పురాణాల్లో స్వర్గం ప్రస్థావన అనేకసార్లు కనిపిస్తుంది. సామాన్యుణ్ణి మతం గుప్పిట్లోకి తీసుకురావడానికి స్వర్గం, నరకం అనే భావనలు ఎంతో ఉపయోగపడ్డాయి. ధనవంతులు ఈ భూమి మీద పొందుతున్న అన్ని విలాసాలను సామాన్యులు స్వర్గంలో పొందవచ్చు అనే ప్రచారం జరగడం ద్వారా సామాన్యుల్లో ఆశ చిగురిస్తుంది. ఫలితంగా దేవుడి మత్తులో పడిపోయారు. అట్లాగే నరకం అన్న భావన మనుషుల్ని భయపెట్టింది. బతికి ఉన్నప్పుడు అనుభవించే కష్టాలకు తోడు చనిపోయాక కూడా బాధలు పడటమా అని దేవుణ్ణి ఇంకా గట్టిగా నమ్మడం ప్రారంభించారు సామాన్యులు. పుణ్యం కోసం దేవునికి మొక్కాలి. పూజలు, వ్రతాలు చేయాలి. బ్రాహ్మణుడికి దానధర్మాలు చేయాలి. ఇవన్నీకూడా పూజారి వర్గంవారు తమ భుక్తికోసం ప్రజల్లో వ్యాప్తిచేసిన ప్రచారాలు.
ప్రాచీన వేదమంత్రాల్లో రుషులు (రుషి అన్న పదం రష్యా నుండి వచ్చింది. రుషులు విదేశీయులు అనడానికి ఇదొక ఉదాహరణ) ఏదో ఒక దేవతను స్తుతించేటప్పుడు ఆ దేవతకు అనేక మంచి గుణాలను కట్టబెట్టేవారు. ప్రస్తుత కాలంలో వ్యక్తుల గొప్పతనం పెరిగినట్టుగానే ఆయా కాలాల్లో ఆయా దేవతలు గొప్పగా పూజింపబడ్డారు. వేదకాలంలో ఇంద్రుడు, ఉపనిషత్తుల కాలంలో బ్రహ్మ, ఆర్యులు-అనార్యుల తగాదాలప్పుడు శివుడు, విష్ణువు సర్వోత్తములుగా గుర్తింపు పొందారు. గుప్తుల కాలంలో దేవలోకం మృత్యులోకానికి ఒక కల్పిత రూపంగా ఉంది. దీన్ని బట్టి రెండు విషయాలు మనకి అర్థమవుతాయి. ఒకటి రుషులు దేవుళ్లవటానికి ఏ అడ్డంకి లేదు. అట్లాగే రెండోది16 వేల భార్యలున్నవాడు, రాసలీలాలోలుడు అయిన కృష్ణుడు దేవుడు అవడానికి ఎటువంటి అవరోధం లేదు. రాజులు, చక్రవర్తులు కూడా తమని తాము దేవుడిగా చెప్పుకున్న సందర్భాలున్నాయి. ఈజిప్టులో ఫారో చక్రవర్తులు స్వయంగా తామే దేవుళ్లం అని చెప్పుకున్నారు.
వేదమంత్రాల్లో వేదపురుషుని శిరస్సు, చేతులు, తొడలు, పాదాల నుంచి చాతుర్వర్ణాలు పుట్టాయని చెప్పారు ఆర్యులు. కానీ ఆనాటి ప్రజలు అంత అమాయకులు కారు. వేదకాలంలో ఈ వర్ణ వ్యవస్థను ఎవరూ నమ్మకపోగా ఎదురుతిరిగారు. అయినప్పటికీ దేవుడు తన ఇష్టప్రకారం గొప్పవారిని, తక్కువ వారిని పుట్టిస్తాడని, అది వారి వారి పూర్వజన్మ కర్మ ఫలం అని చెప్పేవారు. ఆనాటి మూలవాసి ప్రజలు బ్రాహ్మణ పురోహితుల మాటలకు ఎదురు ప్రశ్నించేవారు. దేవుడు ఒకరిని గొప్పవారిగా, మరొకరిని తక్కువవారిగా ఎట్లా పుట్టిస్తాడని నిలదీసిన ప్రజల నిందారోపణ నుంచి దేవుణ్ణి రక్షించడానికి ఉపనిషత్తుల కాలంలో పునర్జన్మ సిద్ధాంతాన్ని కల్పించారు. ఈ పునర్జన్మ సిద్ధాంతం ప్రకారం ఒక వ్యక్తి ధనవంతుడెందుకయ్యాడంటే అతడు గత జన్మలో దానం-పుణ్యం చేశాడన్నమాట. సమాజాన్ని తమ చెప్పుచేతల్లో ఉంచుకోవడానికి పునర్జన్మ పేరిట హిందు మతం ప్రయోగించినంత గట్టి ఆయుధాన్ని ఏ మతమూ ప్రయోగించలేదు. స్వర్గాన్ని ఒక సుఖదాయకమైన సామంత కుటుంబంగా చిత్రించారు.. వైకుంఠం ఒక రాణివాసం లాగా, ఎప్పటికీ మురికిపట్టని సుందర వస్త్రాలు, రత్నాలు పొదిగిన ఆభరణాలు, పుష్పాలు- సుగంధాలను వెదజల్లే శరీరం,, నృత్యం, గానం, అప్సరసలు వంటి స్వర్గ భావనలన్నీ కూడా ఆనాటి చంద్రగుప్త విక్రమాదిత్యుని రాణివాసపు చిత్రాలుగా భావిస్తునారు కొందరు.
రామానుజుని వైకుంఠం గద్యం చదివితే- అది ఒక చక్కని భాషలో భయకంపితుడైన ఆస్థాన కవి రాసిందే అనిపిస్తుంది. అది హర్షర్థనుని లేదా రాజేంద్ర చోళుని అంత:పుర వర్ణన మాత్రమే అని ప్రముఖ చరిత్రకారులు రాహుల్ సాంకృత్యాయన్ అంటారు. బౌద్ధుల నిర్వాణం, జైనుల శిద్ధిశిల దేవలోకం కంటే చాలా ఉన్నతమైనవే అయినప్పటికీ వారుకూడా దేవలోకాన్ని కాదనలేకపోయారు. వారి దేవలోకంలో క్రీ.శ5, 6 శతాబ్దాల సామంతరాజుల సుఖభోగ వర్ణన ఉంది. ఇక మిగతా మతాలలో పేర్కొన్న వర్ణనలూ ఆయా స్థలకాలోల్లో ఉన్న పాలకుల వైభోగాన్ని పతిబింబించేవిగానే చెప్పుకోవచ్చు.
ఈ ఉదాహరణలన్నింటినీ చూసినప్పుడు స్వర్గం, నరకం వంటివి అభూతకల్పనలే అని అర్థమవుతుంది. నిజానికి మనిషి ఈ భూమ్మీద సుఖంగా, ఆనందంగా బతికినన్ని రోజులూ స్వర్గమే. లేని స్వర్గం, నరకం మాయలో పడి మనిషి తన ఆలోచనాశక్తిని కోల్పోతున్నాడు. ఏవిషయాన్నయినా శాస్త్రీయ దృక్పథంతో అవగాహన చేసుకోవాలి తప్ప గుడ్డిగా మూఢంగా విశ్వసించకూడదు. వేల ఏండ్లుగా మనిషికి పూర్వజన్మ, పునర్జన్మ ఉన్నాయని చెప్పే మతాలు మనిషికి ఉన్న జీవితాన్ని ఒక క్షణకాలమైనా పెంచగలిగాయా? మనిషిని చావు నుండి, రోగాల నుండి ఏ దేవుడు కాపాడలేదు. సైన్స్ మాత్రం రోగాలకు మందు కనుక్కొని మన జీవిత కాలాన్ని రెండింతలు చేసింది. మనిషికి ఉన్నది ఒక్కటే జన్మ. పునర్జన్మంటూ ఏదీ లేదు. ఏ జీవి అయినా చనిపోయాక ఈ మట్టిలో మట్టిగా కలిసిపోవలసిందే. ఆనాటి మానవుని మేధస్సు అంతవరకే పరిమితం కనుక దానికి తగ్గట్టే ఆనాటి భావజాలం ఉంది. నేడు మనిషి అంతరిక్షంలోకి దూసుకుపోతున్నాడు. అందుకు తగ్గట్టుగానే నేటి మనిషి భావజాలం ఉండాలి. కానీ మన దేశంలో పాతకాలపు మనిషి నమ్మకాలను పెంచి పోషించి ప్రజలను ఇంకా మూఢత్వంలోనే ఉంచే స్వార్థపు వ్యవస్థ తయారయింది. ప్రజలు ఎంత మూఢులుగా ఉంటే ఈ వ్యవస్థకు అంత రాబడి వస్తుందన్నమాట!
Authorization