మనదేశంలో ఆహారధాన్యాల కొరతను తగ్గించడానికి చేసిన ప్రయత్నమే హరితవిప్లవం. 1960 దశకంలో దేశంలో తిండి గింజల కొరత వచ్చింది. అందరి ఆకలి తీరాలంటే ధాన్యాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. జనాభా పరంగా ప్రపంచంలో రెండోస్థానంలో ఉన్న దేశం మనది. వ్యవసాయం మీద ఆధారపడిన దేశం. అలాంటి దేశంలోనే ఆహారధాన్యాలకు విదేశాల మీద ఆధారపడడం ఏంటి? ఏదో ఒకటి చేయాలి. దిగుబడి పెంచాలి... దేశంలో ఉన్న జనాభా అంతటికీ సరిపోయేటంత పెద్ద మొత్తంలో ధాన్యం పండించాలి.. ఈ లక్ష్యాలతో ఎక్కువ దిగుబడినిచ్చే వంగడాల మీద పరిశోధనలు విస్తృతమయ్యాయి. సాగుభూమిని పెంచడం ద్వారా దిగుబడిని పెంచడానికి ఓ పక్క ప్రయత్నాలు మొదలయ్యాయి. వాటితోపాటు హరిత విప్లవం ద్వారా రసాయన ఎరువుల వాడకం, క్రిమీసంహారకాలతో తెగుళ్ల నుంచి పంటను కాపాడటం వంటి ప్రయోగాలు విజయవంతమయ్యాయి. క్రమంగా అవసరానికి మించిన దిగుబడి వచ్చింది. దాంతో ఇప్పుడు మిగులు ఆహార ధాన్యాలను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నాం.