ఆఫ్రికావారు చాలామంది మధ్యయుగంలోను, ఆధునిక యుగ ప్రారంభంలోను భారత దేశానికి వచ్చి స్థిరపడ్డారు.ఇట్లా వచ్చిన వీరిని సిద్దిగోమాలు లేక సిద్దీలు అని మన తెలంగాణలో పిలుస్తారు. వీరు అహమ్మదాబాద్, గోవా, ముంబై, ఎల్లాపూర్, హబ్సికోట్, హైదరాబాదు వంటి ప్రాంతాల్లో అధికంగా కనిపిస్తారు. ఇక్కడ వీరు ప్రత్యేక చరిత్ర కలిగి ఉన్నారు. కొంతమంది పాలకులుగా, కొంతమంది సైనికాధికారులుగా, సైనికులుగా, నావికులుగా, గుమస్తాలుగా రకరకాల వృత్తుల్లో ఉన్నారు. వీరు ఆఫ్రికాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడ్డవారు. రాజులు, జమిందార్లు వీళ్ళను సైనిక దళాల్లోనూ, రక్షకదళాల్లోనూ నియమించుకున్నారు. ఎప్పుడో వాళ్ళ వాళ్ళ దేశాలను వదిలిపెట్టి వచ్చినందువల్ల భారత దేశాన్నే మాతృదేశంగా భావించి మమేకమయ్యారు. కొంతమంది ముస్లింలుగా మారి మహమ్మదీయ పాలకుల దగ్గర సైనికులుగా స్థిరపడిపోయారు. కొంతమంది బానిసలుగా ఉంటూ ఉన్నత పదవులనూ అధిష్టించారు. 17వ శతాబ్దంలో బెంగాలులో ఉన్న పోర్చుగీసువారు ఆఫ్రికావారిని బానిసలుగా, పనివారుగా తీసుకొచ్చారు. అలాగే కర్నాటకలోనూ సిద్దీలు అధికసంఖ్యలో ఉన్నారు. సిద్దీలు క్రైస్తవ, హిందు, ముస్లిం మతాలను అనుసరిస్తున్నారు.
తెలంగాణ సిద్దీలు : సుమారు నూట యాభై ఏండ్ల క్రితం నిజాం రాజ్యంలో ప్రవేశించారు సిద్దీలు. 313 మంది ఆఫ్రికా జాతీయులను వనపర్తి రాజా నిజాం మహబూబ్ ఆలీ బాద్షాకు కానుకగా ఇచ్చాడు. వాళ్ళలో హసన్ బిన్ మహబూబ్, మహబూబ్ బిన్ ముబారక్, అబ్దుల్ బసత్ బిన్ హసన్, సులేమాన్ బిన్ సయీద్ మొదలైన వారున్నారు. అసఫ్జాహీ పాలనలో సిద్దీలు మరికొందరు వచ్చారు. వీరు నిజాంకు ప్రత్యేకమైన రక్షకులుగా కానీ, సైన్యంలో సైనికులుగా కానీ పనిచేశారు. అలాగే నిజాం జనానాలోనూ పనిచేశారు. వీరు ఎంతో ఓర్పువంతులు. సిద్దీలు నీగ్రో జాతికి చెందినవారు. వారిని 'హబ్సీలు' అని మహారాష్ట్రలో పిలుస్తారు. గోవా, డయ్యూల్లో వీరిని 'కాఫ్రీలు' అంటారు.గుజరాత్లో సిద్దీలను 'బాద్షా'లు అంటారు. అంతే కాదు 'భిల్లాల'నీ పిలుస్తారు. మన హైదరాబాదులో ఉన్న సిద్దీలను ఛాష్ లేక హబ్సీలు అంటారు.
అరబ్బులు ఆఫ్రికా బానిసలను బెంగాల్ పశ్చిమ ప్రాంతాలకు తీసుకువచ్చి అమ్ముతుండేవారు. ఆ రకంగా కచ్, కథియవార్, సింధు, పోర్బందర్ ప్రాంతాలకు సిద్దీలు వ్యాపించారు. ఆ తరువాత బొంబాయి వైపుకు వచ్చారు.
సిద్దీల్లో ఇంకా ప్రాచీన ఆచార వ్యవహారాలు ఉన్నాయి. సన్యాసుల్లా దర్గాల్లో కొందరు కాలం గడుపుతారు. వీరు తమ పూర్వీకులను గౌరవిస్తారు. నృత్యంలో వారి ఆధ్యాత్మిక, దైనందిన జీవితాలు ప్రతిఫలిస్తాయి. వీరి నృత్యాల్లో ఒక్కోసారి ఆటవిక చాయలు కనిపిస్తాయి. మత సంబంధ కార్యక్రమాల్లో వారి నృత్య ప్రదర్శనలు సంప్రదాయబద్దంగా ఉంటాయి. నృత్యం ఆ జాతి ప్రజ్ఞాపాటవాలకు సంబంధించినది. వారి భూమి, వ్యవసాయం, పండుగలు-పబ్బాలకు సంబంధించిన అనేక విషయాలు ఈ ప్రదర్శనల్లో ఇమిడి ఉంటాయి. నృత్యాల్లో జాతి జనులంతా అరమరికలు లేకుండా పాల్గొంటారు. ప్రకృతి వాళ్ళకు స్ఫూర్తి. రంగురంగుల దుస్తులను ధరించి ఆనందంగా జీవించడం కోసం డ్యాన్స్ చేస్తారు. కొత్త కొత్త ఫక్కీల్లో డ్యాన్స్ చెయ్యడం, పాటలు పాడటం, వాయిద్యాలను వాయించడంలో ఆసక్తి ప్రదర్శిస్తారు. వీరి ప్రదర్శనల్లో ఆటవిక జీవితం, సంతోషం, దు:ఖం, భయం, ఆశ్చర్యం వంటివి ప్రతిఫలిస్తాయి.ప్రకృతి సిద్ధంగా పక్షులను, జంతువులను అనుకరిస్తూ ప్రదర్శనలివ్వడం వాళ్ళకు వెన్నతో పెట్టిన విద్య.హస్త ముద్రికలు కూడా ప్రత్యేకంగా ఉంటాయి.అడవిలో ఉండే మృగాలు, పక్షుల అరుపులను వాళ్ళు అనుకరిస్తారు.హిందీ, స్వాహిలీ భాషలను కలిపి పాటలు పాడతారు.
గుజరాత్ సిద్దీల నృత్యం హైదరాబాదు సిద్దీల డ్యాన్స్కన్నా ఎక్కువ సంప్రదాయబద్దంగా ఉంటుంది. వాళ్ళ వస్త్ర ధారణలో కూడా తేడా ఉంది. తెల్ల కుర్తా, పైజమా గుజరాతీ సిద్దీలు ధరిస్తే హైదరాబాదీలు లుంగీలు ధరించి వాటికి ఎరుపు, ఆకుపచ్చ బెల్టులు పెట్టుకుంటారు. తలకు తలపాగా చుడతారు. ఇరు ప్రాంతాల వారు వాడే సంగీత వాయిద్యాల్లో కూడా తేడా ఉంది. గుజరాతీలు ఎక్కువ వాయిద్యాలు వాడతారు. వీరి వాయిద్యాల్లో 'మాలుంగా' చాలా ప్రధానమైంది. 'ముర్ఫి'కూడా తరచుగా వాడే వాయిద్యమే.
స్థానిక భారతీయ జీవనానికి అలవాటుపడినా... తమ నరనరాల్లో జీర్ణించుకుపోయిన ఆఫ్రికా సాంస్కృతిక నేపథ్యాన్ని మాత్రం వారు వదులుకోకుండా ఓ ప్రత్యేక సంస్కృతిని సృష్టించిన సిద్దీలను ప్రభుత్వాలు ఆర్థికంగా ఆదుకోవలసి ఉంది.
- మౌక్తిక్
Authorization