మన ప్రాచీన జానపద కళలు, వినోదాలను ఆధునిక ప్రసార మాధ్యమాలు అంతగా పట్టించుకోవడం లేదు. అందువల్ల ప్రజల్లోకి ఇవి చొచ్చుకుపోలేకపోతున్నాయి. టివి, రేడియో, పత్రికలు శిష్ట కళలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుండటంతో ప్రజా కళలు మరుగున పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తెరచీరలవారు ఇంకా మరుగున పడి ఉన్న వైనాన్ని గమనించాలి. యాదవుల్లో ఉన్న పన్నెండు ఉపకులాల్లో గొల్లవారి ఆశ్రిత కులమైన తెరచీరలవారిని 'తెల్జూరివారు', 'బైకానివారు' అనికూడా పిలుస్తారు. వీరు గొల్లల కర్మకాండలు, దేవర పండుగలు చేస్తారు. యాదవులలో ఎవరైనా చనిపోతే వారి ఆత్మశాంతికోసం కర్మకాండలలో సంగీత వాయిద్యాలతో పాల్గొని మరణించినవారి పేరున కథలు చెప్పి పారితోషికం పొందుతారు. యాదవులు తమ కులవృత్తి అయిన గొర్రెల మందలు, వ్యవసాయం, పశుపోషణ అన్ని విధాల సంపదలు అభివృద్ధి చెందాలని ప్రతి రెండు ఏండ్లకు ఒకసారి తమ కులదైవము లైన గంగమ్మ, కోటిలింగాల, లింగమంతుల, సౌనమ్మ వంటివారికి జరుపుకునే పండుగలకు తెరచీరల వారు పూజారులుగా వ్యవహరిస్తారు.
తెల్జూరువారు ఒక గుడారాన్ని దువర పండుగ ముందు వేస్తారు. ఆ గుడారంలో తెరచీరల పటం ప్రదర్శిస్తారు. వీరు తమ కథాపురాణం చెప్పడానికి పటాలు ఉపయోగిస్తారు. పురాణం ప్రదర్శించడానికి ముందు గొల్ల కుల పెద్దకు వీరతిలకం దిద్ది ఆహ్వానిస్తారు. తర్వాత గొల్లలను, ఇతర కులాలవారందరినీ ఆహ్వానించి కథాపురాణం ప్రారంభిస్తారు. ఇది తెల్జూరివారి వృత్తి.
బైకానివారు మొదటగా తమ బైకానిపెట్టె (దేవర పెట్టె)ను పండుగ చేసే దేవాలయాలున్న ప్రదేశంలోని గుడారం లోకి తీసుకువస్తారు. దేవర పెట్టెలో వీరు చెప్పే కథలకు సంబంధించిన దేవతా విగ్రహాలు ఉంటాయి. ఈ విగ్రహాలను కథలు చెప్పడానికి ముందు పట్నం వేసిన తరువాత అందులో విగ్రహ ప్రతిష్ట చేసి పూజలు నిర్వహించి ఈ దేవతా విగ్రహాలను చూపెడుతూ కథలు చెబుతారు. ఈ కథలను తెల్జూరివారు, బైకానివారు కలిసి చెప్పేవారు.
వీరి బృందంలో ఆరుగురు సభ్యులుంటారు. సుమారు 30 కథలు చెప్పగలరు. ఒక్కొక్క కథను వీరు రెండు లేదా మూడు రోజుల్లో పూర్తి చేయగలరు. అవి కుల దండకాలు, హరిశ్చంద్ర కథ, నల్లమూకరాజు కథ వంటివి ముఖ్యమైనవి. సమయాన్ని బట్టి, గొల్లలు ఇచ్చే పారితోషికాన్ని బట్టి కథలు చెబుతారు. వీరు జాతర్లకు, పండగలకే కాకుండా గొల్లవారిలో ఎవరైనా మరణించినప్పుడు వారి కర్మకాండలు నిర్వహించుట, మరణించినవారి ఆత్మశాంతికోసం వారి పేరున కూడా కథలు చెబుతారు. వీరణం, తాళాలు, గజ్జెలు, ఇతర సంగీత వాయిద్యాలు, తెరచీరల పటం, గంగమ్మ పటం, బైకాని పెట్టె తాళపత్ర గ్రంథాల సాయంతో కళారూపం ప్రదర్శిస్తారు.
తెరచీరల వారి దగ్గర సుమారు 26 కథలకు సంబంధించిన తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి. వీరు తాళపత్రాల్లో లిఖితమై ఉన్న కథలను చదివి వాటిని కంఠస్థం చేసుకొని మౌఖికంగా కథలు చెబుతారు. నాటి నుంచి నేటి వరకు ఈ కళారూపం సజీవంగా ఉండటానికి కారణం ఈ తాళపత్ర గ్రంథాలే అంటే అతిశయోక్తి కాదు.
అన్ని ప్రాంతాలు సంచరిస్తూ గొల్లల సహాయంతో జీవిస్తూ ఉన్న ఈ తెరచీరలవారు దాదాపు కనుమరుగయ్యే పరిస్థితి దాపురించింది. వీరు తెలంగాణతో పాటు ఆంధ్ర జిల్లాల్లోను విస్తరించి ఉన్నారు. వీరిని ఆదుకోవలసిన బాధ్యత అందరిపైనా ఉంది.
-మెట్టు వెంకటనారాయణ
Authorization