హాయ్ ఫ్రెండ్స్!కంటికి కనిపించే ప్రపంచం కన్నా కనిపించని ప్రపంచం ఎంతో ఉంది. ఆ ప్రపంచాన్ని చూడాలంటే సూక్ష్మదర్శిని (మైక్రోస్కోప్)ను ఉపయోగించాల్సిందే. అతి సూక్ష్మమైన బాక్టీరియా వంటి జీవులను సైతం కొన్ని లక్షల రెట్లు అధిక పరిమాణంలో చూపించగలిగే సూక్ష్మదర్శిని కథ తెలుసుకుందాం..
కంటికి కనపడని సూక్ష్మమైన వస్తువులను చూడ్డానికి ఉపయోగపడే సాధనాన్ని 'మైక్రోస్కోపు' అంటారు. అంటే 'సూక్ష్మదర్శిని' అన్నమాట. వైద్య విజ్ఞాన రంగానికి ఈ మైక్రోస్కోపు చాలా ముఖ్యం. సూక్ష్మజీవులను సైతం ఈ మైక్రోస్కోపు ద్వారా చూడవచ్చు. 1729 గాజుని తయారుచేయడం కనిపెట్టారు. అపుడే కుంభాకారపు గాజు కటకంగుండా చూసిన వస్తువు కంటికి పెద్దదిగా కనబడుతుందన్న సంగతి కూడా కనిపెట్టారు. దాంతో భూతద్దాలు గాజుతో పాటు వినియోగానికి వచ్చాయి. ఈ భూతద్దాలమీద జరిగిన ప్రయోగాల ఫలితంగా 1752 లో మైక్రోస్కోపు అనే సాధనం తయారయింది. మైక్రోస్కోపులు కంటికి కనపడని వస్తువుల పరిమాణాన్ని కొన్ని వందల రెట్లు పెంచి కంటికి కనపడేలా చేస్తాయి. మైక్రోస్కోపులో రెండు కుంభాకార కటకాలని ఉపయోగిస్తారు. ఒక ఖాళీ గొట్టానికి రెండు చివర అంచులలోను ఈ రెండు కటకాలను అమరుస్తారు. ఒక కటకంగుండా కంటితో చూస్తారు. ఆ కటకాన్ని 'కంటి కటకము' లేక 'ఐసీప్' అంటారు. మరో కటకము కింద పరీక్షించవలసిన వస్తువు దగ్గరలో ఉంచుతారు. ఈ కటకాన్ని 'వస్తుకటకం'లేక ' 'ఆప్టికల్ లెన్సు' అంటారు.వస్తుకటకం వస్తువు యొక్క ప్రతిబింబాన్ని పెద్దదిచేసి మైక్రోస్కోపు గొట్టంలో పడేలా చేస్తుంది అంటే విస్తరించిన ఆ ప్రతిబింబం స్పష్టంగా గొట్టంలో ఒక స్థానంలో ఫోకస్ అవుతుందన్నమాట. కంటి కటకం బాపతు ఫోకస్కూడా ఈ స్థానంలో పడేలా కంటి కటకం అమర్చబడి ఉంటుంది. కనుక కంటి కటకం గుండా చూస్తే విస్తరించిన ఆ వస్తువు మరింత పెద్దదై కనిపిస్తుంది. అలా మైక్రోస్కోపును ఉపయోగించి వాటి సామర్థ్యాని బట్టి సూక్ష్మవస్తువులను సుమారు రెండువేల రెట్లు పెద్దవిగా చూడవచ్చును.
ఈ శతాబ్దంలో అణువిజ్ఞానశాస్త్రం విస్తరించడంలో 1941లో అమెరికన్లు ఎలక్ట్రాను మైక్రోస్కోపుని కనిపెట్టారు. ఇది వస్తువును కొన్ని లక్షల రెట్లు పెద్దదిగా చేస్తుంది. ఐదుపైసల నాణాన్ని ఈ మైక్రోస్కోపులో పూర్తిగా చూడాలంటే హైదరాబాదు నగరమంత విస్తీర్ణం కావలసివస్తుంది.
ఎలక్ట్రాను మైక్రోస్కోపు మూలసూత్రం కూడా మామూలు మైక్రోస్కోపు లాగే ఉంటుంది. ఎటొచ్చి ఎలక్ట్రాను మైక్రోస్కోపులో కాంతికి బదులు ఎక్కువ వేగం గల ఎలక్ట్రానులు వాడతారు. గాజు కటకాల బదులు అయస్కాంత దర్పణాలను వాడతారు. ఈ అయస్కాంత దర్పణాలు విద్యుదయస్కాంత పద్ధతిలో పనిచేస్తాయి. వాటిగుండా రుణ ధృవ విద్యుత్గల ఎలక్ట్రానులు ప్రవహించినపుడు అవి వేగం పుంజుకుని కాంతి కిరణాల పరావర్తనం, ప్రతిబింబంలాంటి లక్షణాలను పొందుతాయి. ఎలక్ట్రాను మైక్రోస్కోపులో ముఖ్యంగా మూడు ఆయస్కాంత దర్పణాలు ఉంటాయి. పరీక్షించవలసిన వస్తువుని ఎలక్ట్రానుల ప్రవాహానికి అడ్డుపడని పలచని ఫిల్ముమీద వుండి మొదటి రెండు దర్పణాల మధ్య ఉంచుతారు. మొదటి దర్పణం గుండా ఎలక్ట్రాను కిరణాలను ప్రవేశపెట్టి వస్తువు మీద కేంద్రీకరిస్తారు. ఆ వస్తువు యొక్క ప్రతిబింబం అయస్కాంత దర్పణం ద్వారా పెద్దది అవుతుంది. ఆ పెద్దదైన ప్రతిబింబం మరో దర్పణం ద్వారా మరింత పెద్దదై ప్లోరసెంటు పూతపూయబడిన ఫ్లేటు మీదపడి, విస్తరించిన రూపంలో కనపడుతుంది. ఈ రూపాన్ని ప్రత్యేకమైన లెన్సులగుండా చుడ్డానికి వీలుంటుంది. ప్లోరసెంటు ప్లేటుస్థానంలో ప్రత్యేకమైన ఫొటో ఫిల్ము నుంచితే ఆ ఫిల్ముమీద దాని స్వరూపం ముద్రపడుతుంది. ఈ ఎలక్ట్రాను మైక్రోస్కోపులో సూక్ష్మ స్వరూపాలు లక్ష మొదలు ఐదు లక్షల రెట్లు పెద్దవై కనబడతాయి. కనుక ఈ సాధనం విజ్ఞానశాస్త్ర పరిశోధనలకు ఎంతో సహాయపడుతుంది.
Authorization