తెలంగాణ అంతటా ప్రసిద్ధి చెందిన జానపద కథలో రేణుకా ఎల్లమ్మ కథ ఒకటి. నిజానికి ఇది కొన్ని రోజులపాటు చెప్పే కథ. అంత పెద్ద కథను కట్టె, కొట్టె, తెచ్చె రీతిలో సంక్షిప్తంగా చెప్పడం కష్టం. అందుకే ఆమె పుట్టుక నుంచి కళ్యాణం వరకు ఉన్న కథను సంక్షిప్తంగా 'జాతర' పాఠకులకోసం...
అగ్నిలోన పుట్టింది ఆది పరాశక్తి రేణుక.పుట్టనైతే పుట్టితిని నన్ను ఏలే ప్రభువు ఎక్కడున్నాడు అనుకుంటూ అరచేతిలో అంజనం వేసుకుని అష్టాయుర్లోకాలు పాలు చూసిందట. ఎక్కడ చూసినా ఏమీ లేదట. కారపుటడవిలో కాంచాల మర్రి, కాంచాల మర్రికింద కారునల్లపుట్ట, ఆ పుట్టకళ్ల జూసి దాంట్లో దాక్కొని ఉందామనుకున్నది అమ్మవారు. ఎవరన్న సంతానంలేని వారు సాదుకుంటారని అనుకుని పుట్టదగ్గరకు వచ్చి దాని లోపల దాక్కొని ఉందట. ఆ సమయంలో ''శంకరా నాకు కొడుకులమీద కోరికలు కలుగుతున్నవి, బిడ్డలమీద బుద్దులు పుడుతున్నవి. కోటొక్క కుమారులున్నారు. నూటొక్క బిడ్డలున్నారు. అయినా సంతాన ఫలంమీద నాకు సంతోషం కలుగుతున్నది. నాకు సంతాన ఫలం ఇవ్వు''ంటున్నది. ఇంతమంది సంతానం ఉన్నా ఇంకా ఎందుకు అన్నాడు శివుడు. ఐనా కావాలి అందట పార్వతి. ఈమె గర్భాన ఎవరు పుడతారు అని శివుడు అంజనం వేసుకొని చూశాడు. ఆదిశక్తి గర్భము యందు ఐదో అవతారమై పుట్టి రేణుక ఎల్లమ్మ పుట్టలోపల దాక్కున్నదన్న సంగతి శివునికి మాల్యమయింది. సరే రేణుక ఎల్లమ్మను తీసుకువచ్చి పార్వతి గర్భంలో వేస్తానని అనుకుని, అప్పుడే భటులను పిలిపించి రథాన్ని సిద్ధం చేయమన్నాడు. కంచుమేఘరథం సిద్ధమయింది. పార్వతీపరమేశ్వరులు ఆ రథంలో కూర్చొని ఎల్లమ్మ దాక్కున్న పుట్టదగ్గరకు వస్తుండగా వారు వచ్చే సంగతి కలగనిన ఎల్లమ్మ పసిపిల్ల అవతారం ఎత్తుకొని క్యావ్ క్యావ్మని ఏడుస్తుందట. ఈ ఏడుపు విని పార్వతి రథాన్ని ఆపించింది. మళ్లీ ఏడుపు వినిపిస్తుంది. రథం దిగి పుట్టచుట్టూ ఐదు ప్రదక్షణలు తిరిగి తూర్పు భాగమునకు వచ్చి బంగారు పైటకొంగు చాపిందట. రేణుకాపరంజ్యోతి బంగారు ప్రతిమయై ఆ పైటకొంగులో పడిందట. ఆ పాపను తీసుకొని రథం ఎక్కి స్వామి నాకింక ఫలం ఎందుకు పనయిందికదా వెనక్కి తిరుగుదాం అన్నదట. ఆమెకి రేణుకాపరంజ్యోతి అని పేరుపెట్టారు. ఆ బాలని అల్లారుముద్దుగా పెంచారు.
స్వయంవరం
ఇక కళ్యాణం చెయ్యాలి. పార్వతీ పరమేశ్వరులు రేణుక అమ్మవారితో పెండ్లి గురించి అడిగారు. ''మీరు చూసిన వరుణ్ణి నేను చేసుకోను. నేను నచ్చిన వరుణ్ణి కూడా నేను చేసుకోను. నేనొక పందెం పెడతాను. 33 మూడు జాతులువారు, సబ్బండ జాతులవారెవరైనా నేను పెట్టిన పందెం లోపల గెలిచినవాడికి కళ్యాణం చెయ్యి నాన్నా'' అన్నదట. ఆ పందెం ఏమిటమ్మా అంటే... ''మన మేడముందర గడ స్తంభం నాటించాలి. ఏడేడు పద్నాలుగు యోజనాలు ఎత్తుగల గడస్తంభ మును నాటించి అక్కడ పెట్టండి. ఆ గడస్తంభానికి గావంత గంట కట్టి, ఒక స్వయంవరం బోర్డురాసి పెట్టండి. 'రాజాధిరాజులైన, వీరాది వీరులైన ముప్పై మూడు జాతులు, సబ్బండజాతులు వారెవరైనా వచ్చి ఈ స్తంభానికి ఉన్న గంటను కొట్టి గంట నది (నాదం) హారక ముందు సప్తసాగరాలు తిరిగి వచ్చి చేమంతి వుష్పం తీసుకువచ్చి నా చెవిలో ఎవరైతే పెడతారో అటువంటి వరునికిచ్చి కళ్యాణం చేస్తానని'''బోర్డుమీద రాయించండన్నది అమ్మవారు. ఊరూరుకు వుత్తరాలు రాశాడు శివుడు. స్వయంవరంలో ఎవరూ అంత ఎత్తు ఎగరటంలేదు, గంట కొట్టడంలేదు. నలుదిక్కుల రాజులూ గంటకొట్టలేకపోయారు. ''మాయొక్క మేనల్లుళ్లు కంచుగుబ్బల కోటయ్యలు కార్తీకవీరార్జునులకు జయలేఖ రాస్తా'' అని ఒక లేఖ రాసి తాను సాదుకుంటున్న పంచవన్నెల రామచిలుక ద్వారా పంపించాడు శివుడు. ఆ జయలేఖలు అందుకుని వారు వచ్చిన్రు. గంటను చూశారు. ఏడంత్రాల మేడలో ఉన్న అమ్మవారిని చూశారు. పొడిసే సూర్యునికన్న వడివంకలు ఉన్నాయికాని అమ్మవారు వడివంకలు లేక అందచందాలతో ఉందట. ఏడుగురూ గంటను కొట్టడానికి ప్రయత్నించినా కొట్టలేక అలసటతో దండిపైపడిపోయారట. రాజాధి రాజులు, వీరాధివీరులైన కార్తీకవీరార్జునులు వచ్చి నేను పెట్టిన పందెంగెలవలేక దండిపైన పడిపోయిండ్రని అమ్మవారు నవ్వుతుతున్నదట. ''పడిపోయిన మమ్ము చూసి ఎగతాళి చేస్తున్నవే. ఒకవేళ ఎవరైన వచ్చి గంటను కొట్టి లగం చేసుకోడానికి చూస్తే లగ్గమే ఎత్తగొడతాం. లగ్గం చేసుకున్నా పరవాలేదు. నాగవెల్లి మాత్రం ఎత్తగొట్టెయ్యక పోతే మా పేరు కార్తీకవీరార్జునులే కాదు'' అని పందెంగట్టి వెళ్లిపోయారట.
జమదగ్ని
''మునులు ఏలేది మునినందికోట. మునినందికోట స్వచ్చమా జమదగ్నిమునిది. గౌతమా ముని కుమారుడైన స్వచ్చమా జమదగ్ని ముని. తండ్రిగౌతముడు చేసిన ఏడుపాపాలు (బర్రిని కొట్టినది, పామును కొట్టినది, గోవును కొట్టినది వంటి పాపాలు) కొడుకు పేరిట వచ్చినయి. బాండవుల్లో పాపాలను ఉంచుకొని కావడి కట్టుకొని ఈ భూమండలం మీద ఒక్కో మంచి పని చేసి ఒక్కో పాపాన్ని కడిగేసుకుంటాను'' అని వస్తున్నాడంట. గాలిదేవునిద్వారా శివుడు స్వయంవరం సంగతి జమదగ్నికి చేరవేశాడు. జమదగ్ని '' స్వామి నేనొచ్చి గంటకొడితే నాకిస్తాడా. నేను చూస్తే బారెడు గడ్డము, మూరెడు మీసము, వీపులో రాచపుండు, చంకలో జోలె, చేతిలో కమండలం... మునీశ్వరుణ్ణి నేను. భుజముయందు ఏడు పాపాలున్నాయి. మరి నాకిస్తాడా'' అన్నాడట. సబ్బండజాతుల వారికి ఎవరికైనా ఇస్తానని స్వయంవరమే రాసి పెట్టిండు. ఇస్తాడని గాలిదేవుడు చెప్పిండట. సరే కళ్యాణం చేసుకుంటే ఒక పాపం తీరిపోద్ది కదా అని వచ్చేస్తున్నాడట. దారిలో కాళింది మడుగులో కామదేనువ బిడ్డ పంచకళ్యాణి దిగబడిపోయిందంట. కామదేనువు మడుగు చుట్టూ తిరుగుతూ ఉన్నది. ఆ దారినే వస్తున్న జమదగ్ని కనిపిస్తే ఎక్కడికెళ్తున్నావు మునిరాజా అని అడిగిందట. స్వయంవరానికని చెప్పిండట. నువ్వు గంటను కొట్టలేవు. ముందు నా బిడ్డను రక్షించి నాకప్పగిస్తే నీ పాపం ఒకటి తీరిపోతుంది. నాకు సాయం చేసినందుకు నీకు పెండ్లయ్యేలా సాయం చేస్తా అన్నది. నూరు అబద్దాలాడయినా ఒక పెండ్లి చెయ్యాలన్నారు కదా. నేను అబద్దం ఆడైనా నీపెండ్లి చేపిస్తా అన్నదంట. పంచకళ్యాణిని రక్షించి కామదేనువుకు అప్పగించి నాసంగతేంటని అడిగిండు జమదగ్ని. కామదేనువు తడబడింది. బిడ్డకోసం ఏదో అబద్దం ఆడాను ఇప్పుడెట్లా అని ఆలోచించి ... మునిరాజా నీతోపాటు కైలాస పట్టణానికి వస్తా. ఒక వైమూల నిలబడతా. ఆకాశానికి ఒక పెదవి, భూదేవికి ఒక పెదవి తెరచి గాలి ఊదుతా. ఆ గాలికి నీవు ఏడేడు పద్నాలుగు లోకాల యోజనాలు ఎగరాలి. గంటను కొట్టు. సప్త సాగరాలు తిరిగిరావాలన్నాడే..అది నీ నుంచి కాదు.. ఒకపని చెయ్యి. గడస్తంభం పక్కన నేనుంటాను. నువ్వు నాచుట్టూ ప్రదక్షిణ చెయ్యి. నా గర్భంలో ఏడుపొరల పొట్ట ఉంటుంది. సప్త సాగరాలు తిరిగి వచ్చినట్టే. ఆదివిష్ణుదేవుడు మెచ్చి నీకు చేమంతి వుష్పం ఇస్తాడు. అప్పుడు శివుడు కళ్యాణం చేస్తాడని చెప్పింది. కామధేనువు చెప్పినట్లే చేస్తాడు జమదగ్ని. విష్ణువిచ్చిన చేమంతి వుష్పం ఎల్లమ్మ చెవిలో పెట్టడంతో శివాశంకరుడు కళ్యాణం చేయడానికి సిద్దపరుస్తున్నాడు.
ఆయన్ని కళ్యాణం చేసుకోను
రేణుకా పరంజ్యోతి మేడమీద నుంచి చూస్తున్నదట. ''నేను చేసుకునే రాజు మంచి రాజై ఉండాలనుకున్నాను. మంచి వీరుడై పందెంలో గెలిచినవాడు కావాలనుకున్నాను. కానీ ఈ ముని వచ్చుట ఏమిటి, గంట కొట్టుట ఏమిటి. నేను ఆయన్ని కళ్యాణం చేసుకోను'' అనిచెప్పి ఒంటి స్తంభం మేడ దిగి ఎక్కడైనా దాగుకొని ఉంటా అనుకుంటూ దిడ్డి దర్వాజ ఎమ్మటె దిగి వెళ్లిపోయిందట. కొంతదూరం వెళ్లిన తరువాత పన్నెండు వజ్రాల బోడె పుట్టలో బట్టలు మార్చుకొని దాగుకొనిందట. జమదగ్నిని పెండ్లి కుమారున్ణి చేసిన తరువాత దాసు కన్నెలను పిలిచి మేడమీద ఉన్న రేణుక పరంజ్యోతిని తీసుకురమ్మన్నారు. దాసుకన్నెలు వెళ్లి చూస్తే 12 సంవత్సరాలు పడావుపడ్డట్లు ఆ మేడ ఉందంట. అమ్మవారు లేకపోవడంతో తిరిగి వచ్చి చెప్పారు ఆ కన్నెలు.శివుడు వెళ్లి చూస్తే అమ్మవారుకనిపించ లేదు. ఆ శివుడు చిన్నబోయి చింతాక్రాంతుడై దిడ్డిదర్వాజెమ్మట దిగివస్తున్నాడంట. అమ్మవారు మేడదిగి వెళ్లేటప్పుడు ఎడమకాలు లేపితే ఏనువు బండారు రాలిందంట, కుడికాలు లేపితే పందుమ కుంకుమ రాలిందంట. ఆరకంగా పసుపు కుంకుమ, పసుపు కుంకుమ పడుకొంటూ పోయిందట. ఈ ఆనవాలు చూసి తన బిడ్డవే అనుకొన్న శివుడు వాటివెంట వెళుతున్నాడు. ఆ ఆనవాలు కారు నల్లపుట్టదాక ఉన్నయంట. అంటే మళ్లీ పుట్టలోనే దాక్కున్నదన్న మాట అని ఇంటికి తిరిగి వచ్చాడంట.
ధరణిని తవ్వే వద్దిరాజులను పిలిచి మీకు మడులు, మాణిక్యములు, ముంజేతి కడియములు, ముద్దుటుంగరములు అన్నీ ఇస్తాను నాబిడ్డను తియ్యమన్నాడు శివుడు. వాళ్లు స్నానాలు చెయ్యలేదు, మొహాలు కడగలేదు. శివుడు చెప్పినదానికి సంబరపడుతూ వెళ్లారు. ఏడుగురు ఏడు గడ్డపారలు పట్టుకొని పోయి పుట్టమీదకు వదిలేసిన్రు. లోపల ఉన్న అమ్మవారు వీళ్లను శపిస్తుంది. అందువల్ల ఎవరి గడ్డపారలు వాని గర్భంలో గుచ్చుకొని వారు మరణిస్తారు. వాళ్లభార్యలు ఏడుస్తూ రావడంతో శివుడు వెళ్లి సంజీవినీ పుల్లతో వారిని లేపుతాడు. ఈసారి బ్రాహ్మణులను పిలిపించి అమ్మవారిని బయటికి ఎట్లా తీసుకురావాలో చెప్పమంటాడు శివుడు. ''శంకరా బైండ్లవాళ్లను పిలిపించాలి. బైండ్లవాళ్లు అమ్మవారి కొలుపులు కొలవాలి. వాళ్లచేతే సోమవారం నాడే కుమ్మరింటికి పోయి ఐదు జలగడవలు తీసుకురండి. ఐదు జలగడవల్లో ఉదకాలు తీసుకొని పోయి అమ్మవారి మందగంప తీసుకొని అక్కడికి వెళ్లి పుట్టను కదల దవ్వి పుట్టకు దనిపొయ్యండి. ఇంటికి వచ్చి గ్రామంలో ఉన్న ఇతర దేవతలందరికీ కాయలు కొట్టుకొని, సాయంత్రం అచ్చమైన నల్లమేక, అమ్మవారికి ఇష్టంతో కొలుపులు, బైండ్లవాళ్ల పాటలతోటి, జమిడిక జాగాట కిన్నెర మోతలతోటి ఆ మేకను తీసుకొనిపోయి అక్కడ మత్తగొలిపించి ఆ యొక్క అమ్మవారికి బలిచ్చి బలిగంప లేపితే, పాతాళ లోకంలో ఉన్న అమ్మవారు ఉబ్బలించి పైకివస్తుంది. ఆ పుట్టబంగారంలో కుమ్మరిపురుగై వస్తుంది. ఆ మందగంపెత్తుకొని నువ్వు ఇంటికి రాగానే నిజారూపమెత్తి నిలబడుతుంది. అప్పుడు పెడరెక్కలు బట్టి పెండ్లి కుమార్తెను చేసి కళ్యాణం చేసేయ్యమని జెప్పిండ్రు. శివాశం కరుడు బ్రాహ్మణులు చెప్పినట్లే చేసి అమ్మవారి కళ్యాణం చేస్తాడు.
(ఖిలాషాపూర్ (జనగాం జిల్లా) గ్రామవాసి మారపాక రమేష్ చెప్పిన కథ ఇది)
-జి.శివరామకృష్ణయ్య,7702508259
Authorization