తెలంగాణ జానపద కళారూపాలకు వన్నెలద్దినవారు బైండ్ల కళాకారులు. వారు చెప్పే కథల్లోని భాష, పాడే విధానం ఆసక్తికరంగా ఉంటాయి. ఏ బ్రాహ్మణీయ పురాణాల్లోనూ కనిపించని కథలు వీరు చెబుతుంటారు. సమకాలీన జీవన చిత్రాన్ని ఆవిష్కరించే వీరు చెప్పే కథల్లో 'తరిదేవి' కథ ఒకటి. ఈ కథలో అమ్మవారికున్న గో సంపద, ఆమె పిల్లలు చేసే వ్యవసాయం, పాలు పెరుగు, చల్లను అమ్ముకునే విధానం; రాజుల సుంకాలు వంటి అనేక వ్యవసాయ, పశుపాలనాధారిత సమాజాల్లోని పరిస్థితులు కనిపిస్తాయి. జనగాం జిల్లా ఖిలాషాపూర్కి చెందిన మారపాక రమేష్ వినిపించిన కథ ఇది.
అలిగొండ బుట్టంగ చలిగొండ బుట్టె. చలిగొండ బుట్టంగ మావరంబు బుట్టె. మావర పట్టణం యేలె గౌతమాబ్రహ్మ. గౌతమాబ్రహ్మ భార్య అహల్యాదేవి. అహల్యాదేవి కుమారులు సప్తకోటి మునులు (ఏడుగురు మునులు). సప్తకోటి మునులతోటి పుట్టినది ముచ్చంటి సరిదేవులమ్మ. సరిదేవులమ్మకు సిద్దమా సెట్టికి కళ్యాణం జరిగింది. వారు రాజ్యపాలన చేస్తుంటారు. పెండ్లియిన తరువాత కొన్నేండ్లు గడిచినా సంతానం అవడంలేదు అమ్మవారికి. ఏ పూజలు చేసినా, ఏ నోములు నోమినా సంతానం కావడంలేదు. నేను గొడ్రాలనవుతానా అని ఏడుస్తూ ఉంటుంది. పరదేవుడు మెచ్చి ఫలమీయకపాయె వరదేవుడు మెచ్చి వరమీయకపాయె అంటూ ఆమె వలపోసుకుంటూ ఎన్ని పూజలు చేసినా సంతాన ఫలం కాదు. ఏడ్చి ఏడ్చి అలసట చెంది పండుకోనుందట.అప్పుడు మల్లికార్జునస్వామి మాల్యమైండట అమ్మవారికి. ''అమ్మా నా గుళ్లన్నీ పడావుపడి ఉన్నాయి. నువ్వెక్కడెక్కడో పూజలు పెడుతున్నావు. నా పడావు పడిన గుళ్లను విప్పించి కప్పించు మంచిగా. గుడిముందు గజనిమ్మ తోట ఉదకము లేక వెండిపోయింది. పూత లేదు, కాతలేదు. ఏడ వకుండా గుళ్లను బాగుచేసి గజనిమ్మతోటను పచ్చగ పలవరిం పచేయి. చేస్తే ఆ గజనిమ్మ తోట ఎట్లయితే కాతలు, పూతలు పూస్తుందో నీకు అట్ల ఫలమిస్తా'' అని చెప్పి చెంపమీద చటాలున కొట్టి నిద్రలేపినట్లు లేపిండట. మాయమైపోయిండట. అమ్మవారు తన ప్రాణేశ్వరునికి ఈ సంగతి చెప్పిందట. ఆయన అట్లాగే చెయ్యమని అంటే ఆ మల్లికార్జున స్వామి గుడి దగ్గరకు వెళ్లిందట. ఆ విరిగిపడిన కప్పులను తిరిగి కప్పించి చినగంగ ఉదకాలు పెద గంగకు నోమి, పెద గంగ ఉదకాలు చిన గంగకు నోమి వెండిపోయిన గజనిమ్మ తోటను పచ్చగ పల్వరింపజేసిందట. అది పూతలు పూస్తున్నది, కాతలు కాస్తున్నది. స్వామికి సంతోషమవుతున్నది. భక్తుల రాకపోకలతో తన గుళ్లు కళకళలాడుతూ ఉండటంతో ఒకరోజు స్వామి ఆమెకు మాల్యమయిండు. అప్పుడు ఆమె స్వామిని సంతాన ఫలం కోరింది. అందుకు స్వామి ''అమ్మా నీవు ఉదకం పోసిన గజనిమ్మ తోట పూతలు పూసి కాతలు కాస్తుంది కదా. నీవు స్వచ్ఛవంతురాలవయితే ఆ చెట్టు దగ్గరకి వెళ్లి చెట్టుమీద చెయ్యి వెయ్యకుండా, చెట్టును పట్టి రాల్పకుండా నీ బంగారు పైటకొంగు చాపి నిలబడు. నిలబడి 'ఓ గజనిమ్మ వృక్షమా నాస్వచ్ఛమును చూడు' అని బంగారు పైటకొంగు చాపు. నీవు స్వచ్ఛవంతురాలివయితే ఆ గజనిమ్మ చెట్టుకున్న నిమ్మ పండ్లు నీ బంగారు పైటకొంగులో పడుతుంది. అప్పుడు ఆ నిమ్మపండు తీసుకొని నాదగ్గరికి రా. నేను ఫలమిస్తా'' అన్నాడట.
ఇదేమిటి విచిత్రం చెట్టుకున్న పండు తెంపకుండ ఎట్లొస్తది. చెట్టును బట్టి రాల్పకుండ ఎట్ల రాల్తది? అనుకుంటూ వెళ్లి స్వామి చెప్పిన విధంగానే చేసిందట. అట్లా చెయ్యగా ఆ చెట్టుకున్న పండు బంగారు కొంగులో పడింది. దాన్ని తీసుకొని వచ్చి స్వామికి చూపించింది. అప్పుడు స్వామి ''ఇదే కొంగులో ఉన్న నిమ్మపండు మళ్లీ ఎప్పటోలె ఎగిరి ఆ తొడిమెకు అంటుకోవాలి. ముంచి మూడు సార్లు నీ స్వచ్ఛమును చూసి సంతాన ఫలమిస్తా'' అన్నాడట. ఏదో పడమంటే పడ్డదిగాని లేచి అంటుకోమంటే ఎట్లా అనుకుంటూ... స్వామి మహిమ! నాదేముంది అనుకుంటూ వెళ్లి బంగారు కొంగు చాపి ''వృక్షమా నా స్వచ్ఛమన్న చూడు స్వామి చూస్తున్నాడు'' అంటే ఈ గజనిమ్మ పండు లేచి అదే తొడిమకు అంటుకున్నదట. ''స్వామి చూశావు కదా'' అంటే... ''అమ్మా రెండు సార్లు చూశా నీ స్వచ్ఛం. మళ్లీ అదే పండు నీ పైట కొంగులో పడాలి అన్నాడు'' స్వామి. మళ్లీ ఆమె పైట కొంగులో పండు పడిందట. ఆ పండును తీసుకొని వచ్చేటప్పటికి ఏడు వక్కలు ఆమె పైట కొంగులో పోసిండట స్వామి. ఏడు మలిసెట్టి రాజులు నీ గర్భంలో జన్మిస్తారన్నాడట. ఆ ఫలమును భుజించుకొని ఏడుగురు కుమారుల్ని కన్నది. అనమల్లు, చినమల్లు, అనరాసుగుళ్లు, తోడుమల్లన్న, పెద్దోడు మల్లన్న, పేరణి... ఇట్లా పేర్లు పెట్టారు వారికి. వారు పెరిగి పెద్దవుతున్నారు. వారు బాయి దగ్గరికి వెళ్లి వ్యవసాయం చేస్తున్నారు. ఆవుల గోవుల మంద సవాలక్ష ఆవుల మంద ఉంది వాళ్లకు. చల్ల, పాలు, పెరుగు బాగా అవుతన్నయి. గొల్ల స్త్రీలందరు 'మట్టేమావళగిరి' పట్టణం వెళ్లి అమ్ముకునేది. ఒకరోజు ఆ గొల్ల స్త్రీ కాంతలు ఏడుగురు చల్లబండలెత్తుకొని ఏకంగా వస్తున్నారట. అమ్మవారు తన ఏడుగురు కుమారులకు సద్దులు ఒక మంద గంపలో పెట్టుకొని వెళ్తుంటె అడ్డువచ్చిరి.''అమ్మా ఎక్కడికో వెళ్తున్నారు'' అని అమ్మవారడిగితే ''మట్టే మావళగిరి పట్టణంలో చల్లనమ్ముకోవడానికి వెళ్తున్నాం'' అంటే... ''మాకు గూడా చల్ల, పాలు, పెరుగు బాగానే అవుతరు. నేను కూడా మీతోపాటు వస్తా'' అంటుంది అమ్మవారు. సరే మరుసటి రోజు రమ్మన్నారు వాళ్లు. తర్వాత ఇంటికి వచ్చి అమ్మవారు పాలు పిండుతున్నది...
నల్లమేకల పాలు ఉయ్యాలో
నాయంగా పిండిరా ఉయ్యాలో
తెల్లమేకల పాలు ఉయ్యాలో
తేజగ బిండిరా ఉయ్యాలో
బట్టమేకల పాలు ఉయ్యాలో
బావుంగా బిండెరా ఉయ్యాలో
అన్ని మేకల పాలు ఉయ్యాలో
బాండ్వలో పోసిరా ఉయ్యాలో
ఆ పాలను ఇంటికి తీసుకువచ్చి పాలను పెరుగుగా, పెరుగును చల్లగా మార్చుతుంది. ఎట్లాగంటే...
కుమ్మున బెట్టిన పాలు ఉయ్యాలో
పెరుగును చేసిరా ఉయ్యాలో
పెరుగులైన పాలు ఉయ్యాలో
చల్లను చేసిరా ఉయ్యాలో
చక్కని సరిదేవి ఉయ్యాలో
చల్లను చేసిరా ఉయ్యాలో
వెన్ననే తీసెరా ఉయ్యాలో
అట్లా చేసిన చల్లను బాండవాలో నింపుకొని గొల్ల స్త్రీ కాంతలతో కలిసి మట్టేమావళగిరి పట్టణం వెళ్లింది. ఆ పట్టణం లోపల గొల్ల స్త్రీ కాంతలు నూకలకు, తౌడుకు అమ్ముకునేవారు గతిలేక. ఈమె తౌడుకు, నూకలకు నేనమ్మను. నా చల్ల గొప్పదనం చూడండి ...
ముచ్చానికి నా చల్ల ఉయ్యాలో
మూడు గురిగలమ్మ ఉయ్యాలో
పవడానికి నా చల్ల ఉయ్యాలో
పది గురిగలమ్మ ఉయ్యాలో
ఒజ్రానికి నా చల్ల ఉయ్యాలో
ఒక్కటే గురిగమ్మ ఉయ్యాలో
చల్లగొప్పదనం ఉయ్యాలో
మీరు వినరమ్మ ఉయ్యాలో
తెల్లని వెంట్రుకలు ఉయ్యాలో
నల్లనౌ చల్ల ఉయ్యాలో
ఊడినా దంతాలు ఉయ్యాలో
మల్లొచ్చు నా చల్ల ఉయ్యాలో
పెండ్లిగాని వారు ఉయ్యాలో
చల్లదాగండి ఉయ్యాలో
చక్కని పెడ్లిండ్లు ఉయ్యాలో
పచ్చని పందిడ్ల ఉయ్యాలో
అంటూ వాడవాడలా తిరిగి చల్లనమ్ముతుందంట. ''ఒగ్గు ఒగ్గు ముసలివాళ్లునా చల్లతాగగా 12 ఏండ్ల ప్రాయం వస్తాది, పడుచు పోరండ్లయితారు. నా చల్ల గొప్పదనం గట్లాంటిది'' అని అమ్ముతుండగా... కోమటివాళ్లలో అంతయ్య ఒగ్గు ఒగ్గు ముసలి వాడు. కొడుకులను దగ్గరికి పిలిచి ''నేను చేతకాకున్నాను.. ఎవరో గొల్లది. ముత్యానికి మూడు గురిగగులట, పగడానికి పది గురిగి లట. ఒక వజ్రమిస్తే ఒక గురిగి చల్లపోస్తదట. నాకు ఎన్ని రోజులు చాకిరి చేస్తారు. ఒక గురిగి చల్ల తీసుకురండ''ని వజ్రం ఇచ్చాడట. వాళ్లు దానిని ఆమెకిచ్చి గురిగి చల్ల తెస్తే తాగాడట అంతయ్య. వెంటనే ముసలితనం పొయ్యి వయసుతనం వచ్చిందట. బాపన వాడలో అంతమ్మ కూడా ఆరకంగా అయిపోయిందట. ఆ రకంగా సంతానం కానివాళ్లకు సంతానం కావడం, పెండ్లి కానివారికి పెండ్లి కావడం జరిగిందట. ఆ రకంగా చల్ల నమ్ముకొని ముత్యాల నవరత్నములు ముల్లెలు కట్టుకొని, మూటలు కట్టుకొని వెళ్లిపోతుందట. వెళ్లిపోతుండగా జంపనేసిన ఒంటిస్థంభం మోడ ఒకటున్నది. హెక్క అలవిగాని మేడ ఏడంత్రాల మేడ. చెల్లెలు శ్రీపాల గౌరమ్మను కూర్చోబెట్టి చిలుకలు, పావురాలను తోడుగ పెటి ్ట జంపనేసుడు తెరయాట మార్గాన వెళ్లిపోయాడట. ఆ మేడ దగ్గరికొచ్చి చూసిందట అమ్మవారు. ఈ మేడలో ఉన్నవారికి కూడా తన చల్లనమ్మాలనుకొని మేడ ఎక్కుతున్నదట. అప్పుడు చిలుకలు పావురాలు పోయి రాజుకు చెప్పినయ్యట. శ్రీపాల గౌరమ్మకు చల్లను పోసి ఆమెకు పెండ్లి మీద ప్రేమలు కలిగించి మేడదిగి వస్తుంటే..ఈ జంపనేసుడు చూసి దొరకబట్టాడు. వారిమధ్య చాలా సేపు వాదన జరుగుతుంది. ''నాపట్టణానికి వచ్చి చల్లలమ్ముకోవడం, నా చెల్లెలికి పెండ్లిమీద ప్రేమలు కలిగించడం, ముత్యాలు, నవరత్నాలు దోచుకొని వెళ్లడం చేస్తున్నావు. నా పట్టణానికి వచ్చినందుకు సుంకం కట్టాలి. కడితేనే నిన్ను పోనిస్తానం''టాడు. ఆమె ముందు కట్టనని చెప్పినా చివరికి సుంకం కడుతుంది. కట్టిన తరువాత పంపించేస్తాడు. తన పట్టణానికి వెళ్లి కొడుకుల పెండ్లిల్లు చేస్తుంది. ఈ కొడుకులే రేణుకా పరంజ్యోతి మేనల్లుళ్లు అవుతారు. ఆవిధంగా ఈ కథ కొనసాగి ఎల్లమ్మ చరిత్రలో కలుస్తాది.
-జి.శివరామకృష్ణయ్య 7702508259
Authorization