భారతీయ సమాజం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఒకటి నిజాయితీ లేమి. షాపుల్లో నిఘా కెమేరాలు ఉన్నా ఎన్నో దొంగతనాలు జరుగుతున్న దేశం మనది. అటువంటి దేశంలో షాపులో ఎవరూ లేకుండా కేవలం అమ్మే వస్తువులను పెట్టి కస్టమర్ల నిజాయితీకి వదిలేస్తే ఏమన్నా ఉంటుందా! ఒక్క పూటలోనే షాపు పైసా ఆదాయం రాకుండానే ఖాళీ అయిపోదూ! కానీ స్విట్జర్లాండులో మాత్రం అట్లా కాదు. ఆల్ఫ్స్ పర్వత ప్రాంతాల్లో అక్కడక్కడ కొన్ని చిన్న చిన్న షాపులు ఉంటాయి. ఆ షాపుల్లో పాలు, తేనె, జున్ను, వెన్న, నెయ్యి, బ్రెడ్ వంటి తినే పదార్థాలను ఉంచుతారు. కానీ ఆ షాపుల్లో కూర్చొని అమ్మేవారు మాత్రం కనిపించరు. వారు ఏ గొర్రెల్నో, ఆవుల్లో కాసుకోవడానికో, పొలం పనులకో వెళ్ళిపోతారు. కస్టమర్లు మాత్రం ఇటువంటి షాపుల్లోకి వెళ్లి తమకు కావలసినవన్నీ తీసుకుని చాలా నిజాయితీగా అక్కడే ఉన్న చిల్లర పెట్టెలో డబ్బులు వేసి వెళ్లిపోతారు. ఇటువంటి 'హానెస్టీ షాపు''ల వల్ల ఆ ప్రాంతాల్లో ఉండే ప్రజల్లో నిజాయితీ సంస్కృతి పెరిగిపోతున్నదట. మరి మన దేశంలో అయితే ఏమవుతుందో ఊహించండి!