భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఇంకా మాతృస్వామ్య వ్యవస్థను కొనసాగిస్తున్న అతి కొద్ది ఆదివాసీ తెగల్లో ఖాసీ తెగ ఒకటి. బాగా అభివృద్ధి చెందిన తెగల్లోనూ ఇది ఒకటి. ఖాసీ ప్రజలు వ్యాపార వాణిజ్యాల్లో కుదురుకొని పట్టణాల్లో జీవించడం పెరిగింది. విద్యావిషయకంగా మిగతా తెగల కన్నా ఎక్కువ అభివృద్ధే సాధించారు. అఖిలభారత సర్వీసుల్లో వీరికి తగిన ప్రాతినిధ్యం ఉంది. ఒకప్పుడు అస్సాంలో ఉన్న సమైక్య ఖాసీ, జైంతియా కొండ జిల్లాలు 1972లో ఏర్పడ్డ మేఘాలయ రాష్ట్రంలో భాగమయ్యాయి. ఈ రెండు జిల్లాల్లో ఖాసీలు ఎక్కువగా జీవిస్తున్నారు. మేఘాలయలో ఖాసీలతో పాటు గారోలు, మరి కొన్ని చిన్న చిన్న తెగలు నివసిస్తున్నారు. ఈ రాష్ట్రంలో రాజకీయ ఆధిపత్యం కలిగి అధిక సాంఖ్యాకులుగా ఉన్నది మాత్రం ఖాసీలే.
ఖాసీలను ప్రధానంగా నాలుగు రకాలుగా విభజించవచ్చు. ఖాసీ కొండల్లోని షిల్లాంగ్ పీటభూమిలో నివసించేవారిని ఖన్రియాన్ ఖాసీలు లేదా ఎగువ ఖాసీలు; జైంతియా కొండల్లో జీవించే ఫార్ ఖాసీలు; పశ్చిమ, దక్షిణ లోయ ప్రాంతాల్లో నివసించే వార్ ఖాసీలు, దిగువ ప్రాంతాల్లో నివసించ ేభోరు ఖాసీలుగా విభజించవచ్చు. ఈ నాలుగు ప్రధాన వర్గాలు కాకుండా జైంతియా కొండల్లో నివసించే హెడెమ్ లను, ఖాసీ కొండల్లో నివసించే లింగాం లను ఖాసీలుగానే గుర్తించారు. ఈ అన్ని వర్గాలకు చెందిన ఖాసీలు తమ ప్రాంతానికి చెందని వారితో వివాహం చేసుకునే (బహిర్వివాహ) పద్ధతి అనుసరించడం వల్ల వాటిని ఉప తెగలుగా గుర్తించవలసి ఉంటుంది. ఖాసీలు నివసించే భూభాగం ప్రధానంగా నాలుగు పీఠభూములుగా ఉంటుంది. దిగువ మైదాన ప్రాంతాల కంటే పీఠభూములు ఎత్తుగా ఉంటాయి. ప్రపంచంలో అత్యధిక వర్షపాతం రికార్డయ్యే చిరపుంజి ప్రాంతం సముద్రమట్టం కంటే నాలుగువేల అడుగుల ఎత్తున ఈ పీఠభూముల్లోనే ఉంది. చిరపుంజికి ఉత్తరాన మన్ప్లాంగ్ దగ్గర మరో పీఠభూమి ఉంది. పీఠభూమిలో కొన్ని గ్రామాలు సముద్రమట్టానికి ఆరువేల అడుగుల ఎత్తున ఉన్నాయి. మేఘాలయ రాజధాని షిల్లాంగ్ ఈ ఎత్తయిన ప్రాంతంలోనే ఉన్నది. అత్యంత అందంగా ఉండే అడవులు ఇక్కడ పెరుగుతాయి. తోటలు, నదులు, సెలయేళ్లు, అడవి జంతువులతో కళకళ లాడుతూ ఉంటుంది ఈ ప్రాంతం.
ఖాసీలు మోన్ ప్రజల సంతతివారై ఉండవచ్చని భావిస్తున్నారు. భాషాపరంగా చూస్తే వారి భాష ఆస్ట్రిక్ భాషా కుటుంబంలోని మోన్-ఖ్మేర్ కుటుంబానికి చెందినది. ఈ కుటుంబానికి చెందిన ఏకైక తెగ ఖాసీలు ఒక్కరే. క్రైస్తవ ప్రచారం వల్ల ఎక్కువగా రోమన్ లిపిని వాడుతున్నా అక్కడక్కడా ఇప్పటికీ బెంగాలీ లిపిని వాడుతున్నారు.
ఖాసీ పదానికి ప్రత్యేకమైన అర్థం ఉంది. 'ఖా' అంటే పుట్టుక అని, 'సీ' అంటే 'ప్రాచీన మాత' అనీ అర్థం ఉంది. ఖాసీలు మాతృస్వామ్య వ్యవస్థను అనుసరిస్తారని ఈ పదం సూచిస్తుంది. వీరిలో సగానికి పైగా క్రైస్తవాన్ని స్వీకరిస్తే మిగిలినవారిలో కొందరు ఇస్లాంను, హిందు మతాలను స్వీకరించారు. ఏ మతాన్ని స్వీకరించనివారు తమ ప్రాచీన ఆచార సంప్రదాయాలనే అనుసరిస్తున్నారు.
నివాసాలు
ఖాసీ గ్రామాలు కొండ శిఖరాలకు కొద్దిగా దిగువన ఉండటం కనిపిస్తుంది. ఖాసీల ఇరుగు పొరుగున ఉండే నాగాలు, కుకీలు కొండ కొమ్ముల మీద గ్రామాలను నిర్మించుకుంటారు. ఖాసీలు మాత్రం కొండ కొమ్ముకు కొద్దిగా దిగువన కొద్దిగా లోతుగా ఉండే ప్రాంతాన్ని గ్రామ నిర్మాణానికి ఎంచుకుంటారు. సాధారణంగా ఖాసీలు తమ ఇండ్లను కట్టెలు, వెదురు గడలతోను, రాళ్లతోను నిర్మించుకుంటారు. ఈ ఇండ్లు కోడిగుడ్డు ఆకారంలో ఎత్తు తక్కువగా ఉండే పై కప్పుతో, చిన్న ప్రవేశ ద్వారంతో ఉంటాయి. భూ మట్టానికి సుమారు రెండడుగుల ఎత్తులో ఇండ్లు నిర్మించుకుంటారు. సాధారణంగా ఖాసీల ఇంటిలో వసారా భాగం, మధ్య భాగం, పడక గది భాగం అని మూడు భాగాలు ఉంటాయి. పడక గదిలో చలికాచుకునే ఏర్పాటు ఉంటుంది. సంపద పెరిగే క్రమంలో ఇండ్ల నిర్మాణంలో కూడా మార్పు వస్తున్నది. ఆధునిక బంగ్లాలూ వెలుస్తున్నాయి.
సమాజం
ఖాసీలు అనేక ఉప తెగలుగా విభజితమై ఉన్నారు. ప్రతి ఉపతెగ ఒక ప్రత్యేక ప్రాంతంలో నివసిస్తూ ఖాసీ మాండలికాన్నే కొద్ది తేడాలతో మాట్లాడుతుంది. కానీ ఉపతెగల సామాజిక, సాంస్కృతిక వారసత్వం ఉమ్మడిగానే ఉంటుంది. ఒక్కో ఉపతెగ మళ్లీ అనేక భాగాలుగా విభజితమవుతుంది. ఈ ఉప భాగాలను స్థానికంగా కుర్ అని వ్యవహరిస్తారు. ఈ కుర్లోనివారు బయటివారినే పెండ్లి చేసుకోవాలి. అంతర్వివాహాన్ని గట్టిగా నిషేధించారు. తమ తెగలోని వారిని వివాహం చేసుకోవడం మహా పాపంగా భావిస్తారు. ఈ తెగలు తమ పూర్వీకురాలు 'మహామాత కారునాబీతిన్రారు' అని విశ్వసిస్తారు. ఈ మహా మాతను వారెంతో గౌరవిస్తారు. ఆమె గౌరవార్థం శిలాస్థూపాలను అక్కడక్కడ వేయిస్తారు.
కుటుంబ యజమాని అమ్మమ్మ
ఖాసీ తెగలు మాతృవంశ పద్ధతిని అనుసరిస్తున్నాయి. వారసత్వపు హక్కు తల్లి వైపు నుంచి వస్తుంది. వివాహాలను, బంధుత్వాలను నియంత్రించడం తెగ ప్రధాన బాధ్యత. చనిపోయినవారి అస్థికలను కాల్చకుండా ఉత్సవ సమయాల్లో తాత్కాలికంగా బదిలీ చేసుకుని ఆ తర్వాత తెగకు చెందిన అగ్ని గుండంలో భస్మం చేస్తారు. మతానికి చెందిన ఉత్సవాలను ఉమ్మడిగా నిర్వహించడం, అందరూ ఒకే దేవతను ప్రార్థించడం, తమ తెగ వ్యక్తి మరణించినప్పుడు ఉమ్మడిగా విషాద దినాలు పాటించడం వంటి తంతు ద్వారా సామాజిక బంధనాలు పటిష్టంగా కొనసాగుతున్నాయి. భూమిపై ఉమ్మడి యాజమాన్యం ఉండటం వల్ల తెగ సభ్యుల మధ్య ఆర్థిక సంబంధాలు ఉంటాయి.
ఉపతెగల్లో కుటుంబం అతి చిన్న సామాజిక విభాగం. ఇంగ్ అనే పదంతో దీన్ని వ్యవహరిస్తూ ఉంటారు. కుటుంబంలో అమ్మమ్మ, ఆమె కుమార్తెలు, వారి భర్తలు, వారి పిల్లలు ఉంటారు. అమ్మమ్మను కుటుంబ పెద్దగా గుర్తిస్తారు. ఆమె జీవించినంత కాలం ఆమే కుటుంబ పెద్ద. ఆమె కుమార్తెలే కుటుంబంలో శాశ్వత సభ్యులు. ఈ కుమార్తెలు వివాహం తర్వాత తమ భర్తలతో ఆ కుటుంబంలోనే స్థిరపడిపోతారు. చిన్నకూతురు చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. అమ్మమ్మ నివసించే గృహంలో శాశ్వతంగా నివసించే హక్కు ఆమె చిన్న కుమార్తెదే. మిగిలిన కుమార్తెలు ఆ ఇంటి ఆవరణలో కాని పొరుగున కానీ సొంతంగా ఇండ్లు నిర్మించుకోవలసి ఉంటుంది. ఇంటి యజమానురాలు తల్లి అని గుర్తింపు పొందినా నిజమైన అధికారం తండ్రిదే. మాతృస్వామ్య-మాతృవంశ పద్ధతిలో మగవారు హీన స్థితిలో ఉంటారన్న అభిప్రాయాన్ని ఈ వాస్తవం ఖండిస్తున్నది. మగవారు వ్యవసాయ పనులు, ఇండ్ల నిర్మాణం, వేట, చేపలు పట్టడం వంటి పనులు చేయాలి. ఆడవారు వంట, ఇంటిపనులు, అప్పుడప్పుడు తోటల్లో పనిచెయ్యాలి.
ఖాసీలు ఏకపత్నీవ్రతులు. అట్లాగే బహుభర్తృత్వం కూడా ఉండదు. వధువును ఎంపిక చేసుకునే పద్ధతి చాలా క్లుప్తంగా ఉంటుంది. యువకుడు ఒక అమ్మాయిని అభిమానించడం, ప్రేమించడం ప్రారంభించిన తర్వాత అతడు ఆమె తల్లిదండ్రులకు చెబుతాడు. ఇక మిగతా విషయాలు పెద్దవాళ్లే చూసుకుంటారు.
Authorization