జానపద సాహిత్యంలో స్త్రీల సాహిత్యానిది ప్రత్యేక శాఖ. స్త్రీల అనుభవాల చరిత్ర ఆధారంగా ఈ పాటలు రూపుదిద్దుకున్నాయి. కుటుంబానికి, భక్తికి, గ్రామదేవతలకు సంబంధించినవేగాక; రామాయణ, భారత, భాగవతాలకు సంబంధించిన పాటలెన్నో స్త్రీలు పాడుకొంటున్నారు. ఏ ఇతివృత్తం స్వీకరించినా స్త్రీల జీవితాల్లోని కష్ట సుఖాలు అనుభూతులే అందులో చోటుచేసుకుంటున్నాయి. స్త్రీకి జరిగే అన్యాయాలు, అక్రమాలు, బ్రతుకు బాధలే ఆ పాటలలో ప్రతిధ్వనిస్తుంటాయి. వారి ఆలోచనా విధానాలు సమాజంలోని ఎగుడు దిగుడులను వేలెత్తి చూపుతాయి.
వ్యవస్థలో వచ్చిన మార్పు వల్ల పురుషుని అదుపాజ్ఞలలో బతుకుతూ, వాని కనుసన్నలలో మసలుతూ జీవిస్తున్న స్త్రీలు ముఖ్యంగా మధ్యతరగతి స్త్రీలు తమ మనోభావాలను కుటుంబానికి సంబంధించిన పాటలలో ఏ విధంగా వ్యక్తం చేశారో చూద్దాం. స్త్రీకి నిండుదనాన్నిచ్చేది మాతృత్వం అనీ, ఎన్ని సంపదలున్నా సంతానం లేకపోతే ఆమె బతుకే వ్యర్థమనే అభిప్రాయాలు సమాజంలో ఉన్నాయి. సంతానం లేని కారణంగా పురుషులు ఎంతమందినైనా వివాహం చేసుకోవడం నేటికి మనకు కనిపిస్తుంది. లోపం ఎవరిదైనప్పటికి సమాజం దానికి ఆమోదముద్ర వేస్తుంది.
''పసుపు కుంకుమలకు పోలేను నేను
పసిబిడ్డలను ఎత్తుకోలేను
ఒక్క బిడ్డనైనా ముద్దాడలేదు
గొడ్రాలి బతుకయ్యె, గౌరవం లేదాయో''
అని స్త్రీ పడే బాధ అంతా ఇంతా కాదు.ఒకవేళ సంతానం కలిగినా మగసంతానం కావాలని 'తింటెను తీయదోస పండు తినాలి. కంటెను కొడుకుల్ల కాన్పు కనాలి' అనుకుంటారు.
'బిడ్డలగన్న తల్లి-నీళ్ల కంటాబోతే
అమాస చీకటి-ఆ బావిలోనా
కొడుకులగన్నతల్లి-నీళ్ల కంటాబోతే
కొసరి వెన్నెల గానూ, ఆ బావిలోనా'
అని ఆడపిల్ల తల్లికి జరిగే అవమానాన్ని, మగపిల్లలపై మోజును వ్యక్తం చేసిందొకతల్లి. పితృస్వామ్యం స్త్రీల జీవితాల్లో ఏవిధంగా అనుభవంలోకి వస్తుందో ఈ పాటలు వివరిస్తాయి. లాలి పాటలు సైతం కారణాలేమైనా మగపిల్లవానికి సంబంధించినవే ఎక్కువగా ఉన్నాయి. అధిక సంతానాన్ని కన్న భార్య ఆరోగ్య స్థితికి తాను కారకుడైనా, భార్యను వాడిన తమలపాకులాగా, పుచ్చిన చెక్క పేడులాగ వర్ణిస్తూ తాను వేరే పెళ్లి చేసుకుంటానంటాడు భర్త ఒక పాటలో. అటువంటివాడు తనను విడిచిపెట్టినా
''అవుసతోని మట్టెలు కాలికి, బలిజోని గాజులు చేతికి బుక్కోని కుంకుమ నొష్టికి'' ఉంటే చాలునని తృప్తిపడుతుంది. అంత దు:ఖాన్ని మనసులోనే దాచుకొని ముత్తైదువ చిహ్నాలకే ఆశపడుతుంది. ఇటువంటి పాటలే స్త్రీల నిర్వేదాన్ని, నిస్సహాయ స్థితిని పట్టి చూపుతాయి.
సమిష్టి కుటుంబంలోని ఆచార వ్యవహారాలు కుటుంబానికి సంబంధించిన పాటలలోనే ఎక్కువగా వ్యక్తమవుతాయి. అక్కమ్మ పాటలో పెళ్లయిన చెల్లిని పుట్టింటికి తీసుకురమ్మని కొడుకులందరిని అడుగుతుంది తల్లి. చిన్నోడు... పెద్దోడు ఉండగ నాకేమి అక్కర' అంటాడు. నడిపివాడు... చిన్నోడిని, పెద్దోడిని అడిగితే ఇద్దరూ 'నాయిన్న ఉండగ నాకేమి అక్కర' అంటారు. సరే ఆ నాయినగారే కూతుర్ని తీసుకురావడానికి బయలుదేరతాడు. తండ్రి రాక చూసి కాళ్లకు నీళ్లిచ్చి కన్నీరు తీసింది. 'ఏడవకు ఓ బిడ్డా తీసుకపోనిచ్చినా చేరి మీవారితో చెప్పి' రమ్మంటాడు. అక్కమ్మ అత్తగార్ని మొదలుకొని అడిగింది. వరుసగా ఒకరిని అడిగితే మరొకరిని అడగమంటారు. చివరకు భర్త దగ్గరకు వెళ్ళి 'మోటలు గొట్టేటి ఓ మొగిలి రాజా! మావోళ్లు వచ్చిరి మము సాగాదోలుమ' ని అడిగింది. అయితే ఏమేమి తెంచ్చారని అడుగుతాడు భర్త.
అప్పుడు తండ్రి ఎవరెవరికి ఏమేమి తెచ్చాడో చెప్పిన తరువాత వెళ్ళిరమ్మంటాడు.
అణచిపెట్టుకున్న కసిని వ్యక్తం చేసే పాటలు
చాలా పాటల్లో ''పసుపుకొమ్ముల సారె తెచ్చిరా మీవారు'' అని అడగడం కనిపిస్తుంది. పితృస్వామ్మ స్వభావం ఈ పాటలో దట్టంగా వేళ్లూనుకొని ఎట్లా గోచరిస్తుందో చూడవచ్చు. 'అత్తింటి సుఖం మోచేతి దెబ్బ ' అన్నట్లు మెట్టినింటి ఆరళ్లకు ఆడబిడ్డ సాధింపుకు,; బావ, మరుదుల వేధింపులకు గురైన స్త్రీలు తమ జీవితాలపై విరక్తిని పెంచుకొని 'అత్తింటి ఆర్ళకన్న అట్లబోయి అడివీల మానుగా నైదు' అనుకోడం సహజమే. ఈ బతుకు బతకడం కన్న
''సూరునీ చేతికి సుక్కగానైదు
చందురుని చేతికి చెలియగానైదు
మా తండ్రి బాలయ్య పాలు పిండంగా
బంగారి సర్వల్లా ధారగా నైదు
మాతల్లి దేవమ్మ చల్లా జెయ్యంగా
చిల్లి పోయి కవ్వానా చిల్కగా నైదు'
అని బాధపడుతుంది. ఇటువంటి కోడళ్లే కాక 'చిలుకనై ఎగిరిపోతే బాగుండునని, అత్తమామల కళ్లు పోతే కొత్త నోములు నోచు కుందునని, బావమరదుల కళ్లు పోతే బండెక్కి చెండాడుకుందుననే కోడళ్లు ఈ పాలలో సాక్షాత్కరిస్తారు. మనసులో స్త్రీలు అణచిపెట్టుకున్న కసి, పరోక్ష ప్రతిఘటనలు వీటిలో కనిపిస్తాయి.
సమాజం స్త్రీ స్వామ్యం నుంచి పురుష స్వామ్యం వైపుకు మారిన తరువాత స్త్రీలు ఆస్తి హక్కుతో పాటు, ఆత్మాభిమానాన్ని, వ్యక్తిత్వాన్ని ఏ విధంగా కోల్పోయారో స్త్రీల పాటల్లో సహజంగా కనిపిస్తుంది. అన్నదమ్ములు వేరుపడేటప్పుడు తోబుట్టువులు వారితో తగవులాడుతారు. 'శ్రీరామ చింతల్లా చిగురంతా గడ్డి' అన్న పాటలో 'అర్నామిత్తువు రారా, అన్నా పెద్దన్నా' అంటూ అన్నను ఆస్తికోసం నిలదీసిందొక చెల్లెలు. 'ఆడదానికి నీకు ఆర్నాలెక్కడివే' అంటాడు అన్న. ఆడదాన్ని గనుకా, అటు బోతినన్నా, లేకపోతే నీతో సరిపాలుదాన్ని' అని మళ్లీ తగవులాడింది. అయినా అన్న వినడు చివరకు ఏదో కనికరించి 'యెంచుకోవే ఎడ్లా, పంచుకోవే బర్లా ఆవుల పెయ్యల అడుగబోకమ్మా' అంటాడు. ఆస్తి మాటేమోగాని ఆమాత్రం దయచూపించాడని, తగవు పెంచితే ఫలితమేమీ ఉండదనుకొని ఆ కొద్దిదానికే సంతృప్తి పడింది.
పేరంటాండ్ర కథలు
సమాజం కోసమో, పురుషుల దౌష్ట్యానికో గురైన స్త్రీ కథలు పేరంటాడ్ర గాథలుగా రూపుదిద్దుకున్నాయి. ఆ విధంగా బలైన వారి జీవితాలే ఆదర్శాలుగా స్త్రీలే బోధిస్తుంటారు. చనిపోయిన తరువాత దేవతలుగా మారి పూజలందుకుంటారనే ప్రలోభాన్ని సమాజం కల్పిస్తుంది. ఇటువంటి భావజాలాన్ని పురుషాధిక్య సమాజం స్త్రీ చుట్టూ నేర్పుగా అల్లింది. ఏదో విధంగా బలి కార్యక్రమం జరిపినట్లుగా స్త్రీల పాటల్లో ఆధారాలు ఉన్నాయి. ముఖ్యంగా ఊళ్లు, చెరువులు నిర్మాణం చేసేటప్పుడో, వరదలు వచ్చినప్పుడో గర్భిణీ స్త్రీలను బలివ్వడమనేది ఉన్నదని స్త్రీల పాటలు చెబుతున్నాయి. 'ఈడిగోల్ల దేవమ్మ ' పాటలో శంషాబాద్ చెరువుకట్ట నిర్మాణంలో కట్టమైసమ్మ నిండు గర్భవతిని 'వరమడిగింద'ట. కల్లు అమ్ముకునే ఈడిగోళ్ల దేవమ్మను మేస్త్రీ పిలిచి వచ్చే ఆదివారంనాడు కల్లు ఎక్కువ తెమ్మని 'మా వొక్క లేబరుకు ఉల్ఫా చెబుతున్నాము' అని అంటాడు. ఆ ఆదివారం రానే వచ్చింది. ఆరోజు చెరువు కట్ట మధ్య భాగంలో పైకి కనిపించని విధంగా నేలమాళిగ తవ్వుతారు. అక్కడ కల్లు పోసే పాత్రను పెడతారు. దేవమ్మ కల్లు ముంతతో బయలుదేరింది.
కట్టామీనికెక్కిందో... ఆ ఒక్కా మేస్తిరో...
గోళ్యామెత్తుకొచ్చిందో... కల్లూ గుమ్మారిచ్చిందో
ముంతాముంచుతున్నారో... కట్టా లోపలికి దుంకిందో
తట్టా మీన తట్టమ్మా... లేబరు చాలా ఏడ్సిరో'
నేల మాళిగలో పడ్డ ఆమెపై మట్టి గుమ్మరించి కట్ట నిర్మాణం చేస్తారు. ఇటువంటి పాటలలో పురుషుని బలిచ్చినట్టు ఎక్కడా కనిపించదు.
సామెతలు, పొడుపు కథలు
స్త్రీల పాటలలో సామెతలు, పొడుపుకథలు అలవోకగా వచ్చి చేరుతాయి. స్త్రీల పరంగా పొడుపు కథలను పరిశీలించినప్పుడు స్త్రీ మనోభావాలు, పురుషునితో ఆమె సంబంధాలు అందులో ఏ విధంగా వ్యక్తమవుతాయో గమనించవచ్చు. సమాజంలో స్త్రీ పవిత్రంగా ఉండాలనే భావం ఉన్నది. శీలం విషయంలో పురుషునికి ఎటువంటి ఆంక్షలు ఉండవు. అంతర్గతంగా అటువంటి స్వేచ్ఛా ప్రవృత్తికి సంబంధించిన పొడుపు కథల లాంటి పాటలు పాడుకోవడానికి జానపద స్త్రీలు ఉత్సుకత చూపుతారు.
'ఒగాల కట్టివేసి ఒగాల విడిచిపెట్టి
ఒగాల నందుకోని ఉరుకలేదా? వదినె ఉరుకలేదా?
ఎవ్వాల కట్టివేసి ఎవ్వాల విడిచిపెట్టి
ఎవ్వాల నందుకోని ఉరికినాను వదినె ఉరికినాను
ఆవూను కట్టివేసి లేగాను విడిచిపెట్టి
పాల సరువందుకోని ఉరుకలేదా వదినె ఉరుకలేదా?
పొడుపులో ఆంక్షాతిక్రమం కనిపించినా విడుపులో మళ్లీ స్త్రీలకు సమాజంలో ఉండే నీతికి సంబంధించిన నియమ పాలనే కనిపిస్తుంది.
'తలమీది చందమామా! నిత్తేలేదమ్మా
మాకు సత్తే లేదమ్మా!నిండు పున్నమ'
అని చచ్చినా బతికినా తమ జీవితాల్లో ఎప్పుడూ వెలుగే లేదని ప్రకటించు కొన్నారు.
ఈవిధంగా స్త్రీల ఆచరణలో, ప్రవృత్తిలో, జీవన విధానంలో ఉండే వైవిధ్య మంతా స్త్రీల పాటల్లో కనిపిస్తుంది. ఇటువంటి పాటలను సేకరించి స్త్రీ దృక్పథంతో పరిశీలించినట్లయితే స్త్రీల అనుభవాల, చరిత్రను, స్త్రీల చైతన్యాన్ని మనం ప్రత్యక్షంగా అవగాహన చేసుకోవచ్చు.
- ఆచార్య పి.జ్యోతి
Authorization