పాట ఎంత గుర్తింపు పొందిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయ్యప్ప దీక్ష తీసుకునే ప్రతి భక్తుడి మొబైల్లో ఈ పాట తప్పకుండా ఉంటుంది. మరి అంతటి ప్రాశస్త్యం పొందిన పాటను ఆయన స్వామివారి సన్నిధిలో స్వయంగా ఆలపించి, తన చిరకాల కోరిక నెరవేర్చుకున్నారు. యేసుదాసు తన సినీ జీవితంలో ఎన్నో భక్తి పాటలు ఆలపించారు. ఆ పాటలు వింటే చాలు.. దైవం మన కళ్ల ముందే ఉందనే భావన కలుగుతుంది. మతానికి అతీతంగా ఆయన ఆలపించిన గేయాలు.. ఇప్పటికీ ఆలయాల్లో మారుమోగుతూనే ఉంటాయి. అయ్యప్ప స్వామి మొదలుకుని శ్రీకష్ణుడు, శ్రీరాముడు, శివుడిపై వివిధ భాషల్లో ఆయన ఆలపించిన అనేక గీతాలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయి.
'స్వర చక్రవర్తి'
సినీ సంగీత సామ్రాజ్యంలో అడుగు పెట్టి.. 16 భాషలలో దాదాపు ఎనబై వేలకు పైగా పాటలు పాడిన కె.జె.యేసుదాస్ 1940 జనవరి 10న కేరళ రాష్ట్రంలోని కొచ్చిన్లో రోమన్ కేథలిక్ కుటుంబంలో జన్మించారు. యేసుదాసు అసలు పేరు కట్టచ్చేరి జోసఫ్ యేసుదాసు. ఆయన్ని కొందరు జేసుదాసు అని కూడా పిలుస్తారు. ఆయన తండ్రి ఆగస్టిన్ జోసఫ్ మలయాళ శాస్త్రీయ సంగీత విద్వాంసులు, నటుడు. తల్లి ఎలిజబెత్ జోసఫ్ చర్చిలో పాటలు పాడేవారు. దీంతో యేసుదాసు తన ఐదవ ఏట నుంచే సంగీతం నేర్చుకున్నారు. తన మొదటి గురువు తన తండ్రి అని చెప్పే ఆయన తిరువనంతపురంలో సెమ్మంగుడి శ్రీనివాస అయ్యంగారు, కె.ఆర్. కుమారస్వామి దగ్గర శిష్యరికం చేసి శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నారు. స్వాతి తిరునాళ్ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్లో శిక్షణ తీసుకున్నారు. ఆర్థిక కారణాల వల్ల ఆ కాలేజీలో శిక్షణ సగంలో ఆగిపోయినా చెంబై వ్కెద్యనాథ్ భాగవతార్ వద్ద శిక్షణ పొందుతూ, తర్వాత ఆర్.ఎల్.వి మ్యూజిక్ అకాడమీలో గానభూషణం కోర్సు పూర్తి చేసిన తర్వాత యేసుదాస్ గ్రామాల్లో అనేక కచేరీలు నిర్వహించారు.
గాయకుడిగా..
చిత్ర దర్శకుడు ఎ.కె.ఆంథోనీ ఆయనకు మలయాళంలో మొదటి సారిగా నేపథ్య గీతాన్ని పాడే అవకాశం ఇచ్చారు. ఎం.బి.శ్రీసివాసన్ సంగీత దర్శకత్వంలో వచ్చిన ఈ పాట ''జాతి భేదం మత ద్వేషం'' 1961 నవంబరు 14న రికార్డు అయ్యింది. తొలి పాటతోనే ఆయన ఎంతో ప్రాచుర్యం పొందడంతో మలయాళంలో అవకాశాలు యేసుదాస్ను వెతుక్కుంటూ వచ్చాయి. మలయాళంలోనే కాకుండా తమిళ, కన్నడ తెలుగులో కూడా అవకాశాలు వెల్లువలా వచ్చాయి. 1980 ప్రథమార్థం నుండి యేసుదాస్ గళం తెలుగు సినీ నేపథ్య గానంలో కొత్తదనాన్ని తీసుకు వచ్చింది. ఆయన తెలుగులో అంతులేని కథ చిత్రంలో ''దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి'', నిరీక్షణ లో ''చుక్కల్లే తోచావే'', అమ్మ రాజీనామాలో ''సష్టికర్త ఒక బ్రహ్మ'', మేఘసందేశంలో ''ఆకాశ దేశాన'', 'స్వయం వరం' చిత్రంలో ''గాలి వానలో.. వాన నీటిలో పడవ ప్రయాణం'' లాంటి అనేక విజయవంతమైన పాటలు పాడారు. నటుడు మోహన్ బాబు ఆయన సినిమాల్లో ఏసుదాసు చేత కనీసం ఒక్కపాటైనా పాడించుకునేవాడు. యేసుదాస్ శాస్త్రీయ సంగీత కళాకారుడిగాఎంతో ప్రతిభ కనబరుస్తూ ఎదుగుతూ సినీ సంగీత జగత్తులో తన మధురమైన గాత్రంతో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. అతను భారతీయ భాషలలో పంజాబీ, అస్సామీ, కొంకణి, కాశ్మీరీ భాషలు తప్ప తెలుగు, తమిళం, కన్నడ, హిందీ తదితర అన్ని భారతీయ భాషలలో పాటలు పాడారు. భారతీయ భాషల్లోనే కాకుండా.. మలేషియన్, రష్యన్, అరబిక్, లాటిన్, ఆంగ్లంలో సైతం పాటలు పాడి శ్రోతలను మెప్పించారు. కర్నాటక సంగీత విద్వాంసుల్లో యేసుదాస్ ఇచ్చినన్ని కచేరీలు మరొకరు ఇచ్చివుండరు. ఇటు శాస్త్రీయ సంగీతం.. అటు సినీ సంగీతం.. ఏదైనా ఎదలోతుల్లో మధురమైన ముద్ర వేయడం ఆ స్వరం ప్రత్యేకత.
కుటుంబం
యేసుదాస్ పథనమిథిట్ట జిల్లాలోని మలపిళ్ళైకు చెందిన ఎం.కె.అబ్రహం చిన్న కుమార్తె ప్రభను వివాహం చేసుకున్నారు. వీరి వివాహం 1970 ఫిబ్రవరి 1న కొచ్చిలోని సంతా క్రూజ్ బసిల్లికా వద్ద జరిగింది. యేసుదాస్ ముగ్గురు కుమారులైన వినోద్, విజయ్, విశాల్లో రెండవ కుమారుడు విజయ్ యేసుదాస్ కూడా సంగీతకారుడు. విజరు 2007, 2013 లలో కేరళ రాష్ట్ర ప్రభుత్వం నుండి ఉత్తమ నేపథ్యగాయకునిగా పురస్కారాన్ని పొందాడు. యేసుదాస్ దర్శకుడు సేతు ఇయాన్ దర్శకత్వంలో రూపొందిన ''పార్త విళి పార్తబడి'' చిత్రంలో రెండు భిన్నమైన స్వరాలతో పాట పాడడమే కాకుండా, కుమారుడు విజరు యేసుదాసు, మనవరాలు అమేయా ముగ్గురూ కలిసి ఒక పాట పాడారు.
ఒకే మతం, ఒకే జాతి, ఒకే దైవం ఆయన సిద్ధాంతం
నారాయణ గురు ప్రతిపాదించిన ఒకే మతం, ఒకే జాతి, ఒకే దైవం అన్న సిద్ధాంతాన్ని యేసుదాసు గాఢంగా విశ్వసిస్తారు. ఆయన చిన్నప్పటి నుంచీ తోటి వారితో అలాగే మెలిగే వారు. సంగీతకారులలో మహ్మద్ రఫీ, చెంబై వైద్యనాథ భగవతార్, బాలమురళి కష్ణలను అతను ఎక్కువగా ఆరాధిస్తారు. యేసుదాసు సరస్వతి దేవి కీర్తనలను పాడటానికి తన పుట్టినరోజున కర్ణాటకలోని కొల్లూరు మూకాంబికా ఆలయాన్ని సందర్శిస్తుంటారు. 2000 సంవత్సరంలో తన 60 వ పుట్టినరోజున ప్రారంభమయిన సంగీత ఉత్సవం ప్రతి జనవరిలో కొల్లూరు మూకాంబికా ఆలయంలో తొమ్మిది రోజుల పాటు కొనసాగుతుంది. యేసుదాస్ తన 70 వ పుట్టినరోజును 70 మంది గాయకులతో ''సంగీతార్చన'' చేపించి కొల్లూరు శ్రీ మూకాంబికా ఆలయంలో జరుపుకున్నారు. ఈ ప్రత్యేక సంగీతార్చన కార్యక్రమాన్ని ఆల్ ఇండియా రేడియో కేరళ అంతటా ప్రసారం చేసి ఆయనని గౌరవించింది.
హింది పరిశ్రమలో
దక్షిణ భారత అన్నీ భాష చిత్రాల్లో ఒక దశాబ్దకాలం పాడిన తరువాత, 1970 ప్రారంభంలో యేసుదాస్కు హింది పరిశ్రమలో ఆవకాశం లభించింది. ఆయన పాడిన మొదటి హిందీ పాట 1971లో ''జై జవాన్ జై కిసాన్'' చిత్రం కోసం, అయితే మొదట విడుదలైన సినిమా ''చోటీ సి బాత్''. 'జానేమన్.. జానేమన్' పాటతో యేసుదాస్ ఉత్తరాది ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ఆయన అమితాబ్ బచ్చన్, అమోల్ పాలేకర్, జీతేంద్రతో సహా హిందీ సినిమాలోని పలువురు ప్రముఖ నటుల కోసం పాటలు పాడాడు. రవీంద్ర జైన్, బప్పిలహరి, ఖయ్యాం, రాజ్కమల్, సలీల్ చౌదరితో సహా అనేకమంది సంగీత దర్శకుల వద్ద ఎన్నో సూపర్ హిట్ పాటలను పాడారు. యేసుదాస్ హిందీలో పాడిన పాటల్లో అత్యంత ప్రజాదరణ పొందిన పాటలు రవీంద్రజైన్ సంగీత దర్శకత్వంలో రూపొందిన ''చిచ్చోర్''లో ఉన్నాయి.
యేసుదాస్ 1999 నవంబరు 14 న, ప్యారిస్లో జరిగిన ప్రతిష్టాత్మకమైన ''మ్యూజిక్ ఫర్ పీస్'' కార్యక్రమంలో పాల్గొని 'యునెస్కో' గౌరవ పురస్కారాన్ని అందుకున్నారు. సహస్రాబ్ది ఉదయానికి గుర్తుగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి హాజరైన వారిలో లియోనెల్ రిచీ, రే చార్లెస్, మోంట్సెరాట్ కాబల్లే, జుబిన్ మెహతా వంటి కళాకారులు ఉన్నారు. 2001లో అహింసా ఆల్బమ్ కోసం సంస్కత, లాటిన్, ఇంగ్లీష్ భాషల పాటలను మిశ్రమం చేసి కర్ణాటక సంగీత శైలిలో పాడారు. ఆ సమయంలో యేసుదాస్ తన సంగీత కచేరీలలో కర్ణాటక శైలిలో అరబిక్ పాటలు పాడారు. 2009 లో యేసుదాస్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా 'మ్యూజిక్ ఫర్ పీస్' అనే నినాదంతో తిరువనంతపురం నుండి దేశవ్యాప్త సంగీత ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ 'శాంతి సంగీత యాత్ర' ప్రారంభించిన సందర్భంగా హేమంత్ కర్కరే భార్య కవిత కర్కరే, యేసుదాస్కు టార్చ్ అందజేశారు. సూర్య కష్ణమూర్తి నిర్వహించిన 36ఏళ్ల సూర్య సంగీత ఉత్సవంలో సైతం యేసుదాస్ 36 సార్లు ప్రదర్శనలు ఇచ్చారు. యేసుదాస్ భారతదేశ సాంస్కతిక రాయబారిగా భారతీయ సంగీతాన్ని ప్రోత్సహిస్తూ విదేశాలలో అనేక ప్రదర్శనలు ఇచ్చారు.
సర్వ మతాలు జనహితం కోసమే
సర్వమతాల అభిమతం జనహితమేనని విశ్వసించిన యేసుదాస్ అన్నీ మతాల పాటలు పాడారు. నేడు ప్రతి మత సంబందిత కార్యక్రమాల్లో ఆయన పాడిన పాటలు మార్మోగుతూనే వుంటాయి. నువ్వు క్రైస్తవుడివి కదా హిందువుల పాటలు ఎలా పాడుతావు అన్న విమర్శలకు నా గానానికి ఎలాంటి కుల, మత బేధాలు లేవని సమాధానం చెప్పారు. 1975 ప్రాంతంలో గురువాయర్ లోని శ్రీ కృష్ణ దేవాలయం లోకి యేసుదాస్ ప్రేవేశాన్ని నిరాకరించి ఆయన గురువు చెంబై వ్కెద్యనాథ్ ను మాత్రం అనుమతించారు. దీనికి నిరసనగా చెంబై వ్కెద్యనాథ్ తన శిష్యుడు యేసుదాస్ తో కలిసి రాత్రంతా శ్రీ కృష్ణున్ని కీర్తిస్తూ కచేరి నిర్వహించారు. ఏప్రిల్ 17, 2007 దాదాపు30 ఏళ్ల తర్వాత అదే సంఘటన పునరావతమైంది. సనాతనులు మతం పేరిట ఆయనకు ఆలయ ప్రవేశం నిరాకరించారు. గురు వాయార్తో పాటు కేరళలోని మరో రెండు ఆలయాల్లో ఆయన ప్రవేశాన్ని నిషేధించారు. ఇది యేసుదాస్ ను ఎంతగానో కలచి వేసింది. ఆయన్ను నిరోధించారు కానీ ఆయన పాటను అడ్డుకోలేక పోయారు. యేసుదాస్ శబరిమలలో అయ్యప్ప స్వామిని దర్శించు కోవాలని గట్టి పట్టుపట్టి అనుమతిని సాధించారు. అయ్యప్ప భక్తుల లాగానే నల్లటి వస్త్రాలు దరించి, మండలి దీక్ష చేసి తలపై ఇరుముడితో శబరిమల చేరుకుని అయ్యప్పస్వామిని దర్శించుకుని, సంగీతానికి, కళలకు జాతి, మతం, కులం వంటి భేదభావాలు లేవని చాటి చెప్పారు.
తరంగణి స్టూడియో
యేసుదాస్ 1980లో త్రివేండ్రం వద్ద తరంగణి స్టూడియోను స్థాపించారు. 1992లో కార్యాలయం, స్టూడియోను చెన్నెకు తరలించారు. 1998లో యుఎస్లో విలీనం అనంతరం ఈ సంస్థ కేరళలో తరంగణీ స్టూడియో, తరంగణి రికార్డింగ్ కేంద్రంగా మారాయి. ఇది మొదటిసారిగా మలయాళ చలనచిత్ర పాటల ఆడియో స్టీరియోలో క్యాసెట్లను తెచ్చింది. చెన్నైలోని స్టూడియో-27లో రికార్డ్ కంపెనీకి వాయిస్ మిక్సింగ్ స్టూడియో కూడా ఉంది. స్టూడియో ప్రపంచ వ్యాప్తంగా యేసుదాసు చలనచిత్ర, భారతీయ శాస్త్రీయ సంగీత కచేరీలను ప్రదర్శిస్తుంది. యేసుదాస్ ఎందరో గాయని, గాయకులను సంగీత లోకానికి పరిచయం చేశారు. ఆయన స్టూడియోలో ట్రాక్ సింగర్లుగా స్వర పరీక్ష చేసుకున్న చిత్ర, సుజాత తరువాతి కాలంలో గాయనీ మణులుగా సుప్రసిద్ధులయ్యారు. ఆయన తీర్చిదిద్దిన వారిలో ఉన్ని కష్ణన్, ఉన్ని మీనన్ వంటి కొత్త గాయకులు గాయక ప్రముఖులుగా వెలుగొందుతున్నారు.
పురస్కారాలు
1974లో చెంబై వ్కెద్యనాథ భాగవతార్చేతుల మీదుగా సంగీత రాజా, 1988 సంగీత చక్రవర్తి పల్లవి నరసింహాచారి, 1989లో సంగీత సాగరము 1989లో అన్నామలై విశ్వ విద్యాలయం నుంచి గౌరవ డాక్టరేటు, కేరళ ప్రభుత్వ ఆస్థాన గాయకుడు, 1992లో కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డ్, మధ్యప్రదేశ్ ప్రభుత్వం లతామంగేష్కర్ పురస్కారం ప్రదానం చేసింది. ఆస్థాన విద్వాన్ ఉడుపి, శంగేరి, రాఘవేంద్ర మఠాలు, పాండిచ్చేరి గవర్నర్ ఎం.ఎం.లఖేరాచే సంగీత రత్న, స్వాతి రత్నము, 1994లో నేషనల్ సిటిజెన్ అవార్డు, 1999 లో యునెస్కో వారి నుంచి అవుట్ స్టాండింగ్ అచీవ్ మెంట్ ఇన్ మ్యూజిక్ అండ్ పీస్ పురస్కారం, 2000 లో డాక్టర్ పిన్నమనేని సీతాదేవి ఫౌండేషన్ పురస్కారం, 2002లో సప్తగిరి సంగీత విద్వన్మణి, 2002 భక్తి సంగీత శిరోమణి, గాన గంధర్వ, నీలం సంజీవరెడ్డి చేతులమీదుగా గీతాంజలి పురస్కారం, తమిళనాడు రాష్ట్రప్రభుత్వంచే కలైమామణి పురస్కారంతోపాటు, మహారాష్ట్ర ప్రభుత్వంచే లైఫ్టైమ్ అచీవ్మెంట్ పురస్కారాన్ని అందుకున్నారు. 2008 లో జైహింద్ టివి నుంచి కేరళ రత్నతో పాటు, భారత ప్రభుత్వం నుంచి ఏడు సార్లు జాతీయ ఉత్తమ గాయకుడి పురస్కారం, కేరళ ప్రభుత్వం తరపున 24 సార్లు ఉత్తమ గాయకుడి పురస్కారం, కర్ణాటక ప్రభుత్వం నుంచి ఐదు సార్లు ఉత్తమ గాయకుడి పురస్కారం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఆరు సార్లు ఉత్తమ గాయకుడి పురస్కారం, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నుంచి ఒకసారి ఉత్తమ గాయకుడి పురస్కారం అందుకున్నారు.
(యేసుదాస్ జనవరి 10న 80వ జన్మదినోత్సవం సందర్భంగా...)
- పొన్నం రవిచంద్ర,
9440077499
సీనియర్ జర్నలిస్టు,
సినీ విమర్శకులు