హాయ్! చిన్నారులూ! ఫిబ్రవరి 28వ తేదీని ''జాతీయ సైన్స్ దినోత్సవం''గా జరుపుకుంటాం అని తెలుసు కదా! అసలు ఈ సైన్స్డే ఎలా ఏర్పడింది? ఎప్పుడు ఏర్పడింది? ఎందుకు ఏర్పడింది? అనే విషయాలు కూడా తెలుసుకుందామా!
ఆధునిక విజ్ఞాన ప్రపంచంలో మొదటి భౌతిక శాస్త్రవేత్తగా పాదం మోపినవాడు సర్ సి.వి.రామన్. భారతీయ వైజ్ఞానికులలో అత్యంత ప్రతిభావంతులు సి.వి.రామన్. ఆయన కనుక్కున్న 'రామన్ ఎఫెక్ట్'కు 1930లో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. నోబెల్ బహుమతి అందుకున్న తొలి భారతీయుడు సి.వి.రామన్. ఆయన రామన్ ఎఫెక్ట్ను కనుగొన్న రోజున మనం సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈ దినోత్సవాన్ని దేశ ప్రజలంతా 1987వ సంవత్సరం నుంచి జరుపుకుంటున్నారు. తొలిగా 1986లో నేషనల్ కాన్సిల్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ కమ్యూనికేషన్ (ఎన్సిఎస్టిసి)వారు భారత ప్రభుత్వాన్ని సైన్స్ దినోత్సవానికి ఫిబ్రవరి 28 వ తేదీని కేటాయించమని అభ్యర్థించారు. ప్రభుత్వం సరేననడంతో ఆ తరువాతి సంవత్సరం నుండి నేటిదాకా దేశమంతటా అత్యంత వైభవోపేతంగా సైన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా దేశంలోని కళాశాలలు పాఠశాలలు, రీసెర్చెసెంటర్లు మెడికల్, ఇంజనీరింగ్ కళాశాలలు , పరిశోధనా రంగంలోని సంస్థలు, సైన్స్ను ప్రచారం చేసే పత్రికలు అనేకానేక సంస్థలో సైన్స్ దినోత్సవం అద్భుతంగా జరుగుతాయి. మహానుభావులు కనుక్కున్న సైన్స్ను ప్రజల్లోకి తీసుకువెళ్ళాలంటే ఎంతో శ్రమించాలి. సైన్స్కంటూ ఓ రోజును కేటాయించుకొని అనేక కార్యక్రమాలు చేపడుతూ ప్రజా జీవితంలో సైన్స్ పాత్రను, ప్రాముఖ్యతనూ ప్రజల చేరువకు తీసుకు వెళుతున్నారు.
''పదార్థాలలోని అణువులచే చెదర గొట్టబడిన కాంతి కిరణాల శక్తిలో అంటే రంగులో వచ్చే మార్పు ఆ పదార్థాలలోని అణువులని బట్టి, దాని స్థితిని బట్టి ఉంటుంది. అందుచేత పదార్థాలలో అణువు రచనను, స్థితిని నిర్ణయించడంలో రామన్ ఎఫెక్ట్కు సాటియైనది మరొకటి లేదు. కనుకనే రామన్ ఎఫెక్ట్ భౌతికశాస్త్రానికి కన్నబిడ్డగానూ, రసాయన శాస్త్రానికి పెంపుడు బిడ్డగానూ పెరిగింది. కాంతికిరణాలు ఒక ద్రవ పదార్థంపై పడినప్పుడు ఆ కాంతి పరిక్షేపం చెందుతుంది. అంటే కాంతి కిరణాలలోనే ఫోటాన్ కణాలు ద్రవ పదార్థాలు పరమాణువులపై పడి పరిక్షేపం చెందుతాయి. రసాయన పదార్థాలలోని అణువులు పరమాణువుల పరిశీలనకు, వైద్యరంగంలోని మందుల తయారీలోని వీశ్లేషణలకూ రామన్ ఎఫెక్ట్ ఉపయోగ పడుతుంది. ఆకాశం, సముద్రపు నీరు, దూరంగా కనిపించే కొండలు ఇవన్నీ మనకు నీలం రంగులో కనిపిస్తాయి. ఇలా అవి నీలి రంగులో కనిపించటానికి గల కారణాలను రామన్ ఎఫెక్ట్ వివరిస్తుంది.
చంద్రశేఖర్వెంకట రామన్ 1888వ సంవత్సరంలో నవంబరు 7వ తేదీన తిరుచిరాపల్లిలో జన్మింనారు. ఆయనకు చిన్నతనం నుండే పరిశోధనారంగంపై ఆసక్తి ఉంది. కలకత్తా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా చేరారు. సి.వి రామన్ కాంతిపై పరిశోధనలు చేసి రామన్ ఎఫెక్ట్ను 1928లో కనుగొన్నారు. 1930లో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. ఈయన కనుక్కున రామన్ ఎఫెక్టుకు భారత ప్రభుత్వం 1954లో 'భారత రత్న' బిరుదునిచ్చి గౌరవించింది. మనదేశంలోని కలకత్తా విశ్వవిద్యాలయం, ఆంధ్ర విశ్వవిద్యాలయం వంటి అనేక విశ్వ విద్యాలయాలు ఆయనకు గౌరవ డాక్టరేట్లు ఇచ్చి సత్కరించాయి. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్, లండన్లోని రాయల్ సొసైటీ, ఇటలీ దేశ విజ్ఞాన సమితి వంటి అనేక దేశ విదేశీ సంస్థలు సి.వి రామన్ను బంగారు పతకాలు, గౌరవ పట్టాలతో గౌరవించాయి. 1933లో బెంగళూరులోని 'ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్'కు ఈయన్ని డైరెక్టర్గా నియమించారు.1948లో రామన్ రిసెర్చి ఇన్స్టిట్యూట్ను స్థాపించారు. ఆయన నోబెల్ బహుమతి అందుకునే సమయానికి భారత దేశానికి స్వాతంత్య్రం లభించకపోవడం పట్ల ఆయన తన పూర్తి సంతోషాన్ని అనుభవించలేక పోతున్నాననే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇలాంటి శాస్త్రవేత్తల జీవిత చరిత్రలను నేటి తరానికి పరిచయం చేయాలి. వారు జీవితంలో పడ్డ కష్టనష్టాలు, కృషి, పట్టుదల, అభ్యాసం ఎలా ఉండేవో తెలుసుకోవడం వలన పిల్లలు తాము కూడా ఆదిశగా అడుగులు వేస్తారు. శాస్త్ర విజ్ఞానానికి వీరి పరిశోధనలు ఏ విధంగా బాట చూపుతాయో అర్థం అవుతుంది. విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి పథర వైపు అడుగులు వేయ గలుగుతుంది
సైన్స్ దినోత్సవం రోజున సైన్స్ను ప్రజలకు చేరువు చేయుటలో ప్రముఖ పాత్ర పోషించిన వారికి అవార్డులనిచ్చి గౌరవిస్తారు. సామాన్య ప్రజల నిత్య దైనిందిక జీవితంలో సైన్స్ పాత్ర ఏమిటి? అది ఎలా ఉపయోగపడుతుందో తెలిస్తే మూఢనమ్మకాల జోలికి వెళ్ళరు. మూఢనమ్మకాలను రూపుమాపాలంటే సైన్స్ను సమాజంలోని ప్రతి ఒక్క పౌరుని దగ్గరకూ తీసుకెళ్ళగలగాలి. ప్రతి ఏటా జరిగే సైన్స్ దినోత్సవాలకు ఒక్కొక్క నినాధాన్నిస్తూ ముందుకు తీసుకుపోతున్నారు. 1999లో 'అవర్ ఛేంజింగ్ ఎర్త్' అనే నినాదంతో సైన్స్ దినోత్సవం జరిగింది.
అలాగే 2000 సంవత్సరంలో Recreating interst in basic science అన్ననినాదంతో ముందుకు పోయింది. ఈ విధంగా రకరకాల నినాదాలతో ఏటా సైన్స్ దినోత్సవాన్ని జరుపుకుటున్నారు. మరి ఈ ఏడాది నినాదం ఏంటె తెలుసా పిల్లలూ! Science for the people, and people for the science అనే ధీమ్ 2019 కి కాను నిర్ణయించారు. సైన్స్ విద్యను ప్రచారం చేసినందుకు, బోధనా పరికరాలతో సైన్స్ను అర్థం చేయించడంతో ప్రముఖ పాత్ర వహించిన వారికి పురస్కారాలు ఇచ్చి గౌరవించడం సైన్స్ దినోత్సవం విశేషం
Authorization