ప్రాచీనులు సంస్కృతిని మనం అర్థం చేసుకున్న పద్ధతిలో అర్థం చేసుకోలేదు. అసలు వారికి ఆ భావనే లేదు. అయినా వారు చరిత్ర తత్వాన్ని 'చర్విత చర్వణం'గా దర్శించారు. గ్రీకులకు, రోమన్లకు చరిత్ర ఒక చక్రం వంటిది. చరిత్ర చక్రం వలే లేదా సంవత్సరంలోని రుతువుల వలే పునరావృతం అవుతుంది. చరిత్ర గతిలో ప్రగతి, పతనం రెండూ ఉన్నాయి. మానవ జీవితం నిర్దిష్ట కాలంలో వినాశం పొంది, తిరిగి అమాయకత, సరళత, స్వచ్ఛతలనే ''స్వర్ణయుగ'' ప్రాతిపదికపై పునర్జీవిస్తుందని సెనెకా చెప్పాడు. కళలు, పరిశోధనలు, సమృద్ధ, విషయ సుఖం పతనానికి దారితీస్తాయన్నాడు.
ఈ సిద్ధాంతాన్నే నవీనులలో నీచే, స్పెంగ్లర్లు పునరుజ్జీవింపచేశారు. స్పెంగ్లర్ జర్మనీలోని మ్యూనిక్లో గణిత శాస్త్రజ్ఞుడు. తన సిద్ధాంతాలను 'పాశ్చాత్యుల పతనం' (ది డిక్లైన్ ఆఫ్ వెస్ట్) అనే గ్రంథంలో వివరించాడు. ఇతడు సంస్కృతిని పెరిగి విరిగే పువ్వుతోనో, జంతువుతోనో లేదా జీవితోనో పోలుస్తాడు. అందుకనే దీనిని జైవిక సిద్ధాంతం (ఆర్గానిస్మిక్ థియరీ) అనికూడా అనవచ్చు. ఇతడి సిద్ధాంతం ప్రకారం సంస్కృతి జీవి వలె పుడుతుంది, పెరుగుతుంది, గిట్టుతుంది. ఈ దశలను అది క్రమంగా అనుసరిస్తుంది. పూవు లేదా జీవి వాటి కర్మ (డెస్టిని) అనుసారం పుడతాయి, గిట్టుతాయి. అంతేకాని వాటికి తమదంటూ ఒక సొంత ఉద్దేశం' ఉండదు అంటాడాయన. స్పెంగ్లర్ మతంలో 'కర్మ' అంటే కార్యాకరణ భారం, ప్రతిదీ చతుర్దశా చక్రంలో గమించవలసిందే.
ఇతడి ప్రకారం సంస్కృతికి రుతువుల వలె లేదా మానవునికి వలె నాలుగు దశలున్నాయి. మొదటి దశ వసంతరుతువు లేదా బాల్యం. సంస్కృతి బాల్యదశలో ఉన్నప్పుడు మానవులు ఒక చోట కుదురుకొని, నేలను అంటిపెట్టుకొని ఉంటారు. రెండవ దశ వేసవి లేక కౌమారం. ఈ దశలో సాంస్కృతిక జీవితారంభం జరుగుతుంది. సంస్కృతి చైతన్యవంతమవుతుంది. పక్వమవుతుంది. దీనిని పాశ్యాత్య దేశాల్లో వచ్చిన పునర్వికాసం (రినైజాన్స్)గా గుర్తించవచ్చు. మూడవది శరదావసానం లేదా యౌనం. ఈ దశలో సంస్కృతి పరిణతి చెందుతుంది. పండిపోతుంది. ఈ దశలో వాణిజ్యం ఎక్కువవుతుంది. నగరాలు పరిఢవిల్లుతాయి. చివరిది శీతాకాలం లేదా వృద్ధాప్యం. ఈ దశలో గుణాన్ని పరిమాణం, సౌందర్యాన్ని ప్రయోజనం ఆక్రమిస్తాయి.
సంస్కృతి ముసలిదైనప్పుడు జీవితం కృతకంగా నిస్సారంగా తయారవుతుంది. మనం సంస్కృతి అని పిలిచేదంతా లుప్తమవుతుంది. మధ్యతరగతివారు వర్తకులుగా తయారవుతారు. నగరాలు యంత్రమయాలు అవుతాయి. ధనం రాజ్యమేలుతుంది. గౌరవ మర్యాదలు ధనవంతులకే. ఐశ్వర్యమనేది తెలివితేటలు, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తుంది. మానవుడు పరిశ్రమకు బానిస అవుతాడు. సామ్రాజ్యవాదం పెరుగుతుంది. ''జాతి ఆత్మహత్య''కు నాంది పలుకుతుంది. నగరవాసులలో ఎక్కువ మంది షండులై సంతానహీనులవుతారు. అజ్ఞత విజ్ఞతను జయిస్తుంది. సంచయవాదం పెచ్చుమీరుతుంది. అంటాడు స్పెంగ్లర్.
స్పెన్సర్, కూలె, ఆల్ఫ్రెడ్ ఫౌలీలు కూడా జైవిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ''జీవిలోని వివిధ అవయవాలు ఒకదానితో ఒకటి పొరపొచ్చాలు లేకుండా ఆ జీవి మనుగడకు అన్నీ కలిసికట్టుగా ఎట్లా పనిచేస్తాయో అట్లాగే సంస్కృతిలోని వివిధ అంశాలు '' అని వీరు అన్నారు.
అయితే సంస్కృతిని జీవి అనడం అసంగతం. ఎందువల్లనంటే సంస్కృతి జీవి కాదు. జీవి వలె సంస్కృతి తినదు, తాగదు, బిడ్డల్ని కనదు. జీవికి బాల్య , కౌమార, యవ్వన, వార్థఖ్యాలు ఉంటాయి. సంస్కృతికి ఉండవు. జీవిని ఉపమానంగా గ్రహిస్తే తప్పు లేదు కాని సంస్కృతే జీవి అంటే కుదరదు అనేది పరిశోధకుల వాదం.
- ఎ.వి.రెడ్డి
Authorization