రాచరికం కాలంలో రాజు తన అధికార హోదా వల్ల మొత్తం సామాజిక న్యాయానికి సంరక్షకుడుగా ఉండేవాడు. సంప్రదాయ కుటుంబ పద్ధతులు, కుల, మత, నైతిక నియమాలు, సంఘ సంస్థల నియమాలు సక్రమంగా అమలయ్యేలా రాజు పర్యవేక్షించేవాడు. ఆయా సామాజిక వ్యవస్థలే సంబంధిత ప్రజల బృందానికి న్యాయాన్ని అందించే ప్రాథమిక న్యాయస్థానాలుగా పనిచేశాయి. ప్రజా బృందాల మధ్య తలెత్తే చాలా వివాదాలను ఆయా కుటుంబాల పెద్దలు, కులపెద్దలు, మత బోధకులు లేదా సంఘ నిర్వాహకులు పరిష్కరించేవారు. భారతదేశంలో చాలా వివాదాల్లో తీర్పులు చెప్పే అట్టడుగు స్థాయి ప్రజాన్యాయస్థానాలు ఇవి. ఈ సామాజిక సంస్థలను న్యాయాన్ని అందించే ప్రాథమిక వనరులుగా మన న్యాయకోవిదులు కూడా అంగీకరించారు. ఏదైనా పై స్థాయి సంస్థ నిర్దిష్ఠ కేసుల విచారణను చేపట్టినప్పుడు ఆయా ప్రజానీకపు పద్ధతులను, ఆచారాలను కూడా పరిగణనలోనికి తప్పనిసరిగా తీసుకోవలసి ఉంటుంది. ఇవి కాకుండా వర్ణాలు, ఆశ్రమాల కోసం నిర్దేశించిన ధర్మాలు కూడా ఉన్నాయి. మధ్యయుగం నాటి న్యాయ వ్యవస్థలో గ్రామస్థాయి న్యాయస్థానాల గురించిన సమాచారం... మరీ ముఖ్యంగా కింది స్థాయి న్యాయాధికారిగా గ్రామాధికార పాత్రను ఇప్పుడు చూద్దాం.
ప్రాచీన కాలం నుంచి మనదేశంలో గ్రామ సభ అందరి ఆమోదం పొందిన ప్రజా న్యాయస్తానంగా ఉంది. తనకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దవలసిందని కోరుతూ బాధిత పక్షం చేసిన విజ్ఞప్తిపై వివాదాన్ని విచారణ చేయడానికి గ్రామాధికారి సమావేశపరిచే ఉపసంఘమే ఈ న్యాయస్థానం. గ్రామాధికారి అంటేనే రాజు ప్రతినిధి. న్యాయస్థానం కోసం ప్రజలు ఇబ్బంది పడకుండా చూడవలసిన బాధ్యత అతడిపై ఉండి స్మృతులలో నిర్దేశించిన వివాదంలో చిక్కిన వారి కులం, శ్రేణికి సంబంధించిన వాస్తవాలు తెలిసినవారితో సంఘాన్ని ఏర్పాటుచేసి సమావేశపరచాలి. ధర్మశాస్త్రాల ఆధారంగా తటస్థంగా మెలిగి నిష్పక్షపాత తీర్పు ఇచ్చే ఒకరిద్దరు బ్రాహ్మణులను అవసరమైతే ఇతర గ్రామాల నుంచి కూడా ప్రత్యేకంగా ఆహ్వానించేవారు. ఆ రోజుల్లో ఈ పద్ధతి చాలా సాధారణం. కొన్ని దాన శాసనాల్లో ఈ బ్రాహ్మణులను దాన స్వీకర్తలుగా పేర్కొన్నారు. రెండవ చాళుక్య భీమునికి చెందిన కోలవెన్ను శాసనాల్లో దాన స్వీకర్త కుమారులు, మనుమళ్లు 'వరగోషు' లలో చక్కటి న్యాయవాదులన్న అభివర్ణన ఉంది. రాజులు ఏర్పరచిన అగ్రహారాల్లో కొందరు బ్రాహ్మణ న్యాయకోవిదులు ఉండేవారని దీన్ని బట్టి స్పష్టమవుతుంది. అవసరమైనప్పుడు కొంత నామమాత్రపు ప్రతిపలం చెల్లించి గ్రామాధికారి వీరి వీరి సేవలను వినియోగించుకోక తప్పని సందర్భాల్లో పెద్దల సహాయంతో గ్రామాధికారే వివాదాలను పరిష్కరించేవాడు. ఇతడిని 'కొన్ని శాసనాలు 'గ్రామణి' అని పేర్కొంటున్నాయి. ఉమికిలి గ్రామానికి వేమరాజు అనే వ్యక్తిని 'గ్రామణి'గా నియమించిన సందర్భంలో, సంబంధిత వ్యక్తుల నుంచి 'తాంబూలం'తో పాటు ఒక 'తూము' ధాన్యాన్ని వసూలు చేసుకోవడానికి రాజు అనుమతించినట్లు మొదటి అమ్మరాజు శాసనం అంటున్నది. కౌలు, దస్తావేజులు, వివాహం, ఒప్పందాల వంటివి కుదుర్చుకునేటప్పుడు సంబంధిత పక్షాల, తాంబూలంతో పాటు నగదు లేదా వస్తు రూపంగా కొంత ప్రతిఫలాన్ని గ్రామాధికారికి చెల్లించడం ఆ రోజుల్లో ఆనవాయితీగా ఉండేది. ఉభయపక్షాలు ఒప్పందానికి కట్టుబడి ఉండేలా ఈ చెల్లింపులు జరిగేవి. ఒప్పందాన్ని ఎవరైనా ఉల్లంఘిస్తే గ్రామాధికారి పరిస్థితిని చక్కదిద్దేవాడు. ఒప్పందానికి కట్టుబడని వాడిని శిక్షించేవాడు. గ్రామణి లేదా 'రెడ్డి'కి మేజిస్ట్రేట్ మాదిరి విధులను అప్పగించేవారు.
Authorization