జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ)
ఆధునిక కాలంలో అనేక రాజ్యాలు ప్రజాస్వామ్యాన్ని కలిగి ఉన్నాయి. ప్రజాస్వామ్యానికి ఊపిరి స్వేచ్ఛ. రాజ్యాంగం మానవులకు కొన్ని హక్కులను ప్రసాదించింది. అందులో ప్రాణ రక్షణ హక్కు అత్యంత ప్రధానమైనది. ఏ వ్యక్తి అయినా ఆత్మహత్య చేసుకోరాదు. అలాగే ఏ వ్యక్తిని ఎన్కౌంటర్ చేయకూడదు. ఒక వేళ ఏ వ్యక్తినైనా అన్యాయంగా ఎన్కౌంటర్ పేరిట చంపినా ప్రశ్నించడానికి రాజ్యాంగం జాతీయ మానవ హక్కుల హక్కుల కమిషన్ను ఏర్పాటు చేసింది. అలాగే తప్పు చేసిన వ్యక్తులను రాజ్యాంగ శాసనం ప్రకారం శిక్షించాలి. కాని చట్టాన్ని తీసుకొని ప్రభుత్వాలు ఏ విధమైన చర్యలకు పాల్పడరాదు. ఒక వేళ అలాంటి పరిస్థితులు ఎదురైతే జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆయా సంఘటలను సుమోటోగా తీసుకొని విచారణ చేపడుతుంది. ఇటీవల రాష్ట్రంలో వెటర్నరీ డాక్టర్ ప్రియాంకరెడ్డి (దిశ) హంతకుల ఎన్కౌంటర్ నేపథ్యం ఎన్హెచ్ఆర్సి విచారణ చేపట్టింది. అయితే ఎన్హెచ్ఆర్సీ గురించి ఏర్పాటు నిర్మాణం, విధులు తదితర విషయాలు టిఎస్పీఎస్సీ అభ్యర్థుల కోసం..
1991వ సంవత్సరంలో పారిస్లో మానవ హక్కుల పరిరక్షణపై ఒక సదస్సు జరిగింది. దీనికి అనుగుణంగా ఐక్యరాజ్యసమితి సాధారణ సభ ఒక తీర్మానం చేసింది. దీని మూలంగా మానవ హక్కుల కమిషన్ను ఏర్పాటు చేయాలని అన్ని రాజ్యాలు నిర్ణయించాయి.
మానవ హక్కుల రక్షణ 1993 పేరుతో పార్లమెంటు ఒక ప్రత్యేక చట్టాన్ని చేసింది. దాని ఆధారంగా 13 అక్టోబర్ 1993న జాతీయ మానవ హక్కుల కమిషన్ ఏర్పడింది. ఇది రాజ్యాంగబద్ధమైన సంస్థ కాదు కానీ చట్టబద్ధమైన, స్వయం ప్రతిపత్తి గల సంస్థ. పి.వి. నరసింహారావు ప్రధాన మంత్రిగా (కాంగ్రెస్ పార్టీ హయాంలో) మానవ హక్కుల కమిషన్ను ఏర్పాటు చేశారు. ఈ చట్టం ప్రకారం రాష్ట్రాలలో కూడా మానవ హక్కుల కమిషన్లను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇండియాలో 23 రాష్ట్రాలలో మానవ హక్కుల కమిషన్లు ఉన్నాయి. 1993 మానవ హక్కుల కమిషన్ను 2006లో కొన్ని మార్పులు చేర్పులతో సవరించారు. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది.
మానవుడు మనిషిగా మనుగడ సాగించడానికి మానవ హక్కులు తోడ్పడతాయి. ఇది మానవుని జీవితానికి అత్యంత ఆవశ్యకమైనవి. ఇది మానవ హక్కుల పరిరక్షణను పెంపొందించడం, సంరక్షణ కర్తగా వ్యవహరిస్తుంది.
రాజ్యాంగం, అంతర్జాతీయ ఒడంబడికల ప్రకారం వ్యక్తి జీవితం, స్వేచ్ఛ, సమానత్వం, పరువు మర్యాదలకు సంబంధించిన హక్కులను మానవ హక్కులుగా 1993లో ఏర్పాటైన ఎన్హెచ్ఆర్సీ పరిగణిస్తుంది.
నిర్మాణం : కమిషన్ ఒక బహుళ సభ్యసంస్థ. జాతీయ మానవ హక్కుల కమిషన్లో ఒక చైర్మన్, నలుగురు ఇతర సభ్యులు ఉంటారు. వీరికి కింది అర్హతలు ఉండాలి. అవి : 1. చైర్మన్గా నియమించబడే వ్యక్తి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవి విరమణ చేసిన (విశ్రాంత) వారై ఉండాలి.
(నోట్ : ఒక వేళ విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి అందుబాటులో లేని సమయంలో విశ్రాంత సుప్రీం కోర్టు న్యాయమూర్తిని కూడా కమిషన్ చైర్మన్గా నియమించ వచ్చని 2010లో సవరించారు)
2. ఒక సభ్యుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పని చేస్తూన్న లేదా పదవి విరమణ చేసిన వారై ఉండాలి.
3. మరోక సభ్యుడు ఏదైనా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్న లేదా పదవీ విరమణ చేసిన వారై ఉండాలి.
4. మిగిలిన ఇద్దరు సభ్యులు మానవ హక్కుల రంగంలో పరిజ్ఞానం ఉన్న వారై ఉండాలి.
వీరితో పాటు మరో నలుగురు పదవీ రీత్యా సభ్యులుగా ఉంటారు. వారు జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ చైర్మన్, జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ చైర్మన్, జాతీయ మైనారిటీ కమిషన్ చైర్మన్, జాతీయ మహిళా కమిషన్ చైర్మన్.
చైర్మన్, సభ్యుల నియామకం : జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్, సభ్యులను భారత రాష్ట్రపతి నియ మిస్తాడు.వీరి నియామకంలో ప్రధానమంత్రి అధ్యక్షతన ఆరుగురు సభ్యుల అత్యున్నత కమిటీ సలహాలిస్తుంది. కమిటీలో ఈ కింది వారు సభ్యులు
1. అధ్యక్షుడు - భారత ప్రధాన మంత్రి
2. సభ్యులు : - కేంద్ర హౌం శాఖ మంత్రి
3. - లోక్సభ స్పీకర్
4. - రాజ్యసభ స్పీకర్
5. - లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు
6. - రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు
పదవీకాలం : ఎన్హెచ్ఆర్సీ చైర్మన్, సభ్యుల పదవీకాలం 5 సం||లు లేదా 70 ఏండ్ల వయస్సు (ఏది ముందు అయితే అది వర్తిస్తుంది) ఉంటుంది. వీరు పదవీ విరమణ తరువాత కేంద్ర రాష్ట్ర స్థాయిలో ఎటువంటి లాభదాయక పదవినీ చేపట్టరాదు.
తొలగింపు : వీరిని యూనియన్ పబ్లిక్ కమిషన్ చైర్మన్ను తొలగించిన మాదిరిగానే రాష్ట్రపతి తొలగిస్తాడు. కమిషన్ చైర్మన్, సభ్యులు తమ రాజీనామాను రాష్ట్రపతికి సమర్పిస్తారు. సభ్యులు వయోపరిమితికి లోబడి రెండవ పర్యాయం కూడా నియామకం కావచ్చును.
భారత రాష్ట్రపతి ఈ కింది కారణాల దృష్ట్యా వారిని పదవిలో నుంచి తొలగించవచ్చు.
1. కమిషన్ చైర్మన్, సభ్యులు దివాలా తీసినట్లు తీర్పు వచ్చినపుడు
2. పదవీకాలంలో లాభదాయక పదవిని చేపట్టినట్టు రుజువుకావడం
3. మానసికంగా, శారీరకంగా అనారోగ్యానికి గురైనపుడు
4. ఏదేని నేరానికి న్యాయస్థానం శిక్ష విధించినపుడు
జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్గా వ్యవహరించిన వారు :
చైర్మన్ పేరు పదవీకాలం
1. జస్టిస్ రంగనాథ్ మిశ్రా - 12 అక్టోబర్ 1993
నుంచి 24 నవంబర్ 1996
2. జస్టిస్ ఎం.ఎన్ వెంకటాచలయ్య
- 26 నవంబర్ 1996
నుంచి 24 అక్టోబర్ 1999
3. జస్టిస్ జె.ఎస్. వర్మ - 04 నవంబర్ 1999 నుంచి 17 జనవరి 2003
4. జస్టిస్ ఏ.ఎస్. ఆనంద్ - 17 ఫిబ్రవరి 2003 నుంచి 31 అక్టోబర్ 2006
5. జస్టిస్ శివరాజ్ పాటిల్ (తాత్కాలిక) - 01 నవంబర్ 2006 నుంచి 01 ఏప్రిల్ 2007
6. జస్టిస్ రాజేంద్రబాబు - 02 ఏప్రిల్ 2007
నుంచి 31 మే 2009
7. జస్టిస్ గోవింద్ ప్రసాద్ మాథూర్ - 01 జూన్ 2009
(తాత్కాలిక) నుంచి 06 జూన్ 2010
8. జస్టిస్ కె.జి.బాలక్రిష్ణన్ - 07 జూన్ 2010
నుంచి మే 2015
9. జస్టిస్ సిరియక్ జోసెఫ్ - 11 మే 2015
నుంచి 28 ఫిబ్రవరి 2016
10. జస్టిస్ హండ్యాల లక్ష్మీనారాయణ దత్తు
- 29 ఫిబ్రవరి 2016 నుంచి 02 డిసెబంర్ 2020
జాతీయ మానవ హక్కుల కమిషన్ ప్రస్తుత చైర్మన్,సభ్యులు
1. చైర్మన్ : జస్టిస్ హెచ్.ఎల్.దత్తు
2. సభ్యులు : 1. జస్టిస్ ప్రఫుల్ల చంద్ర పంత్
2. జస్టిస్ జ్యోతిక కల్రా
3. డాక్టర్ జ్ఞానేశ్వర్ మనోహర్ ములే
4. (ఖాళీగా ఉంది)
గమనిక : ఒక మహిళా సభ్యురాలు తప్పనిసరిగా ఉండాలి.
కమిషన్ విధులు :
- కమిషన్ ఒక సెమీ జ్యుడీషియల్ వ్యవస్థగా పని చేస్తుంది.
- దేశంలో ఎక్కడైనా మానవ హక్కుల ఉల్లంఘన జరిగితే బాధితుడు కమిషన్ను సంప్రదించవచ్చు. అదే విధంగా బాదితుడి పక్షాన వేరే వ్యక్తి పిటీషన్ వేసినట్లైతే కమిషన్ దానిని స్వీకరించి విచారిస్తుంది.
- కొన్నిసార్లు కమిషన్ సుమోటో వ్యాఖ్యగా తనంతట తానుగా జోక్యం చేసుకొని విచారణ చేస్తుంది. ఉదా: దిశ ఎన్కౌంటర్ విచారణ
- న్యాయస్థానాల అనుమతితో మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన కేసులో కక్షిదారునిగా చేరుతుంది.
- న్యాయస్థానం ముందు మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణలపై పెండింగ్లో ఉన్న కేసులను చొరవతో తొందరగా విచారణ జరిగేటట్లు చేస్తుంది.
- జైళ్ళను లేదా ఇతర నిర్బంధ కేంద్రాలను తనిఖీచేసి అక్కడ నిర్భంధంలో ఉన్న వారికి సౌకర్యాలను విచారించి అవసరమైన మార్గదర్శకాలను జారీ చేస్తుంది.
- మానవ హక్కుల అమలుకు సంబంధించి ఏ వ్యక్తి నుండైనా, వాంగ్మూలాలను సేకరించడం, కమిషన్ ఎదుట హాజరుకమ్మని ఆదేశించటం.
- ఉగ్రవాద చర్యల వల్ల మానవహక్కులకు విఘాతం కలిగించే అంశాలను గుర్తించి, వాటిని తొలగించడానికి తగిన సూచనలిస్తుంది.
- కోర్టు పరిధిలో ఉన్న కేసుల విచారణకు కమిషన్ న్యాయ స్థానాల అనుమతి పొందాల్సి ఉంటుంది.
- మానవ హక్కుల పరిరక్షణకై కృషి చేసే ఎన్జీఓలను ప్రోత్సహిస్తుంది.
- మానవ హక్కుల ఉల్లంఘనకు గురైన వ్యక్తికి నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వానికి సిఫార్సు చేస్తుంది.
- మానవ హక్కుల అభ్యున్నతికి అవసరమయ్యే ఏ ఇతర విధులనైనా చేపట్టడం.
కమిషన్ పనితీరు
మానవ హక్కుల కమిషన్ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో కలదు. కానీ కమిషన్ తన కార్యాలయాలను దేశంలో ఎక్కడైనా స్థాపించవచ్చు. కమిషన్కు సివిల్ కోర్టు అధికారాలు ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎటువంటి నివేదికలను గాని లేదా సమాచారాన్ని అయినా పొందవచ్చు.
మానవ హక్కుల కమిషన్కు సంవత్సరం క్రితం కంటే ముందు జరిగిన కేసులను విచారించే అధికారం లేదు. న్యాయస్థానాలలో విచారణలో ఉన్న అంశాలను నేరుగా విచారించే అధికారం లేదు. సైనిక దళాలచే జరిగిన మానవ హక్కుల ఉల్లంఘనలు కమిషన్కు పరిమిత అధికారం మాత్రమే ఉంది. ఇది సలహా పూర్వకమైంది. చర్యలకై సూచనలిస్తుంది. కాని నేరుగా ఏ చర్యనైనా చేపట్టలేదు. ఎవరినీ శిక్షించదు. కమిషన్ తన నివేదికను రాష్ట్రపతికి అందిస్తుంది. రాష్ట్రపతి దానిని పార్లమెంటు ముందు ప్రవేశపెడతాడు.
రాష్ట్ర మానవ హక్కుల కమిషన్
మానవ హక్కుల పరిరక్షణ చట్టం 1993 జాతీయ మానవ హక్కుల కమిషన్నే కాక రాష్ట్రస్థాయిలో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ని ఏర్పర్చింది. రాజ్యాంగంలోని ఏడో షెడ్యూల్లో ఉన్న రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాలోని మానవ హక్కులకు సంబంధించిన అంశాలను మాత్రమే విచారణ చేస్తుంది. అయితే సంబంధిత అంశాలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ విచారణ చేపట్టి ఉంటే రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సదరు విషయంపై విచారణ చేయదు. ప్రస్తుతం ఇండియాలో 23 రాష్ట్రాలలో మానవ హక్కుల కమిషన్లు ఏర్పాటు చేయబడినవి.
1993లో పార్లమెంటు రూపొందించిన మానవ హక్కుల రక్షణ చట్టాన్ని 2006లో సవరించారు. దీని ప్రకారం మానవ హక్కుల కమిషన్లో సభ్యుల సంఖ్య 5 నుంచి 3కు తగ్గించారు. ఇందులో ఒక చైర్మన్, ఇద్దరు సభ్యులు ఉంటారు. ఇది బహుళ సభ్య సంస్థ.
అర్హతలు :
1. హైకోర్టు పదవి విరమణ చేసిన న్యాయమూర్తి చైర్మన్గా ఉంటారు.
2. ఒక సభ్యుడు హైకోర్టులో పదవిలో ఉన్న లేదా హైకోర్టు నుంచి పదవీ విరమణ చేసిన న్యాయమూర్తి కానీ కనీసం 7 సం||లు జిల్లా న్యాయమూర్తి అనుభవం ఉన్న వ్యక్తి అయి ఉండాలి.
3. మరో సభ్యుడు మానవ హక్కుల రంగంలో పరిజ్ఞానం ఉన్న వ్యక్తి అయి ఉండాలి.
రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ మరియు సభ్యులను గవర్నర్ నియమిస్తాడు. కాని వారిని తొలగించేది భారత రాష్ట్రపతి. ముఖ్యమంత్రి అధ్యక్షతన ఏర్పడే ఆరుగురు సభ్యుల అత్యున్నత అధికార కమిటీ. వీరి నియామకంలో గవర్నర్కు సలహాలిస్తుంది.
1. రాష్ట్ర ముఖ్యమంత్రి (కమిటీకి అధ్యక్షుడు)
2. రాష్ట్ర శాసనసభ స్పీకర్
3. రాష్ట్ర విధాన సభలో ప్రతిపక్ష నాయకుడు
4. రాష్ట్ర విధాన పరిషత్తులో ప్రతిపక్ష నాయకుడు
5. శాసన మండలి చైర్మన్
6. రాష్ట్ర గృహ మంత్రి (హౌం శాఖ)
కాల పరిమితి :
రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ మరియు చైర్మన్ పదవీకాలం 5 సంవత్సరాలు లేదా వారి వయస్సు 70 సంవత్సరాలు వచ్చే వరకు ఇందులో ఏది ముందు అయితే అది వర్తిస్తుంది.
(గమనిక : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 20 డిసెంబర్ నాడు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్గా జస్టిస్ గుండా చంద్రయ్యను, సభ్యులుగా జిల్లా సెషన్స్ జడ్జి (రిటైర్డ్) నడిపల్లి ఆనందరావును, మహమ్మద్ ఇర్ఫాన్ మొయిను ద్దీన్ (నాన్ జ్యుఢషిీయల్)ను నియమించింది. కానీ వీరి పదవీకాలం 3 సం||లుగా ఉత్తర్వుల్లో పేర్కొంది.)
కమిషన్ చైర్మన్ మరియు సభ్యులను గవర్నర్ నియమిస్తే వారిని రాష్ట్రపతి ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ మరియు సభ్యులను తొలగించిన విధంగానే తొలగిస్తారు. వీరు రాజీనామా చేయాలంటే రాజీనామా లేఖను గవర్నర్కు సమర్పిస్తారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్గా పని చేసిన వారు.
1. జస్టిస్ సుభాషన్ రెడ్డి (2005 - 10)
2. జస్టిస్ నిస్సార్ అహ్మద్ ఖక్రు (2011 - 2016)
విధులు
1. మానవ హక్కుల ఉల్లంఘన జరిగే విచారణను చేపడు తుంది.
2. జైళ్ళను నిర్బంధ గృహాలను సందర్శించి అక్కడ జీవన సౌకర్యాలను పరిశీలిస్తుంది.
3. మానవ హక్కులకు భంగం జరుగుతున్న కేసుల విచారణ న్యాయస్థానంలో వాయిదా పడినపుడు జోక్యం చేసు కోవడం
4. మానవ హక్కుల గురించి ప్రజల మధ్య ప్రచారం చేయడం మరియు ఆ హక్కులకు గల రక్షణలను గురించి వారికి అవగాహన కలిగించడం
5. రాష్ట్రంలో మానవ హక్కుల కాపలాదారుగా కమిషన్ వ్యవహరిస్తుంది. మానవ హక్కులను పెంపొందించడం లో అవసరమైన ఇతర చర్యలను చేపట్టడం.
పని తీరు : కమిషన్కు సివిల్ కోర్ట్టుకు ఉండే అధికారే కమిషన్
కూడా ఉంటాడు.
- ఒక సంవత్సరం లోపల జరిగే వ్యవహారాలనే కమిషన్ విచారణ చేస్తుంది.
- బాధితునికి జరిగిన నష్టానికి నష్టపరిహారాన్ని చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తుంది.
- రాష్ట్ర మానవ హక్కుల కమిషన్కు శిక్షించే అధికారం లేదు.
- ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తరువాత మొదటిసారిగా రాష్ట్ర ప్రభుత్వం మానవ హక్కుల కమిషన్ చైర్మన్, ఇద్దరు సభ్యలను నియమించింది.
- తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్, చైర్మన్ - జస్టిస్ గుండా చంద్రయ్య
సభ్యులు - 1. ఎస్. ఆనందరావు 2. మహ్మద్ ఇర్ఫాన్
వీరి కాలపరిమితి 3 సంవత్సరాలు
Authorization