అతిపెద్ద వర్తులాకార కట్టడం.. ఆధునిక ఏడు వింతల్లో ఒకటీ..ఆనాటి రంగస్థలం కోలోజియం. కళా ప్రేమికులైన ప్రజల కోసం ఇక్కడ ఎన్నో నాటకాలు, నాటికలు ప్రదర్శించేవారు. కానీ ఈ అద్భుత కట్టడం వెనుక ఎంతో హింస దాగి ఉంది. ఇంతకీ ఈ కట్టడాన్ని ఎవరు, ఎప్పుడు, ఎందుకు నిర్మించారో తెలుసుకోవాలనుందా...అయితే ఇది చదవండి..
- కోలోజియం అనగానే సగం కూలి పోయిన ఓ స్టేడియం కళ్లముందు మెదుళ్తుంది. ఇది ఒక యాంపీథియేటర్! అంటే అన్ని వైపుల నుంచీ చూడగలిగే రంగస్థలం.
- క్రీ.శ. 70లో రోమన్ సామ్రాజ్యాన్ని వెస్పాసియన్ అనే రాజు పాలించేవాడు. ఆయన జెరూసలెం మీద దండెత్తి బోలెడు ధనాన్ని లూటీ చేసి రోమ్(ఇటలీ)కి తిరిగొచ్చాడు. ఆ సందర్భంలో బ్రహ్మాండమైన కట్టడం నిర్మించాలను కున్నాడు. అదే కోలోజియం. ఆ నిర్మాణాన్ని అతని కొడుకైన టైటస్ పూర్తిచేయగా, మనవడు డిమీషియన్ కొన్ని మార్పులు చేశాడు. ఈ ముగ్గురినీ ఫ్లేవియర్ రాజులు అంటారు. అలా వాళ్లు నిర్మించిన ఈ కట్టడం పేరు 'ఫ్లేవియన్ యాంపీ థియేటర్'.
- అయితే దీనికి దగ్గర్లో రోమన్ రాజు నీరో విగ్రహం ఉండేది. ఇలాంటి పెద్ద విగ్రహాలను రోమన్ భాషలో కోలోసల్ అంటారు. దాని పక్కనే ఈ ఫ్లేవియన్ యాంపీ థియేటర్ ఉండటం వల్ల కోలోజియం అన్న పేరు వచ్చి ఉండవచ్చు.
- గిన్నిస్ రికార్డుల ప్రకారం 612 అడుగుల పొడవు, 515 అడుగుల వెడల్పుతో ఇది ప్రపంచంలోనే అతిపెద్ద యాంపీ థియేటర్! దాదాపు 6 ఎకరాల్లో ఈ కట్టడం విస్తరించి ఉంది. దీన్ని చుట్టి రావాలంటే సుమారు రెండు కిలోమీటర్లు నడవాలి. ఇందులో యాభైవేల మంది కూర్చునే సదుపాయం ఉంది. ఒకోసారి ఎనభైవేల మంది కూడా పట్టేవారట.
- ఈ రంగస్థలంపై ప్రాణాలకు ఒడ్డి ఇద్దరు యుద్ధం చేస్తుంటే చూసి ఆనందించేవాళ్లు. వీళ్లని గ్లాడియేటర్లు అంటారు. శత్రు సైనికులు, బానిసలు, ఖైదీలను గ్లాడియేటర్లుగా మార్చేవాళ్లు. కొన్నిసార్లు అడవి జంతువులను వదిలి, వాటిని వేటాడేవాళ్లు. రోమన్ పురాణాలను నాటకాలుగా వేసేవాళ్లు. వీటన్నింటిని చూడ్డానికి రుసుము కూడా వసూలు చేసేవాళ్లు. పాత పెంకుల మీద అక్షరాలను చెక్కి వాటిని టిక్కెట్లుగా ఇచ్చేవాళ్లు. లోపలికి వెళ్లేందుకు 76 ద్వారాలు ఉండేవి. ప్రముఖులు ప్రవేశించేందుకు మరో 4 అందమైన ద్వారాలు ఉండేవి. జంతువుల బోనులు, నాటక సామాగ్రిని చేర్చేందుకు భారీ పరికరాలను వాడేవాళ్లు. ప్రేక్షకుల కోసం మరుగుదొడ్లు, కుళాయిల సదుపాయం ఉండేది.
- కోలోజియంకు చుట్టుపక్కల గ్లాడియేటర్ల శిక్షణా కేంద్రాలు, ఆసుపత్రి, ఆయుధాల దుకాణాలు ఉండేది. చనిపోయిన గ్లాడియేటర్ల ఆయుధాలను అమ్మే దుకాణాలూ ఉండేవి. రాన్రాను ప్రజలకు ఇలాంటి క్రీడలంటే అసహ్యం ఏర్పడింది.
- అయిదో శతాబ్దంలో ఇలాంటి ప్రదర్శనలన్నీ ఆగి పోయాయి. దాంతో కొందరు దుకాణాలు పెట్టు కున్నారు. కొందరు గుడిసెలు వేసుకున్నారు. కొన్ని కార్ఖానాలు వెలిశాయి. తమ ఇంటి నిర్మాణాల కోసం కొలాజియం రాళ్లను వాడుకున్నారు. భూకంపాలు, అగ్నిప్రమాదాలు తోడవటంతో ఇప్పుడు కొలాజియంలో మూడోవంతు మాత్రమే మిగిలింది.
- కోలోజియంను రోమన్ వైభవానికి మాత్రమే కాదు, అప్పటి హింసకూ చిహ్నంగా భావిస్తారు. అన్ని దేశాల్లో నూ మరణశిక్షలు రద్దు చేయాలని ఇక్కడ ప్రదర్శనలు జరిగాయి. ఏ దేశంలోనైనా మరణశిక్షలను రద్దు చేస్తే ఆ రోజు బంగారు విద్దుద్దీపాలతో కొలాజియంను కాంతిమయం చేస్తారు.
Authorization