ఈ భూమిపై మానవుని ఆవిర్భావం నుంచి నేటి వరకు జరిగిన పరిణామాలు అనేకం. జంతువు నుండి వేరుపడి ప్రస్తుత స్థితికి రావడానికి మనిషికి లక్షలాది ఏండ్లు పట్టింది. ఈ మహాప్రయాణంలో మనకు తెలిసిన భాగం చాలా తక్కువ. తెలుసుకోవాల్సింది కొండంత. ప్రపంచం అనే ఈ రంగస్థలంపై అనేక సమాజాలు, సంస్కృతులు పుట్టాయి, గిట్టాయి. కొన్ని ఇంకా కొనసాగుతున్నాయి. అటువంటి సమాజాల్లో మన తెలంగాణ భూభాగంలో ఉన్న ప్రజా సమూహాలు కొన్ని. ఈ సమూహాలు చిన్న చిన్న గ్రామాలు, పట్టణాలు, నగరాలు, జనపదాలు, రాజ్యాలు, సామ్రాజ్యాలుగా రూపొంది విశిష్టమైన సామాజిక, ఆర్థిక, రాజకీయ వ్యవస్థల సృష్టికి కారణమయ్యాయి. ఆ పునాదులమీదే నేటి తెలంగాణ సమాజం నిర్మితమయింది. పునాది బలం, బలహీనతల మీదే ఏ సమాజ మనుగడ అయినా ఆధారపడి ఉంటుంది. అందుకే ఏ సమాజమైనా తన మూలాల్లోకి వెళ్లి పరీక్షించుకోవాలి. అట్లా పరీక్షించుకోవడానికి ఆర్కియాలజీ (పురావస్తు శాస్త్రం)కి మించిన సాధనం లేదు. అందుకే మన రాష్ట్ర 'హెరిటేజ్ తెలంగాణ' (గతంలో రాష్ట్ర పురావస్తు, మ్యూజియంలు) శాఖ తన బాధ్యతల్లో భాగంగా అంతర్జాతీయ సెమినార్లను నిర్వహించి మన చరిత్ర, సంస్కృతులపై కొత్త వెలుగులు వెదజల్లుతున్నది. ఈ నెల 19, 20 తేదీల్లో హైదరాబాదు ఎమ్సిహెచ్ఆర్డిలో నిర్వహించిన మూడవ అంతర్జాతీయ సదస్సు తెలంగాణ వారసత్వం కథలోని అద్భుత ఘట్టాలపై విలువైన సమాచారాన్ని వెలికి తీసింది. ఆ సమాచారాన్ని పాఠకులకు పంచడం కోసమే ఈ వ్యాసం.
ఇప్పుడైనా, ఎప్పుడైనా ఒక ప్రాంత చరిత్ర, సంస్కృతులను పరిశీలించాలంటే కేవలం ఆ ప్రాంతాన్ని మాత్రమే పరిగణనలోనికి తీసుకోవడం సరికాదు. ఆ చుట్టు పక్కల ప్రాంతాలను, వందలు, వేల మైళ్ల దూరంలో ఉన్న ప్రాంతాలను కూడా ఒక్కో సారి పరిశీలించవలసి ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే కాబోలు హెరిటేజ్ తెలంగాణ శాఖవారు తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టాలనిచెబుతూ...దక్షిణాపథంలోని రాజ్యాలు, సామ్రాజ్యాల గురించి చర్చించాలని సూచిస్తూ దేశ విదేశాల్లో ఉన్న పురావస్తు శాస్త్రవేత్తలు, చరిత్రకారులు, ఆర్ట్ హిస్టోరియన్స్, నాణేల పరిశోథకులు, శాసన పరిశోథకులు, సంబంధిత ఇతర రంగాల్లో ఉన్న నిష్ణాతులకు పరిశోధనా పత్రాలు సమర్పించాలని ఆహ్వానాలు పపంపింది. వీరు కాక ఔత్సాహికులైన సాధారణ పౌరులు, మైధావులు కూడా చర్చల్లో పాల్గొనడానికి ప్రోత్సహించింది. ఫలితంగా అద్భుతమైన ప్రతిస్పందన వచ్చింది. దేశ విదేశాల నుంచి దాదాపు 200 మంది దాకా పరిశోధకులు ఈ సదస్సుకు ఆహాజరయ్యారు. వీరు కాక ఇతరులు కూడా పెద్ద సంఖ్యలో రెండురోజుల అంతర్జాతీయ సదస్సులో పాల్గొన్నారు. ఫలితంగా మన చరిత్రపై సారవంతమైన చర్చలు, నిర్ధారణలు జరిగాయి.
మొత్తం 23 మంది పరిశోధకులు తెలంగాణ చరిత్ర, సమకాలిక జీవనంపై పరిశోధనా పత్రాలు సమర్పించారు. ఇద్దరు ప్రముఖులు ప్రత్యేక ఉపన్యాసాలు ఇచ్చారు. ఇక్కడ స్థలాభావం వల్ల అన్ని పరిశోధనా విశేషాలు ఇవ్వకపోయినా ఇచ్చిన సంగతులన్నీ సాధారణ పాఠకులకు ఆసక్తికరంగా ఉంటాయి.
దక్షిణాపథంలోని చాలా ప్రాంతాలను కలిపి మనం ఇప్పుడు దక్కన్ అని వ్యవహరిస్తున్నాం. ఈ ప్రాంతాలు ఒకప్పుడు మన తెలంగాణతో సహా కలిసి ఒకే రాజ్యంలోనో, సామ్రాజ్యంలోనో భాగంగా ఉన్నవే. మహరాష్ట్ర, ఆంధ్ర, కర్నాటక రాష్ట్రాలుగా పాత రాజ్య భాగాలు ఎక్కువగా విడిపోయి ఉన్నాయి. అందువల్ల ఈ ప్రాంతాల్లోని చారిత్రక అంశాలు మన చరిత్రగానే భావించాలి. ఆ ఉద్దేశంతోనే మహారాష్ట్రలోని ఎలిఫెంటాలో ఉన్న ప్రాచీన బౌద్ధ స్థూపంపై పరిశోధనాత్మక వ్యాసంపై చర్చ జరిగింది. కాల్చిన ప్రాచీన ఇటుకలతో కట్టిన ఈ స్థూపం ప్రపంచంలోనే అత్యంత పెద్ద స్తూపాల్లో ఒకటి. బ్రిటిష్ కాలం నుండి ఈ స్థూపం వద్ద జరిగిన తవ్వకాలు, బయటపడిన సంగతులను ఈ పత్రంద్వారా వివరించారు డా.మనీష్రారు.
ఫణిగిరి
అమెరికా (న్యూయార్క్) నుంచి వచ్చిన డా.జాన్ గై పాత నల్లగొండ జిల్లా ఫణిగిరి బౌద్ధక్షేత్రంలో ఉన్న శిల్పాలను బట్టి ఆనాటి బౌద్ధ రాజ్యాలు, చక్రవర్తులు, ధర్మచక్రాల గురించిన చరిత్రను పునర్నిర్మించారు. భారతదేశంలో దేవాలయాలమీద శిల్పాలు చెక్కడం మధ్యయుగంలో అధికంగా జరిగిందనేది వాస్తవం. నిజానికి పూజాస్థలాలను శిల్పశోభితం చేయడం బౌద్ధం ద్వారానే ప్రారంభమయిందని చెప్పవచ్చు. సాంచి, బార్హుత్, అమరావతి, నాగార్జునకొండ, ఫణిగిరి వంటి బౌద్ధక్షేత్రాల్లో ఇందుకు సాక్ష్యాలు చూడవచ్చు. బౌద్ధస్థూపం బుద్దుడు లేదా పేరెన్నికగన్న బౌద్ధాచార్యుల శారీరక అవశేషాలపై నిర్మితమైన నిర్మాణాలు. వారి బోధనలు, బుద్ధుని జాతక కథలు, జీవిత ఘట్టాలు, సంఘ నియమాలు, కట్టుబాట్లను కండ్లకు కట్టినట్లు చూపే శిల్పాలతో ఈ స్తూపాలు, విహారాలు అలంకృతమై ఉంటాయి. అందుకే జాన్ గై సాధారణ ప్రజలను సంస్కరించే కేంద్రాలుగా బౌద్ధ క్షేత్రాలను పేర్కొన్నారు. ఫణిగిరి బౌద్ధక్షేత్రంలో ఉన్న ధర్మచక్ర స్తంభం, స్తూపం చుట్టూ ఉండే ప్రదక్షిణాపథంలోకి ప్రవేశించే మూడు ద్వారాలపై ఉన్న శిల్పాలను, నిలువెత్తున ఉన్న బోధిసత్వుని విగ్రహం వంటివాటిపై దృష్టిని కేంద్రీకరించి లోతైన విశ్లేషణలు అందించారు.
ఢిల్లీ యూనివర్సిటీ ఫాకల్లీ మెంబర్ డా.అజరు వాజ్పాయి , మహాకూట (బాగల్కోట్ జిల్లా, కర్నాటక,), అలంపూర్ (తెలంగాణ)లను పరిశీలించి శైవమతాన్ని ఈ వెలుగులో ఎట్లా అర్థంచేసుకోవాలో చెబుతూ ఒక పరిశోధనా పత్రం సమర్పించారు. మహాకూటకు దాదాపు రెండు వందల మైళ్ల దూరంలో ఉన్న అలంపూర్లోనూ మహాకూటలో ఉన్నట్లు అనేక దేవాలయాలు ఉండటం నది ఉండటంతో కొన్ని పోలికలు చూశారు.
కన్నడ, తెలుగు వారి మధ్య ఆదాన ప్రదానాలు
రాష్ట్రకూటుల కాలంలో దక్షిణాపథంలో ఉన్న కన్నడ, తెలంగాణ భూభాగాల మధ్య అదాన ప్రదానాలు ఎట్లా ఉన్నాయనే విషయాన్ని చక్కగా వివరించారు మరో పరిశోధకుడు డా.చూడామణి నందగోపాల్. కన్నడ గ్రంథం 'కవిరాజమార్గ'లో పేర్కొన్న ప్రకారం రాష్ట్రకూటులు దక్షిణాపథంలో తమ రాజ్యాన్ని ఎట్లా విస్తరించారో వివరించారు. అట్లాగే వేములవాడ చాళుక్యుల కాలంలో; మరీ ముఖ్యంగా రెండవ అరికేసరి కాలంలో కన్నడ సాహిత్యానికి దొరికిన ఆదరణపై విశ్లేషణ ఉంది. వేంగినాడు నుండి కన్నడ ఆదికవిగా పేరుగాంచిన పంపడు వేములవాడకు వచ్చి స్థిరపడ్డాడని, వేములవాడ ఆస్థాన కవిగా ఆయన చేసిన కన్నడ సేవ గొప్పదనాన్ని వివరించారు. తెలుగు, కన్నడ సంస్కృతుల మధ్య ఉన్న సంబంధాన్ని ఆయన వివరించారు.
దేవాలయాల్లో పెయింటింగ్స్పై
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి చెందిన రేఖాపాండే చాళుక్యులు, రాష్ట్రకూట దేవాలయాల్లో కనిపించే కళ (ఆర్ట్)పై ఆసక్తిదాయక విషయాలు బయటపెట్టారు. ఈ దేవాలయాల్లో ఉన్న పెయింటింగ్స్పై విలువైన వాఖ్యలు చేశారు. ఎప్పుడో పది పదిహేను వందల ఏండ్లనాడు వేసిన ఈ పెయింటింగ్స్ ఇంకా నిలిచి ఉండటానికి కారణం ఆ కాలంలో చిత్రకారులు వాడిన మెటీరియల్ మాత్రమే కారణం అని తేల్చారు. దేవాలయాల గురించే ఈ ఆర్ట్ ప్రధానంగా మాట్లాడుతున్నదని ఆమె అన్నారు. బాదామి, ఐహౌల్ గుహల్లోను, పట్టడకల్ దేవాలయంలో ఉన్న పెయింటింగ్స్పై సాధికారిక విశ్లేషణ జరిగింది
నాణేలు
వృత్తిరిత్యా వైద్యుడైన డా.రాజారెడ్డి నాణేల అధ్యయనంద్వారా భారతీయ చరిత్రకు, ముఖ్యంగా తెలంగాణకు చేసిన, చేస్తున్న సేవ అసామాన్యం. ఆయన ఈ సదస్సులో కొండాపూర్ (మెదక్ జిల్లా) తవ్వకాల్లో లభించిన అరుదైన నాణేలపై తన వాణి వినిపించారు. అట్లాగే డా.రాధాకృష్ణన్ అనే పరిశోధకుడు శాతవాహనుల నాణేలపై ఉన్న గుర్తులను విశ్లేసిస్తూ అవి దక్కన్ నాణేల చరిత్రను పునర్నిర్మించడానికి ఎట్లా తోడ్పడ్డాయో చెప్పారు.
బాహుబలి చేసిన పిడిగుద్దుల యుద్ధం...
బోధన్ని ప్రస్తావిస్తూ నలుగురైదుగురు పరిశోధకులు తమ పరిశోధనా పత్రాలు సమర్పించారు. అయితే 'నవతెలంగాణ' ప్రతినిధిగా ఈ వ్యాసరచయిత, నాగార్జున విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ చల్లపల్లి స్వరూపరాణితో కలిసి ప్రత్యేకించి బోధన్పైనే ఓ పరిశోధనా వ్యాసం సమర్పించాడు. నిజామాబాద్ జిల్లా బోధన్ ప్రాచీన కాలం నుంచి మానవ మనుగడకు ఆవాసంగా ఉందని, మహాజనపదాల్లో ఒకటైన అస్మకకు, ఆ తర్వాతి కాలంలో వచ్చిన వేములవాడ చాళుక్యులకు రాజధాని నగరంగా ఉందని ఈ వ్యాసం చెప్పింది. అట్లాగే పూర్వం ఇది జైన, బౌద్ధ, హిందు మతాలకు ఎట్లా కేంద్రమయిందో వివరించే ఆధారాలు చూపింది. జైన సిద్ధుడయిన బాహుబలి (గోమఠేశ్వరుడు) ఈ ప్రాంతాన్ని పాలించినట్లు చెప్పే సాహిత్య, ఆధారాలు, కర్నాటకలోని శ్రావణబెల్గోలాలో ఉన్న గోమఠేశ్వరుని భారీ విగ్రహానికి స్ఫూర్తి ఒకప్పుడు బోధన్లో ఉన్న బాహుబలి విగ్రహమేనని, ఇట్లా జైన మతంలో భారీ విగ్రహాల రూపకల్పనకు నాంది పలికింది బోధన్ అని చెప్పే సాక్ష్యాలు చూపింది. మరో ఆసక్తికరమైన అంశాన్ని ఈ సందర్భంగా బయటపెట్టింది ఈ వ్యాసం.; రాజ్యం కోసం బాహుబలి, అతడి అన్న భరతుడు యుద్ధానికి దిగుతారు. ఇది పిడిగుద్దుల యుద్ధం. ఆయుద్ధం మధ్యలోనే బాహుబలికి జ్ఞానోదయం కలిగి రాజ్యాన్ని త్యజించి తపస్సు ప్రారంభించినట్లు సాహిత్య ఆధారాలు ఉన్నాయి. ఈ రచయిత ఇటీవల బోధన్ ప్రాంతంలో పర్యటించినప్పుడు పూర్వం ఉన్న పిడిగుద్దుల యుద్ధం ఇప్పుడు ఒక ఆటరూపంలో ఉన్నట్లు బయటపడింది. బోధన్కి సమీపంలో ఉన్న 'హున్స' అనే గ్రామంలో ఒక పండుగ సందర్భంగా గ్రామంలోని ప్రజలు రెండు గుంపులుగా విడిపోయి పిడిగుద్దుల యుద్ధం చేస్తారు. కొంతసేపటితర్వాత ఈ యుద్ధాన్ని ఆపి ప్రత్యర్థి గుంపులోనివారిని కౌగిలించుకొని అలారుబలారు చెబుతారు. దీన్నే స్థానికంగా 'పిడిగుద్దులాట' అంటారు. బాహుబలి కాలంలో ఉన్న ఈ యుద్ధ (ముష్టియుద్ధం) పద్ధతి ఇప్పటికీ ఒక ఆటగా కొనసాగుతున్నదనే సంగతిని ఈ పరిశోధనా వ్యాసం వెలికి తెచ్చింది.
ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన డా.పరిటి అరుణ కూడా తన వ్యాసంలో బోధన్పై విశేష విశ్లేషణ చేశారు. వేములవాడ చాళుక్యుల రాజధానిగా దాని విశిష్టతను నొక్కిచెప్పారు.
చెరువులు, పట్టణాలు
యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్కి చెందిన పోస్ట్ డాక్టొరల్ రీసెర్చ్ ఫెలో డా.ఆడమ్ స్టువర్ట్ గ్రీన్ తన పరిశోధనాపత్రంలో ప్రాచీన దక్షిణాసియాలోని అనేక ఉదాహరణలను తీసుకొని పోల్చి చూస్తూ వివిధ సమాజాల్లో వచ్చిన మార్పులను గుర్తించి , ఆ ఎరుకను ప్రస్తుత సమాజాలు ఏవిధంగా ఉపయోగించుకోవాలో చెప్పారు. ఈ పోలికకు ముఖ్యంగా కాకతీయుల నాటి వ్యవస్థలను, సింధునాగరికత వ్యవస్థలను ఉపయోగించుకున్నారు. ఈ పరిశోధనా పత్రం పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. మనిషి పరిసరాలను కొల్లగట్టే విధానం, అందువల్ల వచ్చే వాతావరణ మార్పులు, తిరిగి ఆ మార్పులు సమకాలీన సమాజాన్ని ఎట్లా ప్రభావితం చేస్తాయన్న విషయంపై ఈ వ్యాసం సాగింది. కాకతీయులనాటి చెరువులు, పట్టణాలు; అట్లాగే సింధునాగరికతలోని వ్యవస్థలు పక్క పక్కనే పెట్టి చేసిన విశ్లేషణ భవిష్యత్ చరిత్రకారులకు ఒక మోడల్గా నిలిచిందని చెప్పవచ్చు.
తెలంగాణలోని తొలి చారిత్రక పట్టణాలు, రాజ్యాలపై ప్రధానంగా కేంద్రీకరిస్తూ డా. రాచర్ల గణపతి, నాగరాజు వంటివారు మంచి పరిశోధనా విశేషాలు తెలియజేశారు. యూనివర్సిటీ ఆప్ హైదరాబాదుకు చెందిన ప్రొఫెసర్ కె.పి.రావు శాతవాహన కాలం నాటి సముద్రవాణిజ్యాన్ని వివరించారు. సిరిపురం రుషీకేశ్ పెద్దబంకూరు తవ్వకాల్లో లభించిన శాతవాహన కాలం నాటి ఆభరణాలపై రాసిన పరిశోధనా పత్రం ఆకట్టుకున్నది. అక్కడ లభించిన పూసల తయారీ టెక్నిక్, వాటి సింబాలిజం, సమకాలీన సమాజ విశ్వాసాలను అవి ఎట్లా ప్రతిబింబిస్తున్నాయన్న కోణంలో ఈ పరిశోధన సభికులను ఆకట్టుకున్నది.
ప్రత్యేక ఉపన్యాసాలు
చివరగా ఇద్దరు నిపుణులు ఇచ్చిన ప్రత్యేక ఉపన్యాసాల గురించి కూడా చెప్పుకోవాలి. యూనివర్సిటీ ఆఫ్ మిస్సోరి నుంచి వచ్చిన మార్సిల్లా సిర్హాండి 'హైదరాబాదులో అబ్దుల్ రహ్మాన్ చాగ్తారు' అన్న శీర్షికతో ఆమె చేసిన ఉపన్యాసం అద్భుతంగా సాగింది. గొప్ప చిత్రకారుడైన చాగ్తారు కళను విశ్లేషిస్తూ పాకిస్తాన్, ఇండియా, ఇతర చోట్ల ఉన్న అనేక పెయింటింగ్స్ని విశ్లేషిస్తూ సాగిన ఉపన్యాసం ఇది. చాగ్తాయి దేశ విభజన తర్వాత పాకిస్తాన్ వెళ్లాడు. అంతకు ముందు నిజాం రాజ్యంలో ఉండేవాడు.
రెండో ప్రత్యేక ఉపన్యాసం 'పేరిణి నృత్యం'పై గురువు కళాకృష్ణ చేసినది. అసలు అదృశ్యమైన పేరిణి నృత్యాన్ని ప్రఖ్యాత కళాకారుడు నటరాజ రామకృష్ణ ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి పున:సృష్టించారు. అయితే ఈ నృత్యం పురుషులకే పరిమితమై ఉంది. స్త్రీలూ ఈ నృత్య ప్రక్రియలో పాలుపంచుకున్నారనే సాహిత్య ఆధారాలు ఉన్నా నటరాజ రామకృష్ణ వారికి శిక్షణ ఇవ్వలేదు. ఆ వెలితిని పూరించడానికి కళాకృష్ణ శిల్పాలు, ప్రాచీన సాహిత్యాన్ని ఆధారంగా చేసుకొని దుస్తులు, నగలు ఇతర సరంజామాను నాట్యకారిణులకు రూపొందించారు. అన్నిటికన్నా ముఖ్యంగా వారు నృత్యం చేయడానికి అవసరమైన పద్ధతులను, గీతాలు, దరువులను రూపొందించి శిక్షణ ఇచ్చారు. అట్లా శిక్షణ ఇచ్చిన తన శిష్యుల (స్రీ, పురుషుడు) తో పేరిణి నృత్యాన్ని ప్రదర్శింపజేసి ప్రేక్షకుల మన్ననలకు పాత్రులయ్యారు.
మొత్తం మీద ఈ రెండు రోజుల అంతర్జాతీయ సెమినార్ తెలంగాణ చరిత్ర, సంస్కృతులపై కొత్త వెలుగును ప్రసరింపచేశాయని చెప్పాలి.
ఎంతో ఉపయోగకరం
ఇటువంటి అంతర్జాతీయ సెమినార్ల వల్ల మన యువ పరిశోధకులకు సరైన దిశానిర్దేశం చేసే అవకాశం ఉంటుంది. విదేశీయులకు మన చరిత్ర సంస్కృతులపై అధ్యయనం చేయడానికి అవకాశం కల్పించడం, మన పరిశోధకులకు విదేశీ పరిశోధనా పద్ధతులు తెలుసుకునే అవకాశం కల్పించడం ఇటువంటి సెమినార్ల వల్లనే సాధ్యమవుతుంది. ప్రపంచంలోని వివిధ దేశాల సంస్కృతులలోని ఆదాన ప్రదానాలకు ఇంటర్నేషనల్ సెమినార్లు ఎప్పుడూ వేదికగానే ఉంటాయి.
Authorization