ప్రస్తుతం నిర్మల్ జిల్లా (ఒకప్పుడు ఆదిలాబాద్ జిల్లా)లో వుంది. బాసర నిజానికి ఒక ఊరు కాదు. ఐదు గ్రామాల సముదాయం: 1.బాసర 2. రేణుకాపురం, 3.మహదాపురం, 4.రత్నాపురం, 5.మయిలాపురం. ప్రస్తుతం బాసర, మయిలాపురం మాత్రమే మిగిలి ఉన్నాయి. మిగిలిన ఊర్లు రెవెన్యూ రికార్డుల్లో మాత్రమే ఉన్నాయి.
బాసరలో జ్ఞానసరస్వతిని వ్యాసుడు ప్రతిష్టించినట్లు చెప్పబడుతున్నది. కాని, ఈ ప్రాంతాన్ని ఒకప్పుడు పాలించిన కరికాళచోళ రాజైన రెండవ బిజ్జలదేవుడే ఇక్కడ ఆలయాలను నిర్మించినాడని చరిత్రకారులు అభిప్రాయం. తాను జైనుడు. అతని బావ వీరశైవప్రవక్త బసవేశ్వరుడు. వారి కాలంలో వీరశైన ప్రాబల్యంవల్ల జరిగిన జైనం,శైవాల సంఘర్షణలకు దర్పణంగా వుంది బాసర. బాసర జ్ఞానసరస్వతి దేవాలయానికి వెనుకగా చిన్నగుట్ట మీద పాపహరేశ్వరాలయంగా పిలువబడే పురాతన శివాలయముంది. ఈ దేవాలయావరణలోని స్తంభశిలలు, శాసనస్తంభాలు, శిల్పాలు అన్నీ వేటికవి ప్రత్యేకమైనవి. రాష్ట్రకూటుల కాలం నుంచి వేములవాడ చాళుక్యుల వరకు వివిధ సందర్భాలలో ప్రతిష్టించబడిన దేవాలయాలు, కూల్చబడిన, మార్చబడిన జైనబసదులు, వీరశిలలు, సతిశిలలు, శాసనాలు, శిథిలాలు ఒకేచోట అగుపిస్తున్నాయి.
శిథిలాలయం: రాష్ట్రకూటుల నుంచి (అంతకుముందు కూడా) కాకతీయుల దాక లలాటబింబంగా చెక్కబడిన గజలక్ష్మి ఇక్కడి శిథిలదేవాలయపు ద్వారం మీద వుంది. జైనులైన రాష్ట్రకూటులు తాము నిర్మించిన గుడులమీద, శాసనాలమీద తామరపూలరేకులను చెక్కించడం ఒక ప్రత్యేకశైలిగా మనం గుర్తించవచ్చు. అదే శైలి ఈ దేవాలయం ఉత్తరాశి మీద కనిపిస్తుంది. సాధారణంగా జైన బసదుల ముందర వుండే శంఖలతాతోరణం, ఏనుగులున్న చంద్రశిల ఇక్కడ కనిపిస్తున్నది. ఏక, త్రి.. దేవతాధిష్టాన పీఠాలు ఖాళీగా కనిపిస్తున్నాయి. రెండుచేతులున్న జైన గణపతి బయట కనిపిస్తున్నాడు. జైన నిశీథులు కూడా ఇక్కడ కనిపించాయి. జైన గురు పరంపరను తెలిపే జైన స్తంభమొకటి వుంది. రాష్ట్రకూటుల కాలం నాటి రెండు గణపతి విగ్రహాలు అక్కడున్నాయి.
శైవం: రాష్ట్రకూటుల పిదప చాళుక్యులు రాజ్యపాలనకు వచ్చే సంధికాలంలో వీరశైవం విస్తరించింది. వీరశైవులు జైనులనెందరినో పట్టి పరిమార్చినట్టు శాసనాలు, గ్రంథాలు చెపుతున్నాయి. జైనబసదులెన్నో కూల్చబడ్డాయి లేదా శైవాలయాలుగా మార్చబడ్డాయి. ఇక్కడ కూడా అట్లాంటి సాక్ష్యాలు మనకు లభిస్తున్నాయి. ఎక్కడెక్కడో బయటపడివున్న విగ్రహాలను ఈ పాపహరేశ్వరుని ప్రాంగణంలోనికి చేర్చినట్టున్నారు. శైవానికి సంబంధించిన భైరవుడు, చాముండి దేవతలు, రెండు సమలింగాలు (బ్రహ్మ, విష్ణు, రుద్ర భాగాలతో), నాగశిల్పాలు, పాతగర్భాలయాన్ని పెంచి కట్టిన రంగ, ముఖ మంటపాలు అగుపిస్తున్నాయి. దూరంగా దీపస్తంభమొకటున్నది.
శాసనాలు: అక్కడి స్తంభాలమీద చెక్కిన శాసనాలలో 9వ శతాబ్దపు తెలుగులిపిలో 1. శ్రీవైశ్య కులతిలక .... పయ సెట్టి, 2. స్వస్తిశ్రీ రేచయ్య కొట్టద్రమ్మ నూరు, 3. స్వస్తిశ్రీ బిజ్జకప్పియ్య కొట్టద్రమ్మ నూరు, (4. లిపి స్పష్టంగా కనిపించడం లేదు) అని వుంది. బినోలలో బాహుబలి అని అనుకుంటున్న శిల్పం బాహుబలిది కాదు, జైన తీర్థంకరుడు శాంతినాథునిది. శిల్పపాదపీఠం మీద ఒక'వైశ్యకులతిలకుడు' చేయించిన శాంతినాథుని శిల్పమని రాసున్నది. ఇక్కడ కూడా ఒక శాసనంలో వైశ్యకులతిలక అనే మాట వుంది. గోదావరి అవతల బినోల, ఇవతల బాసరలలోని ఈ శాసనలిపులు ఒకే కాలానికి చెందినవి.
సతిశిలలు: అన్నింటి కన్నా ప్రత్యేకమైనవి ఇక్కడ కనిపిస్తున్న రెండు సతిశిలలు. తెలంగాణలో అరుదుగా కనిపించేవి సతి శిలలు. భర్తలు వీరమరణం పొందినపుడు సతీసహగమనం చేసిన స్త్రీలకు, ఆత్మాహుతి చేసుకున్న స్త్రీలకు సతిశిలలను నిలుపుతుంటారు. ఈ సతిశిలలను నిలిపే ఆచారం మనకు కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాతులలో ఎక్కువగా కనిపిస్తుంది.
మహిషాసురమర్దిని: ఇక్కడ కనిపించిన అన్ని శిల్పాల కన్న మిన్నయైన శిల్పం రాతిగుండుకు చెక్కిన మహిషాసురమర్దిని విగ్రహం. చతుర్భుజియైన ఈ దేవతకు వెనక కుడిచేతిలో గంట, ఎడమచేతిలో శంఖు వున్నాయి. ముందరి రెండు చేతులలో కుడిచేతిలోని శూలంతో మహిషాసురుని వధిస్తున్నట్టుంది. ఎడమచేయి దున్నపోతు రూపంలో వున్న మహిషాసురుని తోక పట్టి పైకిలాగినట్టుంది. ఎడమకాలితో మహిషం తలను తొక్కిపట్టినట్లున్నది. ఇటువంటి శిల్పం చాలా అరుదైనటువంటిది.
బాసరకు వ్యాసపురి అని పేరుందని, వ్యాసుడిక్కడ తపస్సు చేసుకుంటు నివసించినందువల్ల ఆ పేరు వచ్చిందని జనాభిప్రాయం. అయితే జైన బసదులిక్కడ ఎక్కువగా వుండటంవల్ల బసది అనే పిలుపు 'బాసర' కావడానికి కూడా అవకాశముంది.
ఈ శిల్పాలన్నింటిని తన క్షేత్రపర్యటనలో చూసింది, ఫోటోలుతీసింది మిత్రులు బాసరవాసి టీచర్ రామ్మోహన్, భూపాలపల్లి కి చెందిన టీచర్ మాదారపు రామయ్య,. వారిచ్చిన సమాచారమే ఈ వాసానికి మూలం.
Authorization