సముద్రంలో కొత్త భూభాగాలు కనుగొనడానికి పోర్చుగీసువారు తిరుగాడుతున్న సమయంలో ప్రస్తుతం దౌలా నౌకాశ్రయంగా పిలుస్తున్న ప్రాంతానికి వచ్చారు. అక్కడ ఓ నదిలో రొయ్యలు మాదిరిగా వెరైటీగా ఉన్న క్రే ఫిష్ కనిపించాయి. అందుకే వారు ఈ నదికి రియో దాస్ కామరోస్ (రొయ్యల నది) అని నామకరణం చేశారు. ఆ తరువాత ఈ దేశాన్ని మొత్తాన్ని కామరూన్ అని పిలవడం వాడుకలోకి వచ్చింది.
మొదటి ప్రపంచ యుద్ధం తరువాత దేశ భూభాగంలో కొంత భాగం బ్రిటన్ కిందకు మరి కొంత భాగం ఫ్రాన్స్ కిందకు వెళ్లింది. ఫలితంగా ఆయా ప్రాంతాల్లో ఇంగ్లీషు, ఫ్రెంచి భాషలు మాట్లాడటం ప్రజలకు అలవడింది. దేశం స్వతంత్రం సంపాదించిన తరువాత ఈ రెండు భాషలను అధికారభాషలుగా గుర్తించారు. వందల సంఖ్యలో ప్రాంతీయ భాషలు ఉన్నాయి. స్కూల్లో ఇంగ్లీషు, ఫ్రెంచితో పాటు ఆ ప్రాంతంలో ఉన్న స్థానిక భాషను కూడా బోధిస్తారు. అందుకే దేశం మొత్తం మీద ఒకటికన్నా ఎక్కువ భాషలు మాట్లాడేవారు కనిపిస్తారు.
కామెరూన్ ఆఫ్రికా పశ్చిమ తీరంలోని గల్ఫ్ ఆఫ్ గినియాలో ఉంది. యూరోపియన్ల ఆక్రమణకు ముందు దేశంలోని అనేక శీతోష్ణ మండలాల్లో రకరకాల ప్రజలు నివసించడం ప్రారంభించారు. ఉత్తర బాగంలో ఉన్నవారు సహారా, అరబ్ ప్రాంతాలకు చెందిన వ్యాపారులతో వాణిజ్య సంబంధాలు కలిగి ఉండేవారు. పదిహేనవ శతాబ్దంలో దక్షిణ కోస్తా ప్రాంతంలో ఉన్న ప్రజలు పోర్చుగీసు, డచ్వారితో వ్యాపార సంబంధాలలోకి వచ్చారు. 1884 నాటికి కామెరూన్ జర్మనీ రక్షిత ప్రాంతంగా మారింది. అయితే మొదటి ప్రపంచ యుద్ధం (1916)లో బ్రిటీష్, ఫ్రెంచి సేనలు జర్మనీని ఓడించి తమ అధీనంలోకి తీసుకున్నాయి. ఎనభై శాతం భూభాగం ఫ్రాన్స్కిందకు వెళ్లింది. 1922లో నానాజాతి సమితి కిందకు, ఆ తరువాత 1946లో ఐక్యరాజ్య సమితి కిందకు ఈ భూభాగాలు వచ్చాయి. కానీ ఈ అంతర్జాతీయ సంస్థల పేరుతో బ్రిటీష్, ఫ్రెంచివారే వ్యవహారాలు నడిపించారు. ఫ్రెంచివారి కింద ఉన్న కామెరూన్ 1960 లోను, బ్రిటీష్ కామెరూన్ 1961లోనూ స్వతంత్రం పొందాయి. మొత్తం మీద 1965 నాటికి కామెరూన్ భూభాగం అంతా ఒకే పార్టీ అధికారం కిందకు వచ్చింది. 1972లో యునైటెడ్ రిపబ్లిక్ ఆఫ్ కామెరూన్ అనీ, 1984 రిపబ్లిక్ ఆఫ్ కామెరూన్ అనీ తమ దేశం పేరు మార్చుకుని మనుగడ సాగిస్తున్నారు ఈ దేశవాసులు. యూరోపియన్ ఆక్రమణకు గురయిన ఈ దేశవాసుల భాష, సంస్కృతుల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. ముఖ్యంగా ఇంగ్లీషు, ఫ్రెంచి భాషలు దేశం మొత్తానికి అనుసంధాన భాషలుగా ఉద్భవించడం ఓ పెద్ద పరిణామం.
అయితే ఉత్తర, దక్షిణ ప్రాంతాల నాయకుల మధ్య అధికారం కోసం పోరాటాలు పెరిగి అశాంతి పరిస్థితులు తరచు తలెత్తుతూ ఉంటాయిక్కడ. ఉత్తర భాగంలో ముస్లింలు ఎక్కువగా ఉంటారు. ఈ భాగం ఫ్రెంచ్వారి ఆధీనం కింద ఉండేది. దక్షిణ ప్రాంతంలో క్రైస్తవులు ఎక్కువగా ఉంటారు. ఈ భూభాగం ఎక్కువగా బ్రిటీష్వాళ్ల అధికారం కింద ఉండేది.
ప్రజా జీవితం
వండిన ఆహారాన్ని పంచుకోవడం ఈ ప్రజలమధ్య ఉన్న గొప్పలక్షణం. మానవ సంబంధాలను గట్టిపరిచే ఈ వ్యవహారం ఈ దేశ ప్రజల అతిథి మర్యాదలకు, నమ్మకానికి ఒక గుర్తుగా భావించవచ్చు. బ్వితి ఉత్సవాన్ని నిర్వహించే సమయంలో పట్టణ, గ్రామీణ ప్రజలు ఒక చోట చేరి వండిన పదార్థాలు, వండని పదార్థాలను ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుని తమ బంధుత్వాన్ని, స్నేహ బంధాన్ని వ్యక్తం చేసుకుంటారు. బ్వితి సందర్భంగా మెదడుపై ప్రభావాన్ని చూపే 'ఇబోగా' అనే మత్తు మందును తీసుకుంటారు. ఇది మృతుల భూమికి చేసే ప్రయాణానికి ప్రతీకగా భావిస్తారు.
మన భారత దేశంలో లాగేముందు అతిథులు, పురుషులు బోజనం చేస్తారు. ఆ తరువాతే స్త్రీలు తినడం ఆచారం. చేతులు కడుక్కోవడం భోజనానికి సంబంధించిన ఓ మర్యాదగా భావిస్తారు. పాశ్యాత్య ప్రభావం వల్ల టేబుల్ చుట్టూ కూర్చొని భోజనం చేయడం కనిపిస్తుంది. ఉత్సవాలు ఇతర ముఖ్యమైన సందర్భాల్లో గౌరవ అతిథికి కొన్ని ప్రత్యేక మర్యాదలుంటాయి. అతిథులకు చికెన్, మటన్ వంటివి తప్పనిసరిగా వడ్డిస్తారు. బీరు, వైను, ఇతర డ్రింక్స్ను ఇస్తారు.
Authorization