- దళిత సమస్యలు కవిత్వం రూపంలో మల్చడంలో దిట్ట
- వేముల ఎల్లయ్య ప్రోత్సాహంతో ముందుకు
జీవితంలో ఎదురయ్యే కష్టాలను కవితలు, రచనల రూపంలో మల్చడంలో దిట్ట కవి, రచయిత భూతం ముత్యాలు. దళితుల సమస్యలు వెలికి తీసి ఆయన కలంతో అనేక రచనలు, కవిత్వాలు రాశాయి. కటిక పేదరిక కుటుంబం నుండి వచ్చిన ఆయన కష్టాలు చూసి భయపడకుండా ముందుకు వెళ్లారు. ప్రభుత్వ ఉద్యోగం సంపాదించారు. అయినా రచలను మాత్రం కొనసాగిస్తూనే ఉన్నారు.
నవతెలంగాణ-నల్గొండ
భూతం ముత్యాలు జూన్ 10వ తేదీ 1971లో నాంపల్లి మండలం తిరుమలగిరి గ్రామంలో భూతం మల్లయ్య, మల్లమ్మ దంపతులకు జన్మించారు. ఒకటి నుండి 3వ తరగతి వరకూ తిరుమలగిరిలో 4 నుండి ఇంటర్ వరకూ నల్గొండలో, డిగ్రీ హైదరాబాద్లోని ప్రభుత్వ కళాశాలలో, బిఇడి పట్టణంలోని గోకుల్ కళాశాలలో పూర్తి చేశారు. హైదరాబాద్లో డిగ్రీ చదివే రోజుల్లో ఖర్చుల కోసం సాయంత్రం వేళల్లో రిక్షాలాగడం, హోటళ్లలో పని చేశారు. 1996లో డిఎస్సీలో ఎస్జీటి ఉద్యోగం పొందారు. ప్రస్తుతం మునుగోడు మండలం గంగోరిగూడెం ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు.
ప్ర్రోత్సహించిన వ్యక్తులు
ప్రముఖ కవి వేముల ఎల్లయ్య ప్రోత్సాహంతో ఆయన సాహిత్య రంగంలో ముందుకు సాగుతున్నారు. ప్రాథమిక పాఠశాలలో చదివినప్పటి నుండి కవితలు, రచనలు చదివేవారు. గురజాడ అప్పారావు రచించిన ముత్యాల స్వరాలు ఆయన్ను ఎంతగానో ఆకర్శించాయి. దేవరకొండ బాలగంగాధర్ తిలక్ రచించిన కవితలను చిన్నప్పటి నుంచే ఎక్కువగా చదివేవారు. కాళోజీ నారాయణరావు రచించిన నాగొడవ అనే కవితలు ఆయనపై ప్రభావం చూపాయి. కలికూరి ప్రసాద్ రచించిన గోస, బాధ రచనలు కూడా ఆయన ఇష్ట పడి చదువుతుంటారు.
రచించిన పుస్తకాలు
2003లో దుగిలి (దళిత కవిత్వం) రచించారు. ఈ పుస్తకంలో దళితుల జీవితాలు, సంస్కృతి భాష గురించి రాసారు. ఈ పుస్తకంలో ఉన్న గొంతు, బర్రె కవిత్వాలు ఆంగ్లంలోకి అనువదించబడ్డాయి. 2004 లో సూరడు (దళిత జీవితం రెండు తరాల కుటుంబ వ్యధ) అనే పుస్తకాన్ని రాసారు. ఇందులో తల్లిదండ్రులు పేదరికంలో ఉంటూ అన్ని రకాలుగా నష్టపోయినా వారికున్న పుత్రుడు మాత్రం కష్టపడి ఉన్నతస్థాయికి ఎదుగుతాడు అనే కోణంలో రచనలు చేశారు. ఈ పుస్తకాన్ని కాకతీయ యూనివర్శిటీ తెలుగు 4వ సెమిస్టర్లో ఒక సబ్జెక్టుగా పెట్టారు. ఆయన రచించిన సిద్ధి నవలను కూడా 4వ సెమిస్టర్లో పెట్టారు. 2007లో పురుడు (మాలల సంస్కృతి , జీవితాల గురించి) రాశారు. 2010లో బేగరి కథలు ( దళిత మైనార్టీల గురించి ) రాశారు. ఇందులో రజియా పేద ముస్లిం మహిళ ఎదుర్కున్న జీవిత కష్టాల గురించి రాశారు. 2012లో ఇగురం అనే నవల రాశారు. ఇవి సమాజంపై ఎంతో ప్రభావం చూపాయి. 2013లో మాండలికం (తెలంగాణ కుల వృత్తి పదకోశం) అనే డిక్షనరీని రాశారు. 2014లో బుగాడ కథలు (దళిత జీవితాలను ఉన్నది ఉన్నట్లుగా ఆవిష్కరించిన కథలు) రాశారు. ఇందులో మహిళల కష్టాలు, దు:ఖాలను వివరించారు. 2015లో నియతి ( నా ఆటో గ్రఫి ) ని రాశారు.
ఎన్నో బహుమతులు, సన్మానాలు ఆయన సొంతం
2005లో హైదరాబాద్లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగిన దళిత సాహిత్య సదస్సులో ఆయన రాసిన రచనలకు సన్మానం పొందారు. 2003లో మునుగోడు మండల ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు అందుకున్నారు. ప్రతి సంవత్సరమూ నవంబర్ నెలలో నిర్వహించే గ్రంథాలయ వారోత్సవాల్లో జిల్లా కలెక్టర్లచే ఆయన సన్మానం పొందుతూనే ఉన్నారు. ప్రస్థానం పత్రికలో పాలభూమితస్కరించాడు అనే వ్యాసానికి ఆయనకు బహుమతి వచ్చింది.
ఊపిరి ఉన్నంతకాలం రచనలు
ఊపిరి ఉన్నంతకాలమూ రచనలు చేస్తూనే ఉంటానని ఆయన చెబుతుంటారు. ఆయన ఎంతగానో అభిమానించే రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్, గౌతమ బుద్ధుని చిత్రాలను పెయింటింగ్ రూపంలో వేసి భద్రపరిచారు. దళితుల సమస్యలను వెలికితీసి రచనల రూపంలో తెలపడంలోనే తనకు ఆత్మ సంతృప్తి ఉంటుందని ఆయన పేర్కొంటున్నారు.
Authorization