పడవలు లేదా నావల పందెం చూడటానికి ఆసక్తికరంగా ఉంటుంది. ఇంత వరకూ లభించిన ఆధారాలను బట్టి క్రీస్తుపూర్వం 2000 సంవత్సరంలో మెసపటోమియా వాసులు యుఫ్రైట్స్ నదిలో ప్రపంచంలో కెల్లా మొట్టమొదటి పడవల పందెం జరిపారు. ఆ తర్వాత ఈజిప్షియన్లు నైలు నదిలో పడవల పందాలు నిర్వహించారు. తర్వాత అవి ప్రపంచమంతటా విస్తరించాయి. ఆధునిక కాలంలో మొట్టమొదటి పడవల పందెం 1715లో ఇంగ్లండ్లో జరిగింది. అది థేమ్స్ నదిలో పడవలు నడిపేవారి మధ్య జరిగింది. 1829లో విశ్వవిద్యాలయ స్థాయిలో మొట్టమొదటిసారి కేంబ్రిడ్జ్-ఆక్స్ఫర్డ్ జట్ల మధ్య థేమ్స్ నదిలో పడవల పందెం జరిగింది. క్రీ.శ. 1900 నుంచి ఒలంపిక్స్ క్రీడల్లో వీటికి స్థానం దక్కింది. ఒక్కో ప్రాంతంలో పడవల పందాలు ఒక్కోరీతిలో జరుగుతాయి. పడవల్లో ఉండే నావికుల సంఖ్యలో కూడా వ్యత్యాసం ఉంటుంది.