మానవుని వివేచనా శక్తివల్ల అతడు జంతువు కన్నా అధికుడయ్యాడు. జంతువుకు లేని చైతన్యం అతడికుంది. పరిణామ క్రమంలో ఈ చైతన్యం బాహ్యప్రపంచాన్ని గుర్తించేందుకు తోడ్పడింది. ఒకసారి బాహ్యప్రపంచ సంబంధమైన స్పృహ ఏర్పడిన తరువాత, అది పరస్పరం ప్రతిస్పందించి నిరంతర ఘర్షణలో నిగ్గుతేలుతుంది. అప్పుడు ఆ చైతన్యానికి 'దిశ', 'ఉద్దేశం' ఏర్పడతాయి. ఉద్దేశం అంటూ ఏర్పడగానే 'తను', తనుకానిది అనే రెండుగా చైతన్యం విడిపోతుంది. ఆత్మాశ్రయ, వస్త్వాశ్రయ విభజన అనివార్యంగా, అనుబంధంగా ఏర్పడుతుంది.
చైతన్యానికి ఉన్న ఈ 'ఔద్దేశిక లక్షణం' మానవుణ్ణి అనన్యుణ్ణి చేస్తుంది. ఈ లక్షణం కారణంగానే మానవుడు సహజీవనం సాగించాడు. 'కలసిఉంటే కలదు సుఖం'అనే ఉద్దేశమే మానవులను సమాజాలుగా ఏర్పరచింది. ఇది మానవులకు మాత్రమే ప్రత్యేకం. అయితే మరి ఇతర పశుపక్ష్యాదులు మందలు, గుంపులుగా జీవిస్తున్నాయి కదా! మరి వాటికి మనకు ఉన్న తేడా ఏమిటి? చీమలు, తేనెటీగలు కూడా సమాజాలుగా ఉంటూ ఆహారాన్ని నిల్వచేసుకుంటాయి. వాటికీ పాలనా వ్యవస్థ ఉంది. మరి మానవ సమాజం ఏవిధంగా గొప్ప అనే అనుమానం రావచ్చు. అయితే వీటి ఈ సామూహిక ప్రవర్తన ఒక సహజాతం మాత్రమే. అది వివేచన ఫలితం కాదు. 'ఔద్దేశికత' వాటి ప్రవర్తనలో లేదు. వాటి సాంఘిక ప్రవర్తనను సహజాతం వివరిస్తే, మానవుని ప్రవర్తనను 'ఔద్దేశికత' వివరిస్తుంది.
మానవులు కొన్ని ప్రయోజనాల్ని ఆశించి సమాజాలుగా ఏర్పడినప్పుడు ఆ సమాజం ఔద్దేశిక సమాజం అవుతుంది. సమాజ సభ్యుడిగా మనిషికి ఏదైనా కొత్త అనుభూతులు, అనుభవాలు కలిగితే వాటిని బహిర్గతం చేయప్రయత్నిస్తాడు. ఇతరులకు అందించ చూస్తాడు. ఇతరులతో పంచుకోచూస్తాడు. అట్లా పంచుకోవడానికి అందరికీ తెలిసిన ప్రతీకలలో ఆ అనుభూతులను, అనుభవాలను నిబద్ధిస్తాడు. ప్రతీకలంటే భాష, భాషను వాహకం చేసుకొని ఇతరులతో తన అనుభవాలను పంచుకుంటాడు. ఈ పనినే మరొకడూ మరొకడూ చేస్తాడు. ఈవిధమైన ఆదాన ప్రదానాలతో విషయీకరణం చెందిన చైతన్యం సామాన్యమై పోతుంది. అప్పుడా చైతన్యం 'ఉమ్మడి' ఆస్తి అవుతుంది. సమాజంలోని వ్యక్తులు ఈ విధంగా తమతమ అనుభవాలను, ఆలోచనలను సమాజపరం చేసినప్పుడు ఉమ్మడి ఆస్తి పెరుగుతుంది.
వస్తుగత లౌకిక సంస్కృతులు
సమాజంలో భిన్న తరాలవారు ఏకకాలంలో ఉంటారు. ముత్తాతలు, తాతలు, తండ్రులు, కొడుకులు, మనుమలు, మునిమనుమలు సమాజంలో ఒకే కాలంలో ఉండవచ్చు. అట్లా ఒకేమాటు వివిధ తరాలకు చెందినవారు ఉండటం నిజంగా అదృష్టం. దానివల్ల ఉమ్మడి ఆస్తి పెరుగుతుంది. ఉమ్మడి ఆస్తికి వారంతా భాగస్వాములవుతున్నారు. ముందరి తరం తరువాతి తరాన్ని ఉమ్మడి ఆస్తికి వారసుల్ని చేస్తుంది. ఇట్లా జరగకపోతే సంస్కృతి అనవరతం సాగిపోవడానికి వీలు లేదు. ఇట్లా పెరిగిన ఉమ్మడి ఆస్తి 'వస్తుగత సంస్కృతి' లేదా 'లౌకిక సంస్కృతి' అవుతుంది. ఇది ఆ సమాజానికి పరిసరం అవుతుంది. అట్లా పరస్పరంగా ఏర్పడిన లౌకిక సంస్కృతి ఆ సమాజం లోకి వ్యక్తుల అనుభవాల మేర'లను నిర్ణయిస్తుంది. వ్యక్తి ప్రవర్తనకు నమూనాలను, ఆకృతులను, నిర్దేశాలను, ప్రాకార్యాలను నిర్ణయిస్తుంది.
మానవుని అంతర్గత చైతన్యం విషయీకరణ చెంది అభివ్యక్తమై, సంజ్ఞాబద్ధమై, స్థిరపడి భౌతిక పదార్థం మీద నిలిచి లౌకిక సంస్కృతిగా అవతరిస్తున్నది. కళాత్మకమైన ఒక అనుభూతి బాహ్యరూపం సంతరించుకొన్నప్పుడు అది కళాఖండమవుతుంది. ఒక చిత్రమవుతుంది. ఒక శిల్పమవుతుంది. ఒక పద్యం అవుతుంది; చిత్రం, శిల్పం, పద్యం బాహ్యవస్తువులు. విషయీకరణ చెందిన అంతర్గత చైతన్యానుభూతికి బాహ్యరూపాలు.
అట్లాగే మతసంబంధమైన అనుభూతి బాహ్యరూపం పొందినప్పుడు మత గ్రంథంగా, ప్రవచనంగా, దేవాలయంగా, విశ్వాసంగా విధాయక కర్మలుగా పూజావిధులుగా దర్శనమిస్తుంది. ఇవన్నీ లౌకికాలే. చట్టం, సాంఘిక జీవనానికి సంబంధించిన అనుభూతి బాహ్యీకరణం చెంది బయటి ప్రపంచంలో స్థిరపడినప్పుడు వ్యవస్థ రాజ్యాంగం, ఆచార వ్యవహారం అవుతుంది. తత్వానుభూతులు, విజ్ఞానశాస్త్ర సంబంధ అనుభూతులు మనకు అభివ్యక్త సిద్ధాంతాల రూపంలో గోచరిస్తాయి.
మానవుడు ఒక్క మాటు అలౌకిక అనుభూతులను ఒక పద్యంలో నిబద్ధించవచ్చు. అంతమాత్రం చేత ఆ పద్యం సాంస్కృతిక వస్తువు కాలేదు. ఆ పద్యానికి ఇతరులు వినే అర్హత ఉండాలి. అవకాశం ఉండాలి. రచయిత పొందిన, దర్శించిన అనుభూతులనే అది పాఠకునిలో సామాజికునిలో కలిగించగలగాలి. ఇట్లా జరిగితే అది సాంస్కృతిక వస్తువవుతుంది. అదే విషయం ప్రతి సాంస్కృతిక వస్తువుకు వర్తిస్తుంది.
సంస్కృతిని వ్యక్తి, సమాజం సృష్టిస్తారు. భాష ఏ ఒక వ్యక్తి సృష్టి కాదు. అది సామాజిక సృష్టి. దీనిపై భిన్నాభిప్రాయం లేదు. ఒక్కమాట, ఒక పదం, ఒక సమాజం, ఒక సామెత, ఒక దృష్టాంతం మనిషిని ఇట్టే ఆకట్టుకుంటాయి. అవి విదేశీయాలనిపించవు. అవి మొదట్లో ఎవరో ఒక వ్యక్తి వ్యక్తీకరించినవే అయినా, వాటిని విన్న ప్రతి ఒక్కరిలోను అవి ప్రతిధ్వనిస్తాయి. అవి తమలో నుంచే పుట్టినవని భావిస్తారు. అవి అంతకు ముందే తమలో నిద్రాణ స్థితిలో ఉన్నాయని, వాటిని గుర్తించలేదని, ఇప్పుడు వాటిని విన్నంతనే అవి తమలో మేల్కొన్నాయని ప్రతి ఒక్కరూ భావిస్తారు. దీనికి ఉదాహరణగా భారత స్వాతంత్య్ర సమర సమయంలో బ్రిటిష్ గద్దెను ఊగించిన నినాదాలు 'వందేమాతరం మనదే రాజ్యం', ఇంక్విలాబ్ జిందాబాద్'' లను ఫ్రాన్స్ రాచరికాన్ని కదిలించిన ఫ్రెంచి విప్లవ నినాదాలు- సమత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వాలను పేర్కొనవచ్చు. ఫ్రెంచి విప్లవ సందర్భంలో ఆ భావనలకు మొదట ఊపిరి పోసినవాడు రూసో కాని ఆ భావనలను ఎప్పటినుంచో తమలో ఉన్నట్లు ఫ్రెంచి ప్రజలు భావించారు.
అట్లాగే నైతిక విషయాలు ఒక సమాజంలో 'ఒక నైతికావసరాన్ని' ఎక్కువ మంది గుర్తిస్తే, అది ప్రతివాడు పాటించి తీరవలసిన 'ప్రామాణిక నీతి' అనే భావన కలుగుతుంది. అప్పుడు అటువంటి నైతికావసరం చట్టం అవుతుంది.
భౌతిక అభౌతిక సృష్టి
బాహ్య ప్రపంచంలో ఉన్న వస్తువులను చూసి వాటిని గుర్తించి, వాటిని వస్తుగత ప్రపంచంగా ఎంచుతున్నాం. అప్పుడు సంస్కృతి వైయక్తిక సృష్టి అవుతుంది. మానవుని సృష్టి రెండు విధాలుగా ఉంటుంది. భౌతిక వస్తువులను మానవుడు తయారుచేస్తాడు. అభౌతిక విషయాలను సృష్టిస్తాడు. ఈ రెండు రకాల సృష్టి మీద సంస్కృతి ఆధారపడి ఉంటుంది. అయితే ఈ సృష్టి అతడి ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. అతడి ప్రవర్తన, అతడి సహజాతాలు, ప్రేరణలు, ప్రబోధనల, అవసరాలమీద ఆధారపడి ఉంటాయి. ఇవి తృప్తం కాకపోతే అతడిలో ఒకవిధమైన ఒత్తిడి, ఉద్రేకం, తీవ్రతలు పెరుగు తాయి. వీటిని జీవితావసరాలంటాం. ఆ అవసరాలు తీరేవరకు మనిషికి ఏమీ తోచదు. అవసరాలు తీరాక ప్రశాంతత చిక్కుతుంది. ప్రవర్తన లక్ష్యం ముందు ఈ జీవితావసరాలను తీర్చడమే. జీవితావసరం తీర్చుకోవడం వరకు మనిషికి జంతువుకూ తేడా లేదు. కాకపోతే ఆ అవసరాలు తీర్చుకొనే పద్ధతులు మనుష్యులకు జంతువులకు భిన్నాలు.
మానవునికి ఈ జీవితావసరాలు తీర్చుకోవడమే పరమావధి కాదు. అవి తీరవలసిందే. అయితే అంతకంటే ఎక్కువైనవీ, ఉన్నతమైనవీ, స్నిగ్ధమైనవీ, అమూల్యమైనవీ- ఎన్నో సాధించవలసి ఉంది. వీటిని 'జీవితావసరాలు కాని అమూల్య విషయాలు' అంటారు. మానవుని ప్రాణ ధారణకు, మనుగడకు ఇవి ముఖ్యం కావు. జీవితావసరాలంటే ప్రాణధారణావసరాలు తీరిన తరువాత మనిషిలె నిశ్చలత, ప్రశాంతత, విరామం, సమతుల్యం ఏర్పడతాయి. ఈ విరామ స్థితిలో అతడు 'ప్రాణధిరణకుఅవసరం కానిఅమూల్య విషయాలవైపు- కళ, సాహిత్యం, గానం, ఇంజినీరింగ్ వంటివాటివైపు మరలాడని బి.కానన్ అనే శాస్త్రవేత్త అభిప్రాయం.
సంస్కృతికి మూల స్తంభం''సామాజిక సంబంధం''. సమాజంలో వ్యక్తికి వ్యక్తికి మధ్య 'అభిరుచి' మలుచుకోవడంలో ఈ సంబంధం ఏర్పడుతుంది. ఇక్కడ అభిరుచి అనే పదానికి 'ఆసక్తి', 'అర్థం' అని కూడా చెప్పుకోవాలి. ఒక వస్తువుపై నాకు ఆసక్తి ఉందీ అంటే ఆ వస్తువు నాదృష్టిలో 'విలువై'ంది కనుక 'అభిరుచి', 'విలువలు' సహసంబంధంలో ఉంటాయి. 'విలువ'కు ఆర్.బి.పెరీ అనే అమెరికా తాత్వికుడు వస్తువు 'అర్థం'గా లేదా దానిమీద 'ఆసక్తి'గా నిర్వచించాడు. మానవ సంబంధాల్లో ఈ రెండూ రెండు వైపుల నుంచి పనిచేస్తాయి. ఇవి పనిచేయడం వల్లనే సంబంధాలు నిలుస్తున్నాయి. వీటిని ఉపసంహరిస్తే సంబంధాలు కుప్పకూలి పోతాయి. ఈ విషయానికి మనం సమాజానికి వర్తింపజేసినట్లయితే, అందరికీ అభిరుచి (అర్థం) ఉన్న వస్తువు 'సామాజిక విలువ' అవుతుంది. ఈ విధంగా రెండు అగోచర విషయాలు- మనోగత అభిరుచులు (అర్థాలు), సాంఘిక విలువలు సంఘ నిర్మితి ద్వారా సంస్కృతి నిర్మితికి పునాదులు అవుతున్నాయి.
-ఎ.ఎన్.రెడ్డి
Authorization