జనం.. జనం.. ఒకటే జనం.. చీమలపుట్టలు పగిలి బయట కొచ్చినట్టు బారులు.. బారులు.. ఇసుకేస్తే రాలనంతగా రద్దీ... బండెనక బండి... వందలాది బండ్లు... గజ్జెల లాగుల ఘల్ఘల్ శబ్దాలు.. భేరీల మోతలు.. డోలు దరువులు, కటారు విన్యాసాలు.. భక్తుల పూనకాలు.. జయజయ ధ్వానాల మధ్య హోరెత్తే గొల్లగట్టు.. నెత్తిన గంపలతో మహిళలు, అలంకరించిన గొర్రెలతో పురుషులు 'ఓ లింగా.. ఓ లింగా' నామస్మరణ హోరులో పరవశించి ఊగిపోతారు. ఇది రెండేళ్లకోసారి అంగరంగ వైభవంగా జరిగే పెద్దగట్టు జాతర దృశ్యం! తెలంగాణలో అతి పెద్ద జాతర్లలో ఒకటిగా పేరుపడ్డ ఈ జాతర విశేషాల సమాహారమే ఈ ప్రత్యేక వ్యాసం.
సూర్యాపేట జిల్లా కేంద్రానికి ఐదు కిలోమీటర్ల దూరంలోని 65వ నెంబర్ జాతీయ రహదారిపై చివ్వెంల మండలం దురాజ్పల్లి వద్ద రోడ్డుపక్కనే పెద్దగట్టు గుట్టపై వెలిసిన లింగమంతుల స్వామి జాతర రెండేళ్లకోసారి జరుగుతుంది. దీనిని దురాజ్పల్లి జాతరనీ, లింగమంతుల జాతరనీ, పెద్దగట్టు జాతరనీ, గొల్లగట్టు జాతరని కూడా పిలుస్తుంటారు. ఐదు రోజుల పాటు జరిగే ఈ జాతరకు తెలుగురాష్ట్రాల్లోని భక్తులే కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్ఘడ్, తమిళనాడు. ఒడిశా, కర్నాటక, రాష్ట్రాల నుండికూడా సుమారు 30లక్షల మంది హాజరవుతారు. అన్నికులాల వారు ఈ జాతరలో పాల్గొంటున్నప్పటికీ, ఈ జాతర ప్రధానంగా యాదవ కులస్తులే ఎక్కువగా వస్తారు. లింగమంతుల స్వామి వారి ఇష్టదైవం కావడమే ఇందుకు కారణం. దీనిని దేశంలోనే యాదవులకు గల ఏకైక జాతరగా కూడా భావిస్తారు. యాదవులు సహజంగా శ్రీకృష్ణుడిని పూజిస్తారు. కానీ ఇక్కడ శివుడిని ఆరాధ్యదైవంగా భావించడం విశేషం. విభిన్న సంస్కృతుల సమ్మేళనానికి నిదర్శనం ఈ జాతర. ఈనెల 10న దిష్టిపూజతో జాతర కార్యక్రమం ప్రారంభమైయింది. అయితే ప్రధాన జాతర మాత్రం 24 నుంచి 28వ తేదీ వరకు ఐదు రోజులపాటు జరుపుకుంటారు.
పెద్దగట్టు..చారిత్రక నేపథ్యం
పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతరకు సుమారు 200 ఏండ్లకు పైగా చరిత్ర ఉన్నట్టు చరిత్రకారులు చెబుతున్నారు. అంతకు ముందు ఉండ్రుగొండ సమీపంలోని గట్టుపై ఈ జాతర జరిగేదని తెలుస్తోంది. క్రీ.శ. 11వ శతాబ్దంలో రాష్ట్రకూట వంశానికి చెందిన ధ్రువుడు అనే రాజు తన పేరిట ఇక్కడ ఒక గ్రామాన్ని నిర్మించాడని, ఆయన పేరిటే ఈ గ్రామం దురాజ్పల్లిగా పేరొందినట్టు కొందరి వాదన. కానీ చరిత్రకారులు మాత్రం ప్రస్తుతం పూజలందుకుంటున్న విగ్రహాలకు 200 సంవత్సరాల వయస్సు ఉంటుందని చెబుతున్నారు. ఉండ్రుగొండ పరిసరాలను గమనిస్తే ఎన్నో ఏండ్ల చరిత్ర ఉండొచ్చని తెలుస్తోంది. జాతర విశేషాల గురించి స్థానిక పూజారి మట్టా చక్రయ్య మాత్రం తమ ముత్తాతల కాలం నుంచి మా వంశీకులు జాతరలో పూజారులుగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. దీనిని బట్టి జాతరకు వందల ఏండ్ల చరిత్ర ఉంటుందని అర్థమవుతుంది. ఈ నేపధ్యంలో లింగమంతుల చరిత్ర, జాతర తదితర అంశాలపై అధ్యయనం చేసేందుకు 2009లో లింగమంతుల అధ్యయన పీఠం ఏర్పాటైంది. లింగమంతుల స్వామి కాలం, సమయం, జాతర నేపథ్యం, ఆధారాలు, విశేషాలు తదితర అంశాలపై పీఠం అధ్యనం చేస్తోంది.
ఆలయ నిర్మాతలు వీరే..
1981కి ముందు పెద్దగట్టు జాతరను ఈ ప్రాంత వెలమదొరలు నిర్వహించారు. ఆ తర్వాత 1982 నుంచి యాదవ కులస్తుల ఆధీనంలో ఈ జాతర జరుగుతోంది. పెద్దగట్టుపై కొత్త ఆలయాలు నిర్మించారు. గతంలో ఇక్కడ రెండు చిన్న గుడులు మాత్రమే కనిపించేవి. వీటిని కొన్నేళ్ల కిందట పెద్దగట్టు సమీపంలోని కాసారం గ్రామానికి చెందిన గొర్ల లింగమరెడ్డి, మెంతబోయిన భిక్షం యాదవ్ అనే ఇద్దరు లింగమంతుల స్వామి భక్తులు నిర్మించినట్టు చెబుతారు.
ఐదు రోజుల జాతర
లింగమంతుల జాతర ఐదు రోజుల పాటు జరుగుతుంది. ఒక్కోరోజుకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. పుష్యమాస అమావాస్య ఆదివారం రోజు దిష్టిపూజతో జాతర ఏర్పాట్లు ప్రారంభమవుతాయి. ఆ రోజున తల్లి, పిల్ల గొర్రెను గట్టుపై బలిస్తారు. దీనినే బలిపూజ అనికూడా అంటారు. తిరిగి మాఘశుద్ధ పౌర్ణమికి అటుఇటుగా వచ్చే ఆదివారం జాతర మొదలవుతుంది. శనివారం మధ్యాహ్నం నుంచి మూలవిరాట్లకు అలంకరణ మొదలవుతుంది. వరంగల్ జిల్లా తొర్రూరు మండలం చీకటాయపాలెం నుంచి యాదవ పూజారులు దేవరపెట్టెను పల్లకిలో తీసుకురాగా, సూర్యాపేట నుంచి మకరతోరణం ఇతర ఆభరణాలు గుట్టకు తీసుకొచ్చి అలంకరిస్తారు.
తొలిరోజు గంపలు వెళ్లదీత : తొలిరోజు జాతర హడావిడి మొదలవుతుంది. వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడకువచ్చే భక్తులు రాత్రి తమ ఇండ్లలో గంపలు వెళ్లదీసే కార్యక్రమానికి శ్రీకారం చుడతారు. వెదురుగంపల్లో స్వామివారికి పెట్టే పదార్థాలు పెట్టుకుని పూలతో అలంకరించిన బుట్టలు నెత్తిన ధరించి సంప్రదాయ ఆయుధాలు తీసుకుని ఎవరికివారు తమ వాహనాల్లో రాత్రి లోపే గుట్ట వద్దకు చేరుకుంటారు.
రెండో రోజు పోలుముంతలు : జాతరలో రెండో రోజు ప్రత్యేకమైంది. యాదవ పూజారులు పోలు ముంతలు, బొట్లు, కంకణాలు తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు. మహిళలు తెల్లవారుజామునే బోనం వండుకుని లింగమంతుల స్వామికి నైవేద్యం సమర్పిస్తారు. ఇదే రోజున జంతుబలి కొనసాగుతుంది. ఈ రోజున భక్తులు పెద్దఎత్తున సందర్శిస్తారు.
మూడోరోజు చంద్రపట్నం : మూడో రోజున చంద్రపట్నం వేస్తారు. బియ్యంపిండి, పసుపు కలిపిన పదార్ధంతో ఆలయం ఎదుట ముగ్గు వేస్తారు. నాలుగు వైపులా గురుగులు ఏర్పాటు చేసి దీపాలు వెలిగిస్తారు.
నెలవారంగా నాలుగోరోజు: నాలుగోరోజును 'నెలవారం'గా భావిస్తారు. దేవరపెట్టెను తొలగిస్తారు. ఈ దేవరపెట్టె దిష్టిపూజ రోజున ఇక్కడకి చేరుకుంటుంది. తొలగించిన అనంతరం సమీపంలోని కేసారం గ్రామానికి తరలిస్తారు. అక్కడ నుండి తిరిగి చీకటాయపాలెంకు తీసుకెళతారు. తిరిగి వచ్చే జాతర సమయంలో ఈ పెట్టెను మళ్ళీ పెద్దగట్టుకు తీసుకొస్తారు.
ఐదోరోజు మకరతోరణం తొలగింపు : జాతరలో చివరిరోజైన ఐదవరోజున మకరతోరణం తొలగిస్తారు. మూలవిరాట్ల అలంకరణకు ఉపయోగించే ఈ ఆభరణం మొసలి, సింహం తలభాగం కలిగిన ఆకృతితో చెక్కి ఉండటం గమనార్హం. ఈ రోజుతో జాతర ముగిసినట్టుగా భావిస్తారు.
స్త్రీ, పురుషులకు ప్రత్యేక వేషధారణ
పూర్వకాలం నుండి తమకు, తమ గోసంపదకు రక్షకుడిగా నిలిచిన లింగమంతుడిని స్త్రీ, పురుషులు భక్తి శ్రద్ధలతో ఆరాదిస్తారు. జాతరకు వచ్చే సందర్భంలో యాదవులు ప్రత్యేక వేషాలను ధరించి, డోలు వాయిద్యాలతో గుట్ట వద్దకు చేరుకుంటారు. పురుషులు ఎరుపురంగు బనీయన్, గజ్జెల నిక్కరు ధరించి కాళ్లకు గజ్జెలు కట్టుకుని కటారులు (ప్రత్యేకమైన తల్వార్లు) చేతుల్లో పట్టుకుని డోలు వాయిద్యాలు, తాళాల శబ్ధాల నడుమ అడుగులు కదుపుతూ 'ఓ లింగా..ఓ లింగా' అంటూ హోరెత్తిస్తారు. మహిళలు తడిబట్టలతో పసుపు, కుంకుమ, పూల దండలు, ఆగరొత్తులతో అలంకరించిన మందగంపను నెత్తిన పెట్టుకుని పురుషులను అనుసరిస్తారు. ఇంట్లోని ఆడపిల్లలు, సంతానం లేని మహిళలు బోనం కుండ ఎత్తుకోవడం ఇక్కడి ఆచారం. గొర్రెపోతును నీళ్లతో శుభ్రం చేసి పూలమాలతో అలంకరించి గుట్టఉన్న దిక్కు ఒదిలేస్తారు. అప్పుడు అది జడతాయించడంతో దానిని వారివెంట దేవుని వద్దకు తీసుకెళతారు. జడతాఇస్తేనే స్వామి మెచ్చాడని యాదవులు నమ్మకం. జడతాయించకపోతే మరో గొర్రెపోతును తీసుకొస్తారు.
ఉండ్రుగొండ నుంచి దురాజ్ పల్లికి
దురాజ్పల్లి సమీపంలో ఉండ్రుగొండ అనే గ్రామం ఉంది. దీని శివారులో పెద్ద అటవీప్రాంతం ఉంది. ఎత్తైన ఏడు గుట్టలు ఉన్నాయి. ఇక్కడ శైవ, వైష్ణవ మతాలు వర్థిల్లినట్టు తెలిపే ఆనవాళ్లు ఉన్నాయి. చాళుక్యుల కాలంలో ఈ ప్రాంత సామంతరాజు ఉండ్రుగొండ దుర్గాన్ని నిర్మించుకున్నట్టు పూర్వీకుల కథనం. ఇది శత్రుదుర్భేధ్యమయిన ప్రాకారాలతో, ఎత్తైన ప్రదేశంలో నిర్మితమైంది. నాటి చిహ్నాలు కొన్ని నేటికీ గుట్టపై కనిపిస్తాయి. కాల క్రమేణా దుర్గం శిథిలమై పశువులు, గొర్రెల కాపర్ల సంచార ప్రాంతంగా మారింది. తెలంగాణా సాయుధ పోరాట కాలంలోనూ కమ్యూనిస్టులకు ఇది షెల్టర్జోన్గా ఉండేదని చెబుతున్నారు. ఇక్కడ రాతి కట్టడాల మధ్యన కోనేరు నిర్మితమై ఉంది. ప్రస్తుతం దురాజ్పల్లి సమీపంలో జరిగే లింగమంతుల జాతర గతంలో ఉండ్రుగొండకు సమీపంలోని పెద్దగట్టుపై జరిగేది. ఓ గర్భిణి గుట్టఎక్కలేక జారిపడి చనిపోవడంతో అక్కడి నుంచి దురాజ్పల్లి గట్టుకు మారిందని తెలుస్తోంది.
దేవరపెట్టె వెనుక ఉన్న కథ...
ఈ జాతరలో దేవరపెట్టెకు ఓ ప్రత్యేకత ఉంది. ఈ పెట్టె ప్రస్తుత మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని చీకటాయపాలెం గ్రామంలోని తండ పుల్లయ్య కుటుంబం వద్ద ఉంటుంది. జాతరకు పది రోజుల ముందు గ్రామస్థులు గ్రామంలో ఊరేగింపు చేసి సంప్రదాయపద్దతిలో గ్రామం దాటించి ఈ పెట్టెను సూర్యాపేట జిల్లా కేసారానికి పంపుతారు. ఈ పెట్టెలో 33 ఉత్సవ విగ్రహాలు ఉంటాయి. మూలవిరాట్ విగ్రహాలు అయిన లింగమంతులు, పాలచర్లయ్య, చౌడేశ్వరి, గంగ విగ్రహాలు మాత్రం గుడిలోనే ఉంటాయి. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లోని పోతురాజు, యలమంచమ్మ, ఆకు మంచమ్మ, పోతులింగాలు తదితర గ్రామ దేవతల విగ్రహాలు మాత్రం దేవరపెట్టెలో ఉంటాయి. ప్రతి రెండేండ్లకోసారి నిర్వహించే జాతరకు చీకటాయపాలెం నుంచి విగ్రహాలు తీసుకెళ్లి జాతర అనంతరం తీసుకురావడం ఆనవాయితీ. ఈ పెట్టె కేసారంలోని కులపెద్దకు చేరడానికి ముందు ఆలయంలో దిష్టిపూజ అనే క్రతువు నిర్వహిస్తారు. అప్పుడు వరపెట్టె కేసారం గ్రామంలోని ఆ కుల పెద్ద ఇంటి నుండి జాతర మొదటి రోజు ఉదయాన్నే దేవరపెట్టెను ఊరేగింపుగా ఆలయానికి తీసుకెళతారు.
ప్రత్యేక ఆకర్షణగా శివుని కళ్యాణం...
ఇక్కడ జరిగే శివుని కల్యాణంపై ప్రచారంలో ఉన్న మరో కథ...పూర్వం దురాజ్పల్లి గ్రామంలో కోయరాజు ఉండేవాడు. అతనికి ఐదుగురు కుమారులు, అంతులేని సంపద, ఆరు లక్షలమంది సైన్యం ఉండేది. కానీ, కూతురు పుట్టలేదనే వ్యథ రాజుకు ఉండేది. ఈ క్రమంలో శివుడిని ప్రార్థించగా ''నీకు కూతురిని ప్రసాదిస్తాను. కానీ ఆమెను నాకే ఇవ్వాలి'' అని శివుడు చెప్పినట్టు అంటారు. ఇందుకు రాజు ఒప్పుకున్నాడని, కూతురు జన్మించిందని ప్రచారంలో ఉంది. కూతురు పెరిగి పెద్దదైన తరువాత తనకూతురిని శివుడికి ఇవ్వాలనే ఆలోచన రాలేదు. దీంతో ఆగ్రహించిన బ్రహ్మ ఓ పందిని సృష్టించి గ్రామం మీదికి వదిలాడు. అది పశువులు, ప్రజలపై దాడి చేస్తూ ప్రాణాలు తీసేదని, దీనిని అంతం చేయడానికి రాజు ఐదుగురు కుమారులు తీవ్ర ప్రయత్నం చేసి విఫలమయ్యారు. దీంతో రాజు కుమార్తె మాణిక్యమ్య ఆ పందిని తాళ్లతో బంధించి తీసుకెళ్తుండగా శివుడు వచ్చి ఆమెను తీసుకెెళ్లి వివాహం చేసుకున్నాడని ప్రచారంలో ఉన్నది. ఇదే ఆనవాయితీగా ఇక్కడ శివుని కళ్యాణం రెండేండ్లకోసారి నిర్వహించడం విశేషం.
నైవేద్యం
పెద్దగట్టు జాతరలో లింగమంతుడు సహా చౌడేశ్వరి (చాముండేశ్వరి), గంగాభవాని, యలమందమ్మ, ఆకుమంచమ్మ, మాణిక్యాలదేవి పూజలందుకుంటున్నారు. వీరిలో లింగమంతుడు శాకాహారి కావడంతో ఆయనకు పప్పు, పాయసం నైవేద్యం సమర్పిస్తారు. తక్కిన దేవతలకు మేకలు, గొర్రెలు బలి ఇచ్చి సంతృప్తి పరుస్తారు.
అన్నా చెల్లెళ్ల అనుబంధం...
పెద్దగట్టు జాతర అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలుస్తుంది. జాతర సందర్భంగా ప్రతి చెల్లీ తన అన్నను, ప్రతి అన్నా తన చెల్లిని ఈ జాతరకు ఆహ్వానిస్తారు. జాతర సందర్భంగా ప్రతి అన్నా తన చెల్లెలుకు జాతరలో గాజులు కొనివ్వడం ఏండ్ల తరబడి వస్తున్న సంప్రదాయం. ఇలా చేస్తే తన కాపురం చల్లగా ఉంటుందని భావిస్తారు. లింగమంతుల స్వామి ఆలయం దక్షిణవైపున ఉన్న చెరువువద్ద చౌడమ్మదేవత, ఆకుమంచమ్మ ఆలయాలు, నారింజచెట్టు, పెద్దపుట్ట ఉన్నాయి. అక్కడికి వెళ్లి మొక్కులు చెల్లించుకుంటారు.
ఆదాయంలో మాకూ
వాటా కావాలి
కాలక్రమంలో అక్కడి ఆలయం దేవాదాయశాఖ పరిధిలోకి పోయింది. కోట్ల రూపాయల ఆదాయం ప్రభుతానికి జాతర వల్ల వస్తుంది. మాకున్న హక్కు ప్రకారం ఆదాయంలో వాటా కల్పించాలి. తరతరాలుగా మా వంశస్థులం ఇదే జాతరపై ఆధారపడి బతుకుతున్నాం. మాకు సరైన న్యాయం జరగట్లేదు. మాకు రానుపోను బస్సు చార్జీలు, తదితర ఖర్చులు ఇచ్చి పంపిస్తున్నారు. మాకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చూడాలి.
జాతరకు ఎట్టాబోవాలంటే..!
హైదరాబాద్-విజయవాడ 65వ నెంబర్ జాతీయ రహదారిపై దురాజ్పల్లి గ్రామం(లింగమంతుల స్వామి ఆలయం)ఉంది. హైదరాబాద్ నుండి సూర్యాపేటకు చేరుకుంటే బస్టాండు నుంచి అయిదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. జాతర సందర్భంగా ప్రత్యేక బస్సులుంటాయి. ఇతర ప్రయివేటు వాహనాలు కూడా ఉంటాయి.
Authorization