మన భూమి మీద మూడొంతులు నీరున్నా, అందులో 97 శాతం సముద్రపు ఉప్పు నీరే. మిగతా మూడు శాతం మాత్రమే మంచినీరు. ఇందులో కొంత భూమి పొరల్లో ఉంది. దీన్నే మనం భూగర్భ జలం అంటున్నాం. మితిమీరిన వాడకం ద్వారా భూగర్భ జలమట్టాలు బాగా తగ్గిపోతున్నాయి. భూగర్భ జలాలు పెరగాలంటే వర్షాలు బాగా కురవాలి. వర్షాభావ పరిస్థితులు రాకుండా చేసే పద్ధతుల్ని పాటిస్తూ భూగర్భజలాలను అధికంగా వాడకుండా ఉండాలి. అడవుల్ని పెంచడం, నదుల అనుసంధానం ద్వారా ఆనకట్టల నిర్మాణం, ఇంకుడు గుంతల్ని ప్రోత్సహించడం, చెరువుల్ని కాపాడుకోవడం, కాలుష్యాన్ని తగ్గించడం లాంటి చర్యలు భూగర్భ జలాల పతనాన్ని కొంత మేర ఆపుతాయి.