భారతీయ జానపద కళారూపాల్లో బొమ్మలాటలకు ప్రత్యేక స్థానం ఉంది. చెక్కబొమ్మలాట, తాటాకు బొమ్మలాట, తోలుబొమ్మలాట, బుట్టబొమ్మలాట అంటూ రకరకాల బొమ్మలాటలతో జానపదులు కాలక్షేపం చేసేవారు. ఈ అన్ని ఆటల్లోనూ బహుళ ప్రజాదరణ పొందినది, అత్యంత ఆసక్తికరమైనది తోలుబొమ్మలాట. తోలుబొమ్మలాటనే తెరచీరలాట అని కూడా అంటారు. కరువు ప్రాంతమైన రాయల సీమలో వర్షం రాకపోతే ఈ ఆట ప్రదర్శిస్తే వర్షం వస్తుందనే నమ్మకం ఉండేది. అంటే అంతగా ఈ ఆట ప్రజల్లోకి చొచ్చుకుపోయిందన్న మాట.అటువంటి తోలుబొమ్మ ఆటపై ఇస్తున్న ఈ వ్యాసం మీకోసం...
తోలు అంటే చర్మం. జింక, పొట్టేలు, గొర్రె వంటి జంతువుల చర్మాలతో రకరకాల బొమ్మల్ని తయారుచేస్తారు. చర్మాన్ని శుద్ధి చేసి ఆకారాన్ని గీస్తారు. రంగులు వేస్తారు. ఇవి ముఖ్యంగా రామాయణ కథకు సంబంధించినవై ఉంటాయి. మేక చర్మాన్ని వేడి నీళ్లలో శుద్ధి చేసి నేలపై ఆరబెడతారు. బొమ్మల్ని తయారుచేయడానికి పోగర, గుండు పోగర, దబ్బ పోగర, కత్తెర, చెక్క సూది అనే వస్తువులను ఉపయోగిస్తారు.
సవారు బండిలో సాగిపోతూ...
తోలుబొమ్మలాటలో హాస్యపాత్రలు ప్రత్యేకం. వాటిని కేతిగాడు, బంగారక్క, జుట్టుపోలిగాడు, బిల్లేబిత్తిరిగాడు, వినాయకుడు, సరస్వతి బొమ్మల్ని ప్రార్థన కోసం ముందుగానే తెరపై ఉంచుతారు. తయారైన బొమ్మల్ని వెదురుదబ్బలతో తయారుచేసిన పెట్టెలో భద్రపరుస్తారు. గుడ్డలతో కప్పుతారు. ఆటకు కావాల్సిన సామాగ్రినంతా రథంబండి (సవారు బండి)లో అమర్చుకుంటారు. సంసారమంతా బండిలోనే ఉంటుంది. వీరి ఆస్తి బొమ్మలు మాత్రమే. కుమారులు వేరైపోతే బొమ్మల్ని పంచి ఇస్తారు. గ్రామగ్రామాలు తిరుగుతూ ఆటను ప్రదర్శిస్తారు.
తోలుబొమ్మలాట తెలుగు రాష్ట్రాల్లోనే కాక మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, బెంగాల్ ప్రాంతాల్లో మనుగడలో ఉంది. ఉత్తరప్రదేశ్లో 'కట్పుత్తి' అనే కొయ్యబొమ్మలాటలు, దక్షిణ ప్రాంతంలో కీలుగుర్రపు బొమ్మలాటలు,, బొమ్మలాట్టం అనే కొయ్యబొమ్మలాటలు ప్రచారంలో ఉన్నాయి. ఈ బొమ్మలాటలను ప్రదర్శించేవారు చాలావరకు మరాఠీ వారే. వీరిని కన్నడంలో 'కిషేషి క్యాత' జాతివారని, తమిళ ప్రాంతంలో 'కిల్లే క్యాతవా' అని, తెలుగుదేశంలో బొమ్మలాటలవారు, చర్మ నాటకులని పిలుస్తున్నారు. తోలుబొమ్మలాటలు మహారాష్ట్ర నుంచి తెలుగువారికి సంక్రమించినట్లు చెబుతారు. భారతంలోని విరాట పర్వంలో ఈ ఆట ప్రస్తావన ఉంది. ఈ ఆట ఆడేవారు బెల్గాం, కొల్హాపూర్, సతారా, పూణా, బీజాపూర్, ప్రాంతాల నుంచి పాలకుల జైత్రయాత్రల్లోనూ, ఆయా దేశాల్లో విప్లవోద్యమాలు వచ్చినప్పుడు వలస వచ్చినట్లు చెబుతారు.
సాహిత్యంలో...
పండితారాధ్య చరిత్ర గ్రంథంలో శ్రీశైలంలో శివరాత్రి ఉత్సవాల్లో తోలుబొమ్మలాట ప్రస్తావన కనిపిస్తుంది.
భారతాది కథల జీరమఱుగుల
నారంగ బొమ్మల నాడించువారు
గడునద్భుతంగా గంబసూత్రంబు
లడరంగ బొమ్మలనాడించువారు
అంటూ చేసిన ప్రస్తావన మధ్యయుగాల నాటికే తోలుబొమ్మలాట ఉనికిలో ఉందని అర్థమవుతుంది. పాల్కురికి సోమనాథుని కాలం నుంచి తంజావూరు రఘునాథరాయుల కాలం వరకు అనేకమంది కవులు, రచయితలు, తోలుబొమ్మలాటలను గురించి తెలియ జేశారు. పల్నాటి వీర చరిత్రలో శ్రీనాథ మహాకవి ''ప్రతిమలాడగ బట్టినయట్లు'' అని తెలిపాడు. నాచన సోమన ఉత్తర హరివంశంలో యంత్రకు డాడించి యననిద్రోచిన వ్రాలు బొమ్మల గతి రథవూగములును
అని తెలిపాడు. తోలుబొమ్మలాట కళాకారులు గోన బుద్ధారెడ్డి రామాయణంలోని ద్విపదలను పాడేవారని సురవరం ప్రతాపరెడ్డిగారు రాశారు.
ఇక శాసనాల్లో తోలుబొమ్మలాట ప్రస్తావనల సంగతికొస్తే... చాగంటి శేషయ్య చదివి వెలికి తీసిన వివరాల ప్రకారం ప్రస్తుతం కడప జిల్లాలో ఉన్న చిడిపిరాల గ్రామాన్ని చంద్రయ్య, బొమ్మలాట అమృత కవి అనే వారిద్దరు తెరనాటకాలు ఆడటానికి పెదచిట్టయ్య వ్యక్తికి దానం ఇచ్చినట్లు ఓ శాసనంలో ఉంది. కాకతీయులకు సంబంధిం చిన వరంగల్ జిల్లా గూడూరు శాసనం చివరిభాగంలో సూత్రధారి ''కొమ్మోజనహ బరహ'' అని ఉంది. అంటే సూత్రధారి కొమ్మోజు రాసిందన్నమాట.
వేదిక
సాధారణంగా గ్రామంలోని ఖాళీ స్థలాల్లోను, నాలుగు రోడ్ల కూడలి ప్రదేశంలోను ప్రదర్శనా వేదికను సిద్ధం చేసుకుంటారు. తెల్లపంచలు, చీరలతో తెర కట్టుకుంటారు. తెరపై తుమ్మ ముళ్లతో బొమ్మల్ని చెక్కుతారు. తెరలోపల చమురు దీపాలు పెడతారు. ఈ దీపాల వెలుతురులో ప్రేక్షకులు బొమ్మల్ని చూడటానికి బాగుంటాయి. అయితే బొమ్మలను ఆడించేవారు కనిపించకుండా ఉంటారు. ప్రస్తుతం ఈనూనె దీపాల బదులు కరెంటు బల్బులను వాడుతున్నారు.
వాయిద్యాలు
తోలుబొమ్మలాటలో ఉపయోగించే వాయిద్యాలు హార్మోనియం, మద్దెల, గజ్జెలు, తొక్కుడు చెక్క తాళాలు, తప్పెట వంటివాటిని ఉపయోగిస్తారు. హాస్యపాత్రలు వచ్చినప్పుడు తప్పెటతో రకరకాలుగా మోగిస్తారు. ఆటగాళ్లు తెరల వెనక ఉంటే, ప్రేక్షకులు తెరల ముందు కూర్చొచుంటారు. రామాయణంలోని లంకాదహనం, మైరావణ చరిత్ర, లక్ష్మణ మూర్ఛ, ఇంద్రజిత్తు విజయం, పాతాళ హోమం, అంగద రాయబారం వంటి కథలను ప్రదర్శించడం కనిపిస్తుంది.
-సిహెచ్.కె.రెడ్డి
Authorization