మతోన్మాదం, పిడివాదంతో కూడిన వేదాంతం, అశాస్త్రీయ ఆచారాలు భారతీయ సమాజంలో తీవ్రమైన అశాంతికి, సంక్షోభానికి కారణమయ్యాయి.అన్నింటికంటే ముఖ్యంగా మనిషికి, మనిషికి మధ్య మానవ సంబంధాలను స్థాపించకపోవడంలోను, సాంఘిక అసమానతలు నిరూపించకపోవడంలోను భారతీయ సంప్రదాయం నేర సంస్కృతిని సంతరించుకుంది. అంటరానితనం, కులవివక్ష, స్త్రీ బానిసత్వం, పురోహితవర్గ అగ్రప్రాధాన్యత వంటి మానవ వ్యతిరేక కార్యకలాపాలకు భారతీయ సమాజం పేరుగాంచింది. మధ్యయుగ సంస్కృతి మత్తులో సమాజం కొట్టుమిట్టాడుతున్నది. అసమానత్వాన్ని, అన్యాయాన్ని మతం పేరిట సమర్థించి దేశాన్ని బలహీనపర్చింది వైదిక సంస్కృతి. దీనిని నిర్మూలించడానికి మధ్యయుగాల భక్తులు కబీర్, నానక్, తుకారం వంటివారు భక్తి ఉద్యమాల రూపంలో సంస్కరణలు ప్రారంభించారు. అమానుషత్వ సంస్కృతిలో ప్రజలు మాడిపోతున్న సమయంలో బ్రిటీష్ పాలనా ఫలితమంటూ పాశ్చాత్య, శాస్త్రీయ విద్యకు పునాదులు వేశారు. దీనితో పాశ్యాత్య దేశాల్లో జరిగిన మత సంస్కరణ ఫలితంగా ఎన్నో క్రైస్తవ మిషనులు ఇండియాలో పనిచేయడం ఆరంభించాయి. వీటి వెనుక, శాస్త్రీయ, మానవతా లౌకిక పునాదులపై వచ్చిన పునరుజ్జీవ ఉద్యమం, పారిశ్రామిక విప్లవ, సాంకేతిక పురోగమన ప్రభావాన్ని అంచనా వేయలేం. వీటి ఫలితంగా భారతీయ సంస్కృతికి, పాశ్చాత్య ఆలోచనకు పరస్పర ప్రత్యక్ష అంతర కార్యాచరణ ప్రారంభమైనది. పాశ్యాత్యులు, మరీ ముఖ్యంగా మిషనరీలు మన సంస్కృతిలోని సమాజ వ్యతిరేక, మానవ విహీన ఆచారాలను నిశితంగా విమర్శించారు.
దీంతో రెచ్చిపోయి రోషం తెచ్చుకున్న కొందరు హిందూమతంలోని అమానుషత్వ ధోరణులను పరిహరించడానికి పూనుకున్నారు. వేదాల వద్దకు వెనక్కిపోయి పున:పరిశోధించాలని కొందరంటే, క్రైస్తవ మతానికి, పాశ్చాత్య విమర్శలకు సమాధానం ఇవ్వాలని కొందరు రంగంలోకి దిగారు. ప్రార్థనా సమాజం, ఆర్యసమాజం, బ్రహ్మ సమాజం వీటిలో కొన్ని. వీరిలో కొందరు శాస్త్రీయ విద్యను ప్ర్రోత్సహించారు. స్త్రీ స్వేచ్ఛను మన్నించారు. స్త్రీ విద్యకు అవకాశాలిచ్చారు. వితంతు వివాహాలను ప్రోత్సహించారు. బాల్య వివాహాలను, సతీసహగమనాన్ని అరికట్టడానికి కృషిచేశారు. దేవదాసీతనాన్ని నిర్మూలించడానికి చట్ట పరమైన చర్యలు తీసుకునేలా చేశారు. స్త్రీలకు ఆస్తి, ఓటు హక్కుల కోసం పోరాడారు. అంటరానితనాన్ని, కులవ్యవస్థను తూర్పారబట్టారు. క్రైస్తవ మతంలో ప్రగతి భావాలను వీరు కాదనలేదు. ముఖ్యంగా సాంఘిక సేవ, సాంఘిక న్యాయం అనే విషయాల్లో క్రైస్తవ ఆదర్శాన్ని అంగీకరించారు. వీటన్నింటితో ఆధునిక భారతదేశానికి పునాదులు వేశారు.
ఆధునిక భారతదేశంలో ఈ సంస్కరణలు సరికొత్త సంస్కృతికి పునాదులు వేశాయి. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే విలువలపౖెె నిర్మితమయింది ఈ సంస్కృతి. ఒక సమగ్రమైన విశ్వ సంస్కృతికి దారి చూపించాయి సంస్కరనోద్యమాలు. అయితే ఈ సంస్కరణ ఉద్యమాల ప్రభావం అట్టడుగున ఉన్నవారివరకు పోలేదు. ఎందుకంటే ఈ సంస్కరణ వాదుల్లో ఎక్కువ మంది ఆధిపత్యకులాలకు చెందినవారు. కాబట్టి వారు చేసిన కృషి పలితాలు చాలావరకు వారికి చెందిన వార్గాలకే అందాయి. రెండవదిగా, వైదికేతర సంస్కర్తలైన వేమన, పూలె, నారాయణగురు, తిరువల్లువార్ వంటివారి సంస్కరణ భావాలకు కావలసినంత పోషణ, ప్రోత్సాహం దొరకలేదు. సాధారణంగా పాలకవర్గాలకు అనుకూలమైన మతానికి ప్రాపకం, పోషణ రెండూ సమృద్ధిగా దొరుకుతాయి. అది దొరకని మత వ్యవస్థల్లో ఎంత సత్యముండినా వాటినెవ్వరూ ఖాతరు చెయ్యరు. వైదికేతర సంస్కరణ ఉద్యమాలకు ఇదే జరిగింది.
-వి ఎన్
Authorization