హాయ్ పిల్లలూ...! మీరెప్పుడైనా బట్టమేక పేరు విన్నారా..? ఇదో పక్షిపేరు...ఎగరగలిగే పెద్ద పక్షి జాతుల్లో ఇదీ ఒకటి. అయితే ప్రపంచంలోనే ప్రత్యేకమైన స్థానాన్ని పొందిన ఈ పక్షి నేడు అంతరించిపోయే దశలో ఉంది. మరి వాటి విశేషాలు తెలుసుకుందామా....
- భారత్, పాకిస్థాన్ దేశాలకు స్థానిక పక్షి అయిన బట్టమేక సుమారు 4 అడుగుల ఎత్తు ఉంటుంది. దీన్ని ఇంగ్లిష్లో 'గ్రేట్ ఇండియన్ బస్టర్' అంటారు. ఒకప్పుడు పశ్చిమాన పాకిస్థాన్ నుంచి తూర్పున బెంగాల్, దక్షిణాన తమిళనాడు వరకు విస్తరించి ఉండేదట ఈ పక్షి. ఇప్పుడు మాత్రం రాజస్థాన్, పాకిస్థాన్లను అనుసరించి ఉన్న ఎడారి గడ్డి భూముల్లో ఎక్కువగా కనిపిస్తాయి.
- ఈ పక్షులు సర్వభక్షకాలు. పరిసరాల్లో దొరికే క్రిమి కీటకాలు, చిన్న క్షీరదాలు, పాములను ఆహారంగా తీసుకుంటాయి. వర్షకాలంలో మాత్రం క్రిమి కీటకాలే ప్రధాన ఆహారం. చలి, వేసవి కాలాల్లో గోధుమలు, జొన్నలు ఇతర ధాన్యాన్ని తిని బతికేస్తాయి. వీటి బరువు 15 కిలోల దాకా ఉంటుంది. ఇవి 12 నుంచి 15 ఏండ్లు జీవిస్తాయి.
- గద్దలు, రాబందులు, తోడేళ్లు లాంటివి వీటికి సహజ శత్రువులు. చిన్న బట్టమేకల మీదైతే నక్కలు, కుక్కలు దాడిచేస్తాయి. వాటి గుడ్లను నక్కలు, ముంగిసలు, ఎడారి బల్లులు, రాబందులు భోంచేస్తాయి. ఇవి తుప్పల్లో గుడ్లు పెడతాయి, కనుక ఆ ప్రాంతంలో మేతకు వచ్చిన పశువులు తొక్కేస్తుంటాయి.
- బట్టమేకలు సంవత్సరం పొడవునా గుడ్లు పెట్టగలిగినా... మార్చి- సెప్టెంబరు నెలల కాలం మాత్రమే వాటికి అనువైంది. ఇవి ఏడాదికి ఒకటి లేదా రెండు గుడ్లు పెడతాయి. 27 రోజుల పాటు పొదుగుతాయి. పిల్లలు బయటికి వచ్చిన 30-35 రోజుల్లో తమంతట తాము బతికేయగలుగుతాయి.
- మరి ఇవి ఎందుకు తగ్గిపోతాయబ్బా అనుకుంటున్నారా? ఎందుకంటే అవి నివాసం ఉండే ప్రాంతాలు... అంటే గడ్డి భూములు క్షీణించడమే. ఒకప్పుడు ఇవి వాయువ్య, మధ్య భారతదేశం అంతటా చాలా ఎక్కువ సంఖ్యలో కనిపించేవట. ఇప్పుడేమో ఆ ప్రాంతాల్లో జనాభా పెరగడం, ఇంకా వాటిని వినోదం కోసం, ఆహారం కోసం వేటాడటం, అవి గుడ్లు ఒకటి లేదా రెండే పెట్టడంతో ఏ కారణంతోనైనా గుడ్లు పగిలిపోవడం లాంటివి కూడా బట్టమేకలు అంతరించి పోయేందుకు కారణాలు. అంతేకాకుండా రైతులు గోధుమలు, జొన్నలు లాంటి ధాన్యాలు కాకుండా పత్తి, చెరకు లాంటి వ్యాపార పంటలను పండించటం మొదలుపెట్టారు. దాంతో వాటికి తగినంత ఆహారం దొరకట్లేదు. వీటికి తోడు ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తాకడం వల్ల కూడా ఇవి చనిపోతున్నాయి.
- అయితే 1994లోనే బట్టమేకను అంతర్జాతీయ ప్రకృతి సంరక్షణ సమాఖ్య (ఐ.యూ.సి.ఎన్) ముప్పును ఎదుర్కొంటున్న జీవుల విభాగంలో చేర్చింది. 2011 నాటికి వీటి సంఖ్య మరింత ప్రమాదకర స్థాయికి పడిపోవడంతో, వీటిని తీవ్రమైన ముప్పును ఎదుర్కొంటున్న ప్రాణుల జాబితాలోకి చేర్చింది. రాజస్థాన్లోనే వీటి సంఖ్య ఎక్కువ. ఇది ఆ రాష్ట్ర పక్షి కూడా. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా రోళ్లపాడులో బట్టమేక సంరక్షక కేంద్రం ఉంది.
పిల్లలూ...! బాగున్నాయి కదూ బట్టమేక పక్షి విశేషాలూ...
Authorization