ఎల్లమ్మ కథ మన సమాజపు పోకడలను పట్టిచ్చే అద్దం వంటిది. పురుషాహంకారం, పాతివ్రత్యంపేరుతో స్త్రీలను అమానవీయంగా హింసించి వేధించడం వంటి సకల భారతీయ సమాజపు అవలక్షణాలు ఈ కథలో మనకు స్పష్టంగా కనపడతాయి. అదే సమయంలో దళిత బహుజనులు కష్టాల్లో ఉన్న స్త్రీలను ఎట్లా అక్కున చేర్చుకుంటారో కూడా రేణుక ఎల్లమ్మ కథ మనకు చెబుతుంది. అటువంటి అద్భుతమైన ఎల్లమ్మ కథతో ముడివడిన జానపదుల జీవితాన్ని మీకందిస్తోంది 'జాతర'.అక్షరజ్ఞానం, చదువు సందెలు తక్కువని భావింపబడే దళిత సమూహాల్లో కళాకారులకు, తాత్వికులకు కొదవలేదు. ప్రత్యేకంగా తమవని చెప్పుకోదగిన కొన్ని కళారూపాలను తరాల నుండీ దళిత సమూహాలు కాపాడుకుంటూ వస్తున్నాయి. వీటిలో ఎల్లమ్మ కథ, జాంబవపురాణం, చిందుభాగవతం, ఒగ్గు కథ వంటి కళలు ముఖ్యమైనవి. ఈ కళారూపాలను నిరక్షరాశ్యులైన గ్రామీణ దళితులు స్వంతంగా రూపొందించుకొని ప్రదర్శించడం విశేషం. ఆయా కళారూపాల్లో ఉపయోగించే పనిముట్లు పరోక్షంగా దళిత సంస్కృతికి అద్దం పడతాయి. ఇవి దళిత భావజాలాన్ని, అనార్య సంస్కృతిని, మాతృస్వామ్య వ్యవస్థతో దళితులకు ఉన్న దగ్గరి సంబంధాన్ని ప్రతిబింబిస్తాయి. ఆర్య-అనార్య తెగలకు, పితృస్వామిక-మాతృస్వామిక వ్యవస్థలకు, మార్గ-దేశీ సంప్రదాయాలకు, శిష్ట-జానపద సంస్కృతులకు మధ్య వుండే వైరుధ్యం దళిత కళారూపాల్లో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.
ఈ వ్యాసరచనకు దళిత కళారూపమైన ఎల్లమ్మ కథను పరిశీలనాంశంగా తీసుకున్నాం. ఎల్లమ్మ కథను తెలంగాణ, రాయలసీమ జిల్లాల్లో భవనిలు లేక బైండ్లవారు ప్రదర్శిస్తారు. వీరు దళితుల్లో మాదిగ ఉపకులానికి చెందినవారు. భవనీల ప్రస్తావన శిష్టసాహిత్యంలో శ్రీనాథుడు రచించిన 'క్రీడాభిరామం'లో కూడా కనిపిస్తుంది. వీరు కాకతీయుల కాలంలో జమిడిక (జవనిక) వాయిస్తూ పరశురాముడి కథను, రేణుకా ఎల్లమ్మ కథను గానం చేస్తూ జీవించినట్టు 'క్రీడాభిరామం' పేర్కొంది.
ఎల్లమ్మను దళితవర్గాల్లో అట్టడుగు ప్రజలు ఆరాధిస్తారు. భవనీల కుల దైవం ఎల్లమ్మ. ఈమె రేణుకాదేవి అనీ, రేణుకా ఎల్లమ్మ అనీ, ఏకవీర అనీ, మహురం అనీ గ్రామాల్లో వెలిసింది. నిజామాబాద్ జిల్లాలో ఈమె పేరున ''ఎల్లమ్మ'' గుట్ట ఉండగా, వరంగల్ పట్టణంలో ఒక వీధి ఎల్లమ్మ వీధిగా పిలువబడుతుంది. ఎల్లమ్మను ఆంధ్రప్రాంతంలోనే కాకుండా ఆంధ్రరాష్ట్రానికి సరిహద్దుగా గల మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా పూజిస్తున్నారు.
రకరకాల కథలు... భావం ఒక్కటే
ఎల్లమ్మ కథలో పాఠ్యభేదాలున్నాయి. ఒక కథనం ప్రకారం రేణుకాదేవి జమదగ్ని మహాముని భార్య, పరశురాముడి తల్లి, ఈమే పార్వతీ పరమేశ్వరుల సంతానంగా పేర్కొనబడింది. జమదగ్ని నిర్వహించే పూజాకార్యక్రమాలకు నీటిని రేణుకాదేవి ప్రతిరోజూ ఏటినుంచి తీసుకొస్తూ ఉంటుంది. ఆనవాయితీగా నీటికోసం ఏటి ఒడ్డుకు వెళ్లిన రేణుకకు అక్కడ జలకాలాడే అప్సరసల శృంగార సన్నివేశం కంటబడి ఆమె మనసు చలిస్తుంది. రేణుక నీటిని తీసుకొని జమదగ్ని ఉండే పర్ణశాలకు రాగా, అతడు ఆమె పవిత్ర హృదయంతో నీటిని తీసుకురాలేదని గ్రహించి ఆ నీటిని స్వీకరించక తన కూమారుల్లో ఒకరిని ఆమె తల ఖండించవలసిందిగా ఆజ్ఞాపిస్తాడు. అందుకు రేణుకా జమదగ్నిల కుమారుడు పరశురాముడు అంగీకరించి ఆమె తలను కత్తితో తెగనరుకుతాడు. తండ్రి ఆజ్ఞను శిరసావహించిన పరశురాముడిని మెచ్చుకొని ఏమికావాలో కోరుకొమ్మని అడుగగా, పరశురాముడు తన తల్లియైన రేణుకను తిరిగి బతికించమని కోరడం, తన మహిమతో ఆమెను తిరిగి బతికించడంతో కథ సుఖాంతమవుతుంది. ఈ కథలో పరశురాముడు నరకగా తెగిపడిన రేణుక తల ఎగిరి భవనీల కాలనీలో పడుతుంది. వారు ఆమెను ఆదరంగా స్వీకరించి ఆమె తమకెల్లరకు అమ్మవంటిదని 'ఎల్లమ్మ' అనే పేరుతో పూజించడం ప్రారంభించారు. ఎల్లమ్మ కథాగానం బైండ్లవారి కులవృత్తిగా మారింది.
ఎల్లమ్మ కథను రాయలసీమ బైండ్లవారు మరోవిధంగా చెబుతారు. ఈ కథలో కూడా రేణుకాదేవి పరశురాముడి తల్లిగానే ఉంటుంది. పరశురాముడు తన తల్లియైన రేణుకాదేవి శీలాన్ని శంకిస్తూ తానెలా పుట్టిందీ, తన తండ్రి ఎవరో చెప్పమని ఆమెని రకరకాలుగా హింసిస్తూ ఉంటాడు. కుమారుని వేధింపులు భరించలేని రేణుక పారిపోయి మాదిగవాడలో తలదాచుకుంటుంది. మాదిగలు ఆమెను ఆదరిస్తారు. ఆమె తలదాచుకున్న ఇంట్లో కొడుకు మరణించగా యవ్వనవతియైన కోడలు, వితంతువైన అత్తా ఉంటారు. వీరికి రేణుక తన సమస్యను వివరించి తనను వెదకుతూ పరశురాముడు ఇక్కడికొస్తాడని చెబుతుంది. వితంతువులైన అత్తాకోడళ్ళు పరశురాముడి రాక కోసం వాకిట్లో మంచంవేసి అతని కోసం తాంబూలాన్ని సిద్ధంగా ఉంచుతారు. రేణుక చెప్పినట్టు పరశురాముడు తల్లిని వెదుక్కొంటూ అక్కడికి వస్తాడు. కోడలు అతనికి మర్యాదచేసి మంచంపై కూర్చొండబెట్టి తాంబూలం ఇస్తుంది. పరశురాముడు తాంబూలం సేవించి నోటిలో ఉన్న పిప్పిని ఉమ్ముతాడు. ఆ ఉమ్మి నుంచి ఇద్దరు మగపిల్లలు పుడతారు. ఆ పిల్లలే బైండ్లవారు. ఆ పిల్లల్ని చూసి ఆశ్చర్యపడిన పరశురాముడు వీళ్ళు ఎలా పుట్టారని అడుగుతాడు. అప్పటివరకు ఇంటిలోపల దాగివున్న రేణుకాదేవి బయటకొచ్చి ఈ పిల్లలు ఎలా పుట్టారో నువ్వు కూడా అలాగే పుట్టావని పరశురాముడికి ధీటైన సమాధానం ఇచ్చి అతని సందేహాన్ని నివృత్తి చేస్తుంది. అప్పటి నుండి బైండ్లవారు రేణుకను తమ ఇంటి అమ్మగా (ఇల్లు+అమ్మ) ''ఇల్లమ్మ''గా కాలక్రమంలో ఎల్లమ్మగా పూజిస్తూ ఆమె కథను ప్రదర్శనా కళగా మలచుకున్నారు.
బహుజన కళారూపాల ప్రత్యేకతలు
కింది కులాలకు చెందిన కళారూపాల్లో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఆయా కులాలకు తమవైన పూజా విధానాలు, కళాసాహిత్యాలు ఉన్నాయి. ఈ కులాలు తమ కళారూపాల్లో నిర్దిష్టమైన కథాంశాన్ని ఎన్నుకుని ప్రత్యేక సంగీత వాయిద్యాలను ఉపయోగించడం వెనుక తమ సంస్కృతిని, సంప్రదాయాలను అన్నింటికీ మించి తమ భావజాలాన్ని కాపాడుకోవాలనే కోరిక కనిపిస్తుంది. వీరు ఉపయోగించే జమిడిక, డప్పు, డోలు, తప్పెట్లు మొదలైనవి బ్రామ్మణీయ వాద్యపరికరాలకు భిన్నంగా ఉంటాయి. ఇతరుల కళారూపాలు, సంగీత వాయిద్యాల వలె ఇవి సున్నితంగా, ఆహ్లాదకరంగా ఉండవు. సంగీతం కర్ణకఠోరంగా ఉండి, కథనం సాహసంతోనూ, ఉద్వేగంగానూ ఉంటుంది. ఎల్లమ్మ కథలో బైండ్లవారు ఉపయోగించే జమిడిక 'జుంజుంజుం' మంటూ తాత్వికంగా సాగుతుంది.
ఎల్లమ్మ కథ ప్రాచీనత ఏనాటిదో చెప్పడం కష్టం. కాకతీయుల కాలంనాటికే ఈ కథా ప్రాశస్త్యం గురించి శిష్టసాహిత్యంలో పేర్కొనబడింది. ఇది మౌఖికంగా ఎంత ప్రాచీనకాలం నుండి ప్రచారంలో వుండి ఉంటుంది. ఈ కథలో ప్రాంతాలవారీగా ఎన్ని పాఠాంతరాలున్నప్పటికీ ఎల్లమ్మకూ, మాదిగవారికీ దగ్గరి సంబంధం, ఆమెను వారు కాపాడుకున్నవైనం అన్ని కథల్లోనూ ప్రధానాంశంగా కనిపిస్తుంది. రేణుకాదేవి, జమదగ్ని, పరశురాముడు పితృస్వామిక వ్యవస్థలో పురుషాధిపత్యం, స్త్రీలకు కర్మ, జ్ఞానాధికారాలను నిరాకరించడం, వారి ప్రవర్తనపై నియంత్రణ సాధించడం అనేవి రేణుకాదేవి విషయంలో జరిగాయి. ఆమె లైంగికతపై నియంత్రణ సాధించే క్రమంలో ఆమె శీలాన్ని అనుమానించి శృంగార దృశ్యాలను చూసినంత మాత్రానే ఆమె అపవిత్రమైపోయిందనే శంకతో ఏకంగా రేణుక భర్త జమదగ్ని ఆమె తలను నరికి వెయ్యాలని ఆజ్ఞాపించడమనేది పితృస్వామ్య వ్యవస్థ లక్షణం. ఈ కథలో రేణుకాదేవి తల ఎగిరి దళితవాడలో పడగా, ఆమెను వారు స్వీకరించడం లేక పరశురాముడి వేధింపులు భరించలేక రేణుక దళితవాడలో తలదాచుకోవడం అనేవి సహజమైన పరిణామాలు. అనార్య సంస్కృతికి చెందిన దళితజాతులకు మాతృస్వామిక లక్షణాలు, స్త్రీలను గౌరవించే సంప్రదాయం ఉండబట్టే ఆ మాదిగ వారు రేణుకను సాదరంగా కాపాడుకోవడమే కాక ఆమెను తమ కులదైవంగా స్వీకరించడమనేేది అనార్య సంస్కృతికి చిహ్నం.
ఆర్య సంస్కృతికి ప్రతీక పరశురాముడు
పరశురాముడు ఆర్య సంస్కృతికి పితృస్వామ్య వ్యవస్థకు, రాజ్యానికి ప్రతినిధిగా కనిపిస్తాడు. అతడు తన తల్లి రేణుక విషయంలో కొడుకుగా కాక ఒక పురుష దురహంకారిగా కనిపిస్తాడు. పరశురాముడు రేణుక శీలాన్ని శంకించడమే కాకుండా ఆమె పారిపోయినప్పుడు ఆమెను వెంటాడి వేధించే వాడిగా, ఎల్లమ్మ కథలో దర్శనమిస్తాడు. ఈ కథలో రేణుకకు ఆశ్రయమిచ్చిన వారిని స్త్రీలుగా చిత్రించడం, మాదిగ స్త్రీ అందివ్వగా పరశురాముడు నమిలి ఉమ్మిన తాంబూలం నుండి బైండ్లవారు పుట్టినప్పటికీ వారిని తండ్రివైపు నుండి కాక తల్లివైపు నుండి గుర్తించడం అనేవి కూడా అనార్య దళిత జాతుల్లో వుండే మాతృస్వామిక లక్షణాలను సూచిస్తాయి.
అనార్య, ఆదివాసీ తెగలపై ఆధిపత్య ఆర్యసంస్కృతి ఎంతగా రుద్దబడినప్పటికీ ఆయా తెగలు తమ సంస్కృతి చిహ్నాలను కాపాడుకునే క్రమంలో కళారూపాలను సృష్టించుకోవడం, ఆ కళల తీరు భావజాలాన్ని ప్రతిబింబించడం జరుగుతుంది. ఈ క్రమానికి ఎల్లమ్మ కథ ప్రతీకగా నిలుస్తుంది. సామాజిక పరిణామక్రమంలో దళిత జాతుల సంస్కృతీకరణకు గురైనప్పటికీ అచ్చమైన దళిత సంస్కృతి ఒకప్పుడు ఉండేదనడానికి ఈ కథ సాక్ష్యం. ఈనాడు అన్ని సామాజిక వర్గాలు సంప్రదాయంగా మాత్రమే ఉండేది. ఎల్లమ్మవంటి గ్రామదేవతలను వెనుకబడిన ప్రాంతాల్లోని దళిత కులాలు కులదైవంగా పూజించడం, ఆడపిల్లలకు 'రేణుక', 'ఎల్లమ్మ' అనే పేర్లు పెట్టడం కొనసాగుతుంది. మధ్యయుగాల్లో ఈ కథను బైండ్ల స్త్రీలు ప్రదర్శిస్తూ ఉండేవారని చారిత్రక ఆధారాలున్నాయి. ప్రస్తుతం ఎల్లమ్మ కథను బైండ్ల పురుషులు ప్రదర్శించడం యాదృచ్చికం కాదు. కాలక్రమంలో దళిత సంస్కృతిలో పెంపొందిన పురుష ప్రాధాన్యత ఇందుకు కారణం. కాబట్టి అగ్రకుల పురుషదురహంకారాన్ని, ఆధిపత్యధోరణిని వ్యతిరేకించే దళిత స్త్రీలే ప్రారంభంలో ఎల్లమ్మ కథను రూపొందించి ఉంటారని భావించవచ్చు.
ద్వంద్వ నీతి
జమదగ్ని, పరుశరాముడు పాత్రల చిత్రీకరణలో శిష్టుల లిఖిత సాహిత్యానికి, జానపదుల మౌఖిక సాహిత్యానికి భేదం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. శిష్టసాహిత్యంలో జమదగ్ని మహాముని అని, కర్మకాండలపట్ల నియమనిష్టలు కలవాడు అని చిత్రిస్తూ, మతపరమైన పూజాధికాలపై అతనికున్న అచంచల గౌరవం, నిష్ఠల కారణంగానే అతడు భార్య చిత్తచపలత్వానికి ఆగ్రహించి, ఆమె తలను ఖండించవలసిందిగా ఆజ్ఞాపించడం, తర్వాత పితృవాక్య పరిపాలన గావించిన పరశురాముడిని అభినందించి అతని కోరిక మేరకు తిరిగి రేణుకను బతికించడం మొదలైన సంఘటనలన్నీ శిష్ఠసాహిత్యంలో గొప్పవిషయాలుగా చిత్రీకరించబడ్డాయి. శిష్టసాహిత్యం పరశురాముడి విషయంలో కూడా ద్వంద్వ నీతిని పాటిస్తుంది. ఒకవైపు అతనిని పితృవాక్య పరిపాలకునిగానూ, మరోవైపు అతనికి తల్లిపట్ల ఉన్న మమకారం కారణంగానే తండ్రి నుండి వరం పొంది తిరిగి ఆమెను బతికించుకున్నట్టు ఆ సాహిత్యం పేర్కొంది. 'పతిభక్తి', 'దేశభక్తి', 'పితృవాక్య పరిపాలన', 'మాతృభక్తి' వంటి భావాలను ప్రచారం చెయ్యడం అనేది రాజాస్థానాల్లో వర్థిల్లిన శిష్టసాహిత్య లక్షణం.
కానీ బైండ్ల మౌఖికసాహిత్య రూపమైన ఎల్లమ్మ కథలో ద్వంద్వ ప్రవృత్తి కనిపించదు. వారి ప్రకారం జమదగ్ని, పరశురాముడు పాత్రలు ఏ విధంగాను పాజిటివ్గా ఉండవు. బైండ్ల కథలో వీరిద్దరూ అగ్రవర్ణ పురుష దురంహాంకారులుగానూ, రేణుకాదేవి ఆచారాలు, సంప్రదాయాల పేరున పురుష దాష్ఠీకానికి బలైపోయిన స్త్రీగానూ కనిపిస్తుంది. స్త్రీ స్వాభిమానాన్ని భవనీలు గుండెలకు హత్తుకోవడం ద్వారాఎల్లమ్మను కులదైవంగా భావించడం, రేణుకాదేవి పేరును ఎల్లమ్మగా మార్చి ఆమె కథను గానం చెయ్యడం అనేవి దళిత సమూహాలు తమ సంస్కృతీ చిహ్నాలను ఇంకా పదిలంగా కాపాడుకోవడంలో భాగంగానే చూడాలి. అంతేకాక ఒకానొక చారిత్రక సందర్భంలో ఆర్య, అనార్య తెగల మధ్య నెలకొన్న సాంస్కృతిక వైరుధ్యానికి, భావసంఘర్షణకూ ఎల్లమ్మ కథ ప్రతీక. ఆ కథను కళారూపంగా మలచుకొని తరాల నుండీ జవజీవాలతో కాపాడుకుంటూ వస్తున్న బైండ్ల వారిని నిజమైన తాత్వికులుగానూ, సమాంతర సాహితీవేత్తలుగానూ గుర్తించక తప్పదు.
Authorization