'జాతర' ప్రతినిధి ఇటీవల ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీలను కలవడానికి వెళ్లాడు. అసలే వర్షాకాలమేమో అడవి, కొండలు, చేలు ... మొత్తం నేలంతా పచ్చని రంగేసినట్టే ఉంది. ఆదివాసీల జీవన విధానాన్ని కనులారా వీక్షిస్తూ... అవసరమైన చోట ఆగుతూ దాదాపు ఒక వంద కిలోమీటర్లు బైక్పై తిరిగాడు. ప్రతిచోట ఈ ప్రతినిధికి గోండు ఆడపడుచుల అద్భుత సౌందర్యం అబ్బురపరిచింది. మేకప్వేసుకొని, కృత్రిమమైన హావభావాలు ప్రదర్శించే మోడ్రన్ మోడల్స్ కన్నా వీరి సౌందర్యం ఏ మాత్రం తక్కువకాదనిపించింది. అదే సమయంలో ప్రకృతి ఒడిలో సహజమైన వేషభాషలతో తిరుగాడుచున్న గోండు ఆడపడుచుల కట్టుబొట్టుల్లో వచ్చిన మార్పులు గోచరమయ్యాయి. ఆ విశేషాలు 'జాతర' పాఠకులకు ప్రత్యేకం.
ఆదిలాబాద్కి చెందిన మిత్రుడు క్షీరసాగర్ పరుశురాం తో కలిసి కొండ కోనల్లో తిరుగాడుతుంటే గంటలు నిమిషాల్లా కరిగిపోయాయి. అట్లా సమయాన్ని కర్పూరంలా కరిగిస్తూ నార్నూర్కి పోయే ప్రధానమైన రోడ్డు నుండి కాస్త దూరంగా ఎత్తయిన ప్రదేశంలో ఉన్న 'జామ్డ' అనే గోండు పల్లెకు పోతున్నాం. మా బైక్ పల్లం నుండి ఎత్తుకు ఉరుకుతోంది. గోండు భూమి అందాలను ఒడిసి పట్టుకుంటూ ముందుకు సాగుతున్న మాకు ఇద్దరు ఆదివాసీ స్త్రీలు నడుచుకుంటూ పోతూ కనిపించారు. ముమ్మరంగా పొలంపనులు సాగుతున్న కాలంకదా... వాళ్లూ ఏదో పనికి పోతున్నట్టున్నారు. వారిని సమీపించే సరికి గోండు పడుచుల కట్టుబొట్టును ప్రతిబింబించే అద్భుత ప్రతీకలుగా కనిపించారు. ఇద్దరూ సంప్రదాయబద్ధంగా ధరించే నగలను ధరించి కనిపించారు. అందులో ఒకామె కాలు నుండి చెవి వరకు సర్వాలంకార భూషితలా కనిపించింది. అంతే కాస్త ముందుకు వెళ్లి బండికి బ్రేక్ వేశాం. వాళ్లపై కెమెరా ఎక్కుపెట్టాం. వాళ్లు మమ్మల్ని సమీపించారు. మేమేమి చేస్తున్నామో అర్థమయింది. మమ్మల్ని చూసి నవ్వుతున్నారు. వాళ్లని ఆగమని సైగచేశాం. వాళ్లకు అసలు తెలుగు రాదు. గోండి, లేక మరాఠి మట్లాడుతారు. మా మిత్రుడు మరాఠిలో మేం విలేకరులం అనీ ఫొటోలు తీసుకుంటామని చెప్పడంతో ఆగిపోయారు. వారిద్దరినీ రకరకాల భంగిమల్లో ఫొటోలు తీశాం. ఆ తర్వాత జామ్డ ఊళ్లోకి పోయి ఓ పెద్దమనిషి ఇంటికి చేరుకున్నాం. అక్కడ ఓ ఎనభై ఏండ్ల వృద్ధురాలు మాకు మర్యాద చేస్తూ ఆహ్వానించింది. ఆమెను చూసి మరింత మతిపోయింది. ఎంత అందం! ఆమెను కూడా ఫొటో తీసుకుంటాం అనుమతించమని అడిగాం. సరేనని ఇంటిబయట బాగా వెలుతురుగా ఉన్న ప్రదేశానికి వచ్చింది. అంతే... క్లిక్.. క్లిక్... క్లిక్! ఆమెను అట్లా నిలబెట్టి ఆమె చుట్టూ తిరుగుతూ ఫొటోలు తీసుకున్నాం. నిజానికి ఈమె పెద్దగా నగలు ధరించలేదు కానీ చీరకట్టు చాలా సంప్రదాయబద్ధంగా ఉంది. అట్లాగే ఆమె ఇప్పటికీ సంప్రదాయపరమైన పెద్ద కుంకుమ బొట్టుతో అలనాటి సంప్రదాయ వేషధారణను ప్రతిబింబిస్తున్నది. అయితే నగలు మాత్రం పెద్దగా ధరించలేదు.
ఫొటోలు తీసుకోవడానికి కారణం ఉంది. గత నలభై యాభై ఏండ్లకు, ఇప్పటికీ దుస్తులు, నగల ధారణలో, అలంకరణలో గోండి స్త్రీలలో వచ్చిన మార్పును రికార్డు చేయడమే అసలు ఉద్దేశం. నిజానికి ఇప్పుడు ప్రతి గోండు పల్లెలోనూ స్ల్రీలు వీరిలాగానే దర్శనమిచ్చారు. గోండు పల్లెల్లో తిరుగుతుంటే ఏదో మార్పు ఉందని అనిపించింది. అందుకే ఫొటోల రూపంలో డాక్యుమెంట్ చేసే ప్రయత్నం చేశాం.
ఏమిటా మార్పు?
ఒకప్పుడు గోండు స్త్రీలు అధికమొత్తంలో వెండితో తయారైన సంప్రదాయక నగలను చాలా పెద్దమొత్తంలో (కనీసం రెండు మూడు కిలోలు) ధరించేవారు. ఇప్పుడు అంతగా ధరించకపోవడం కనిపిస్తుంది. బంగారం కన్నా వెండికే వీరు ప్రాధాన్యం ఇస్తారు. గోండు వంటి ఆదివాసీల సంప్రదాయాలను దృష్టిలో ఉంచుకొని వారికి తగినట్లు నగలను తయారుచేసే వృత్తి నిపుణులు ప్రత్యేకంగా ఉంటారు. స్త్రీలు సరీ, సక్రీ అనే పేరుతో పిలిచే మెడలో ధరించే నగలు చాలా దళసరిగా ఉంటాయి. ఇవి అర కిలో బరువు ఉంటాయి. అట్లాగే కాళ్లకు ధరించే పంజన్ లేదా కడియాలు ఒక్కొక్కటి పావు కేజీ బరువు ఉంటుంది. ఇదికాక నడుముకు ధరించే కంబర్పటి అనే నగ దాదాపు ఒక కిలో బరువు ఉంటుంది. ముంజేతికి, మోచేతుల కు పైన ధరించే కడియాలు సుమారు పావుకేజీ బరువు తూగుతాయి. ఇప్పుడు ఇంత బరువున్న నగలను గోండు స్త్రీలు ధరించడంలేదు. అట్లాగని పూర్తిగా అసలు ఆ నగలు ధరించడంలేదని కాదు. ఇప్పటికీ పైన పేర్కొన్నవాటిలో కొన్నింటిని ధరిస్తున్నారు. ఎక్కువగా కనిపిస్తున్న ఆభరణాలు ముక్కెర, ముక్కుపుడక. అట్లాగే మెడలో అనేక రకాల పూసల దండలూ కనిపిస్తున్నాయి. చెవికి దాదాపు అయిదారు రకాల ఆభరణాలు ధరించడం కనిపిస్తున్నది. ముఖాన పచ్చబొట్టు సాధారణ దృశ్యమే అయినా కుర్రపిల్లల్లో ముఖాన అది కనిపించడంలేదు. 30 ఏండ్లు, ఆ పై వయసువారిలోనే ముఖంపై పచ్చబొట్టు కనిపించింది. అట్లాగే బాగా వృద్ధులు ఇంకా కుంకుమ బొట్టు, పసుపులను ధరిస్తుంటే... యువతులు, నడివయసులో ఉన్నవారు టికిలీలు (రెడీమేడ్ బొట్టు బిళ్లలు) వాడుతున్నారు.
ఇక బట్టల సంగతికొస్తే... ఒకప్పుడు గోండు స్త్రీలు సంప్రదాయక 'నవు వార్ డక్డి' అనే చీరకట్టు కట్టేవారు. ఇప్పుడు చదువు కుంటున్న ఆడపిల్లలు, చదువుకోనివారు కూడా పంజాబి డ్రెస్ ధరిస్తున్నారు. ఇక పాతిక ముప్పరు ఏండ్ల వయసు వచ్చిందంటే నవు వార్ డక్డి'కి బదులు మామూలు చీర కట్టుకే యువతులు ఇష్టపడుతున్నారు. కేస్లాపూర్లో మూడు తరాల స్త్రీలు ఒకేచోట దర్శనమివ్వడంతో ఈ బట్టల ధారణలోని తేడాలు స్పష్టంగా కనిపించాయి. పొలాల్లో, బస్టాప్లలో, నీటి కుళాయిలదగ్గర... ఇండ్లదగ్గర... ఇట్లా అనేక ప్రదేశాల్లో స్త్రీలను గమనించిన తరువాతే ఈ నిర్థారణ అని గమనించాలి.
అయితే ఏ సమాజమైనా, సంస్కృతి అయినా ఎప్పుడూ మార్పు లేకుండా నిలకడ (స్టాటిక్)గా ఉండాలనుకోవడం సరికాదు. కాలంతో పాటు మానవ సమాజాలు మారడం సహజం. అయితే ఈ మార్పు బలవంతమైనదిగా ఉండకూడదు. ఇక్కడ గమనించాల్సిన సంగతేంటంటే ప్రపంచం అంతా గ్లోబలైజేషన్కి గురైన కారణంగా అన్ని సమాజాలు బలవంతమైన మార్పుకు గురవుతున్నా పైకి మాత్రం సహజ మార్పు చెందుతున్నట్లు కనిపించడం. సంస్కృతులు ఇప్పుడు వ్యాపారీకరణం చెందే క్రమంలో ఉన్నాయి. ఫలితంగా ఎంతో కట్టుదిట్టమైన ఆచార, సంప్రదాయ వ్యవస్థలను అనుసరించే ఆదిమ జాతులైనా తొందరగా తమ సాంస్కృతిక ఉనికిని కోల్పోయి కొత్తదనం వైపుకి పరుగులు తీస్తున్నాయి. ఈ కొత్తదనం నిజంగా మేలుచేసేదయితే ఎవరూ బాధపడవలసిన అవసరంలేదు. జాతుల సహజ సంస్కృతులు నశించి కొత్త దారుల వెంట పరుగులు తీసేలోపే ఆయా జాతుల జీవన విధానాలను రికార్డుచేసి భావి తరాలకోసం దాచిపెట్టవలసిన అవసరం మాత్రం మనమీదే ఉంది.
- జి.శివరామకృష్ణయ్య, 7702508259
Authorization