ప్రపంచంలో సంపదకు మూలం మానవ శ్రమ అనేవిషయంలో ఎవరికీ అనుమానం అవసరంలేదు.అయితే ఆధునిక అర్థశాస్త్రం ఉత్పత్తి క్రమంలో మానవ శ్రమను ఒక గుదిబండగా భావించడం కనిపిస్తుంది. అందుకే యాంత్రికీకరణ (ఆటోమేషన్) ప్రోత్సహిస్తోంది. యజమానికి శ్రమ అనేది ధర చెల్లించి కొనుక్కునే సరుకు. ఉత్పత్తిప్రక్రియను సాధ్యమైనంత ఎక్కువ యాంత్రికీకరణకు గురిచేసి తక్కువ మానవ శ్రమను ఉపయోగించుకొని ఎక్కువ లాభాలు గడించాలని చూస్తాడు. ఇప్పుడు జరుగుతున్న తంతు అదే ఇది తప్పని.. తక్కువ వనరుల్ని ఉపయోగించుకుని ఎక్కువ ఉత్పత్తిని సాధించి మానవ శ్రమను వాడుకోవడం ద్వారా అందరికీ పనిని కల్పించడం, తద్వారా కనీస అవసరాలను తీర్చడం ఎట్లాగో చెబుతుంది బుద్ధిస్ ఎకనామిక్స్. అదే సమయంలో సంస్కృతి క్షీణించకుండా ఎట్లా నిలబడుతుందో కూడా వివరిస్తోంది ఈ అర్థ శాస్త్రం.
బౌద్ధతత్వం ఉత్పత్తి ప్రక్రియను మూడు దశల్లో చేయాలని నిర్దేశిస్తుంది. మొదటిది ముందుగా మనిషికి తన శక్తి సామర్థ్యాలను పూర్తిగా ఉపయోగించి అభివృద్ధి చేయడానికి అవకాశం ఇవ్వాలి. రెండోది; ఉమ్మడి లక్ష్యాన్ని సాధించడం కోసం తన అహం వదిలి మిగతా వారితో కలిసి పనిచేయడం ఎలాగో తెలుసుకునేలా చేయాలి; తరువాత దశలో కావలసిన వస్తుసేవలు సాకారం అవుతాయి. ఇదే సమయంలో పని, విశ్రాంతి రెండూ అవసరమే. ఒకటి లేకుండా మరొకటి సాధ్యం కాదు. మానవ జీవితంలో ఈ రెడింటిలో ఏది ఎక్కువ అయినా అది అర్థరహితమవుతుందని చెబుతున్నది ఈ ఫిలాసఫీ.
బౌద్ధం వెలుగులో రెండు యాంత్రికీకరణ రకాలు కనిపిస్తాయి. ఒకటి మనిషి కౌశలాన్ని, శక్తిని పెంచేదయితే మరోటి మనిషిని యంత్రానికి బానిసగా మార్చేది. మరి వీటి మధ్య తేడాను గుర్తించేది ఎట్లా? పనిచేసేవాడు ముందుగా ఒక మనిషి అని గుర్తించాలి. ఆ తరువాతే కార్మికుడు కదా. అతడికి పశ్చిమదేశాల్లోని ఆధునిక పోకడలూ తెలుసు. తూర్పు దేశాల్లోని సంప్రదాయ పద్ధతులూ తెలుసు. ఒక యంత్రానికి, ఒక పరికరానికి మధ్య ఉన్న తేడాలు కూడా అతడు గ్రహించగలడు. ఉదాహరణకు నేత కార్మికులనే చూడండి. చేనేత మగ్గంపై ఒక వస్త్రం నేయడానికి అతడు ఎంతో శ్రమపడతాడు. ఒక మగ్గంపై ఇద్దరు ముగ్గురు పనిచేయవలసి ఉంటుంది. తన నైపుణ్యాన్ని ఉపయోగించి అద్భుతమైన వస్త్రాలు, రకరకాల డిజైన్లలో నేయడానికి నేత కార్మికునికి అవకాశం ఉంటుంది నేత మగ్గంపైన. ఇక్కడ మగ్గం అనేది ఓ పరికరం మాత్రమే. అదే పవర్ లూంని చూడండి. పవర్ లూం మొత్తం మనిషి చేయాల్సిన పనిని అదే చేస్తుంది. అంటే మానవ సంస్కృతిని, వృత్తి కౌశలాన్ని అది నాశనం చేస్తున్నదన్నమాట! బౌద్ధ అర్థశాస్త్రం ఆధునిక భౌతికవాద అర్థ శాస్త్రం కన్నా ఎంతో విభిన్నమైనది. నాగరికతా సారాన్ని బుద్ధిస్టులు అపరిమితంగా పెరిగిపోతున్న మానవ కోరికల్లో కాక వారి హృదయ (క్యారెక్టర్)ప్రక్షాళనలో చూస్తారు. క్యారెక్టర్ అనేది మనిషి చేసే పనులను బట్టి నిర్ణయం అవుతుందనేది కూడా ఇక్కడ గమనార్హం. మనిషి సేచ్ఛకు, గౌరవ మర్యాదలకు భంగం కలుగని పరిస్థితుల్లో పనిచేసేవారికి, ఉత్పత్తి అయిన వస్తువులకు సమానమైన ఆశీస్సులు ఉంటాయని బుద్ధిజం చెబుతుంది.
ఒక క్రమ పద్ధతిలో, అన్వయాలతో చేసేపని ఉంటే, దాని ఫలితాలుకూడా ఫలవంతంగా ఉంటాయి. మంచి ఆహారం శరీరానికి ఎటువంటి మేలు చేస్తుందో సరైన పని పరిస్థితులు ఉత్పత్తికి అటువంటి మేలు కలిగిస్తాయి. మంచి పని వాతావరణం మనిషిలోని అంతర్గత సామర్థ్యాలను వెలికి వచ్చేలా చేస్తుంది. ఒక పద్ధతి ప్రకారం మనిషిలోని మృగత్వాన్ని పారదోలి అతడి సామర్థ్యాలను సేచ్ఛగా ఉపయోగించి ఉన్నత విలువలు, వ్యక్తిత్వాన్ని ఈ వాతావరణం కలుగజేస్తుంది అంటాడు ప్రముఖ భారతీయ తత్వవేత్త , ఆర్థికవేత్త అయిన జె.సి. కుమారప్ప.
మనిషికి నిజంగా పనిచేసే అవకాశం లేకపోతే అతడి శారీరక, మానసిక ఎదుగుదలకు అవకాశం లేనట్లే. అందుకే పనిచేయగలిగిన ప్రతి ఒక్కరికి పని కల్పించడమంటే ఒక ఉన్నతమైన సమాజాన్ని సృష్టించడమనే అర్థం.
మెటీరియలిస్టులు వస్తువులపై ఎక్కువ శ్రద్ధ చూపిస్తే బుద్ధిస్టులు నిర్వాణం (మోక్షం) మీద ఎక్కువ ఆసక్తి చూపుతారు. బుద్ధిస్టులు మధ్యేమార్గాన్ని అనుసరించేవారు. అందువల్ల వారు సౌకర్యవంతమైన భౌతిక జీవితానికి వ్యతిరేకులు కాదు. నిర్వాణానికి సంపద అడ్డుకాదు. సంపదతో ఉండే బంధం (ఎటాచ్మెంట్ ) మాత్రమే అడ్డు. సుఖాన్నిచ్చే వస్తుసంపదను అనుభవించడం తప్పుకాదు. ఆ వస్తువులకోసం వెంపర్లాడటమే తప్పు. నిరాడంబరత, అహింస బుద్ధిస్ట్ అర్థశాస్త్రం ప్రాథమిక సూత్రాలు. సూక్ష్మ పరిమాణంలో జరిగే ఆర్థిక కార్యకలాపాలు కలిసి ఓ పెద్ద ఆర్థిక వ్యవస్థ సాధించగలిగిన అద్భుతమైన ఫలితాలను సాధిస్తాయని బుద్ధిస్ట్ ఎకానమిస్టులు అంటున్నారు.
ఎంత అనుభవిస్తే అంత గొప్పా?
ఆధునిక ఆర్థికవేత్తలకు ఈ సిద్ధాంతం అంత తేలికగా అర్థం కాదనేది వీరి భావన. ఆధునిక అర్థశాస్త్రవేత్తల ద్రష్టిలో సంవత్సరం మొత్తం మీద ఎన్ని ఎక్కువ వస్తు సేవలను ఉపయోగించుకుంటే అంత మంచి జీవితాన్ని లేక 'జీవన ప్రమాణా'న్ని కలిగిఉన్నట్లు లెక్క.. అంటే మనిషి ఉపయోగించుకునే వస్తుసేవల పరిమాణాన్ని బట్టి ఆ మనిషి జీవన ప్రమాణాన్ని అంచనాకడుతున్నారన్నమాట! తక్కువ వస్తువులను వాడే వాడికన్నా ఎక్కువ వస్తువులు వాడేవాడు సుఖపడుతున్నట్లని వీరి భావన. బుద్ధిస్ట్ ఆర్థికవేత్తలు దీన్ని హేతురహితమైన అవగాహనగా కొట్టిపారేస్తున్నారు. వస్తు వినిమయం జీవిత సంక్షేమానికి పట్టుగొమ్మగా ఉండాలి. తక్కువ వినియోగంతో ఎక్కువ పరిమాణంలో సంక్షేమం కలగాలనేది బుద్ధిస్టుల అవగాహన. శరీరాన్ని ప్రకృతి శక్తుల (చలి, వేడి, గాలి) నుంచి కాపాడి, చూడటానికి ఆకర్షణీయంగా ఉండేటట్లు చేస్తే బట్టలను ధరించడంలోని లక్ష్యం నెరవేరినట్లే. అట్లాగే శరీరానికి కావలసిన పోషకాలను అందించి, ఆరోగ్యంగా ఉంచగలిగితే ఆహారం పని అయిపోయినట్లే. అదేవిధంగా గృహాలు కూడా. ఈ కనీస అవసరాలు తీర్చుకోవడానికి అవసరమైన వస్తువులకంటే వందల రెట్లు వినిమయం అవుతున్నాయి. అవసరమైన వాటికంటే ఎక్కువ వస్తువులను వాడుతున్నాం అంటే ఆ మేర ప్రకృతిని నాశనం చేస్తున్నట్లే కదా! అట్లాగే మానవ శ్రమను, సమయాన్ని వృధా చేస్తున్నట్లే కదా! పోనీ ఇంత శ్రమ, ప్రకృతి వనరులను ఉపయోగించినా జనం అందరి అవసరాలు తీరుతున్నాయా అంటే అదీ లేదు. నిజానికి ఈ అనవసర వినియోగాన్ని అరికట్టి తక్కువ ఖర్చుతో ఒక ప్రణాళిక ప్రకారం ఉత్పత్తి చేస్తే అందరి కనీస అవసరాలను తీర్చవచ్చని బుద్ధిజం చెబుతుంది. తక్కువ వినియోగం, తక్కువ ప్రకృతి వనరులవాడకంతో ఎక్కువ ప్రయోజనం పొందడం ఎట్లాగో బుద్ధిస్టులు చెబుతుంటే... వీలున్నన్ని ఎక్కువ వస్తువులను వాడటం ద్వారా విచక్షణారహితంగా ప్రకృతిని కొల్లగొట్టి భూ గ్రహాన్ని మానవులు నివసించలేని స్థితికి చేర్చే మాటలు చెబుతున్నారు మోడ్రన్ ఎకనమిస్టులు. ఉన్న సంపదను అందరూ సమానంగా అవసరమైనంత మేర వాడుకోవడాన్నే మార్క్సిజంకూడా ఉద్బోధిస్తోంది. పెట్టుబడిదార్లు మాత్రం వినియోగ సంస్కృతిని ప్రోత్సహిస్తూ లాభాలను మూటగట్టుకునే పనిలో ఉన్నారు.
Authorization