భూమిపై మానవుడు పుట్టిన దగ్గరి నుంచి ఇప్పటి వరకు జరిగిన చరిత్ర గురించి మాట్లాడుకునేటప్పుడు కొన్ని యుగాలుగా విభజించడం పరిపాటి. మనిషి జంతు దశ నుంచి ఆధునిక మానవుని దశకు క్రమ పరిణామం చెందడానికి లక్షల ఏండ్లు పట్టింది. ఈ క్రమంలో మనిషి టెక్నాలజీ కూడా మారుతూ వచ్చింది. జంతువు నుంచి మనిషిని వేరుచేసిన ఒక ముఖ్య లక్షణం పనిముట్లను ఉపయోగించుకోవడం. మొదట్లో అందుబాటులో ఉన్న రాళ్లు, కర్రలు, తీగలు, ఆకులు వంటి వాటిని ఉపయోగించుకునేవాడు. తర్వాత తర్వాత తానే స్వయంగా పనులను సాధించడానికి పనిముట్లను తయారుచేసుకోవడం ప్రారంభించాడు. ముఖ్యంగా మనిషి మొదట్లో తయారుచేసిన పనిముట్లన్నీ రాతివే. ఇట్లా రాతితో పనిముట్లు తయారుచేసుకున్న కాలాన్ని రాతియుగం అని పిలుస్తారు. దీన్నే ప్రాక్ చరిత్ర అని కూడా అంటారు. ఈ కాలంలో చదవడం, రాయడం ఎవరికీ తెలియదు. అయితే ఈ రాతి యుగం చాలా సుదీర్ఘమైనది. రాతితో వస్తువులు తయారుచేసుకున్నా, కాల క్రమంలో వైవిధ్యం, మార్పులు చోటుచేసుకున్నందువల్ల ఈ రాతి యుగాన్ని ఈ మార్పుల ఆధారంగా కొన్ని యుగాలుగా విభజించారు. ప్రాచీన శిలాయుగం, మధ్య శిలాయుగం లేదా సూక్ష్మశిలాయుగం, నవీన శిలాయుగం అని వీటిని పేర్కొనవచ్చు. అయితే ప్రాచీన శిలాయుగాన్ని తిరిగి పూర్వ ప్రాచీన శిలాయుం, మధ్య ప్రాచీన శిలాయుగం, ఉత్తర ప్రాచీన శిలాయుగంగా విభజిస్తారు.
ఈ వివిధ యుగాలు లేదా దశలు రాతి పనిముట్ల నైపుణ్యంలో అభివృద్ధిని సూచిస్తాయి. తదనుగుణంగా నాటి మానవ సంస్కృతి ఉన్నతిని పొందింది. ముడి పదార్థాలను నిర్ణయించడంలోనూ, నైసర్గిక వాతావరణానికి సంబంధించి, మార్పులననుసరించి అవసరానికి తగినట్లుగా పరికరాలను ఉత్పత్తి చేయడంలోను, రాను రాను తక్కువ పరిమాణాలలో తయారైన పరికరాలను పదును పెట్టడం (రీటచ్) లోనూ, అల్ప ప్రమాణ పరికరాలను (చిన్న పరిమాణంలో ఉండే పరికరాలను) వివిధ రకాలుగా తయారుచేయడంలోను నియతాకృతుల (జియోమెట్రిక్ ఫార్మ్స్) ఆయుధాలను తయారుచేయడంలోను నాటి రాతియుగ మానవుడు క్రమాభివృద్ధి చూపుతున్నట్లు తెలుస్తున్నది. వివిధ దశలలో మానవుడు వాడిన వివిధ రకాలైన రాతి పనిముట్లను, వాటిని తయారుచేసే విధానాల (టెక్నిక్స్)ను ఇప్పుడు చూద్దాం.
ప్ర్రాచీన శిలాయుగం మొదటి దశయైన పూర్వ ప్రాచీన శిలాయుగానికి చెందిన మానవుడు గులకరాతి పనిముట్లు, చేతిగొడ్డళ్లు, గండ్రగొడ్డళ్లు, చక్రాలు, గోకుడు రాళ్లు వంటి పరికరాలను ఉపయోగించాడు. ప్రాచీన మధ్య శిలాయుగంలో పెచ్చులు మీద చేసిన గోకుడు రాళ్లు, సూచికలు (పాయింట్స్), చిద్రకాలు (రంధాలు చేయడానికి ఉపయోగించేవి) ముఖ్యంగా వాడినారు. ఉత్తర ప్రాచీన శిలాయుగంలో బ్లేడులు, వాటితో చేసిన చిరుకత్తులు, ఉలి అంచు మొనలు, బాణపు మొనలు ఎముకలతో చేసిన కొన్ని పరికరాలు ముఖ్యమైనవి. మధ్య శిలాయుగంలో అల్ప ప్రమాణ పరికరాలు, నియతాకారం లేని, నియతాకారం ఉన్న పరికరాలుగా తయారుచేసి వాటిని ఉమ్మడి పరికరం (కాంపవుండ్ టూల్)గా వాడినట్లు తెలుస్తున్నది. అటువంటి పరికరాలలో చెప్పుకోదగినవి త్రిభుజాకారాలు, చతురస్రాకారాలు, అర్దచంద్రాకారాలు వంటి ఆకారాలున్న రాతిపనిముట్లు; బ్లేడులు, వివిధ రకాలైన సూచికలు. నవీన శిలాయుగంలోని మానవుడు నునుపుగా ఉన్న రాతి పనిముట్లను తయారుచేసినాడు. నునుపుగా మలచిన గొడ్డళ్లు, బాడిసలు, ఉలి వంటివి వీటిలో చెప్పుకోదగినవి.
రాతి పరికరాల మీద ఉన్న పెచ్చుల మచ్చలను బట్టి, పదును పట్టిన అంచులను బట్టి స్వయంగా బ్రూయిల్, లీకీ, బోర్డ్స్, సంకాలియా వంటి కొందరు పురాతత్వ శాస్త్రజ్ఞులు పైన పేర్కొన్న రాతి పరికరాలను తయారుచేసి చూడటం వల్ల కింద వివరించిన విధానాలను శిలాయుగపు మానవుడు ఆయుధాలను తయారుచేసుకోవడానికి అనుసరించేవారని తెలుస్తున్నది.
పూర్వ ప్రాచీన రాతియుగ పనిముట్ల తయారీ
పూర్వ ప్రాచీన శిలాయుంలో వాడిన పనిముట్లను తయారుచేసే విధానాలను దాగలి వాడే పద్ధతి, రాతి సుత్తెను వాడే పద్ధతి, స్తూపాకార సుత్తెను వాడే పద్ధతి అని విభజించవచ్చు. యూరప్ ఖండంలో మౌస్టీరియన్, లెవలోషియన్ పద్ధతులు కూడా పూర్వ ప్రాచీన కాలంలో కనబడతాయి. కాని భారత దేశంలోను, ఆఫ్రికా ఖండంలోను చివరి రెండు పద్ధతులు మధ్య ప్రాచీన శిలాయుగంలో కనపడతాయి.
దాగలి వాడే పద్ధతి (బ్లాక్ ఆన్ బ్లాక్ టెక్నిక్)
లావుగా ఉన్న గుండ్రని రాతిని దాగలి (ఆన్విల్)గా ఉపయోగిస్తారు. ఆయుధంగా తయారుచేయవలసిన రాతిని తీసుకొని మొదటి రాతి దాగలికేసి కొట్టాలి. అప్పుడు చేతిలో ఉన్న గులక రాతి నుంచి చాలా విశాలమైన క్షతతలంలో దెబ్బ తగిలిన చోటే కాక, కొంచెం కిందుగా కూడా బల్బ్ ఆకృతిలో ఉన్న పెద్ద పెచ్చు ఊడుతుంది. ఈ పద్ధతి కొనసాగిస్తే ఆయుధంగా చేయవలసిన రాతి నుంచి కొన్ని పెచ్చులు రాలిపడతాయి. వీటిని మామూలుగా రాతి అంచుల వెంబడి ఊడదీయాలి. అప్పుడు చేతిలో ఉన్న రాతి రెండు ముఖాల మీద ఉన్న పెచ్చు మచ్చలు ఒకదానినొకటి కలుసుకుని పదునైన కోత అంచుగా (కటింగ్ ఎడ్జ్)గా మారతాయి.
బయటకు ఊడదీసిన పెచ్చును ఫ్లేక్ అని, పెచ్చులు తీసిన రాతిని మూలం (కోర్) అని అంటారు. ఈ విధంగా ఊడదీసిన పెచ్చుల అంచులను తీర్చిదిద్దకుండానే వాటిని మాంసాన్ని ముక్కలుగా చేయడానికి, జంతువుల చర్మాలను ఒలవడానికి ఆనాటి మానవుడు వాడేవాడు. బ్లాక్ ఆన్ బ్లాక్ పద్ధతిలో తయారైన పనిముట్ల పైముఖం (సర్ఫేస్) మీద, కింది ముఖం మీద చాలా లోతైన పెచ్చు మచ్చలు ఏర్పడతాయి. ఈ మచ్చలు రాతి అంచులలో అంచు వెంబడి ఇరువైపుల కనబడతాయి. అంటే కోత అంచును సాధించడానికి కొన్ని పెచ్చులను ఆనాటి మానవుడు ఊడదీసేవాడని చెప్పవచ్చు.
రాతి సుత్తె పద్ధతి (స్టోన్ హామర్ టెక్నిక్)
రాతి సుత్తి వాడే పద్ధతిలో సాధారణంగా రెండు గులకరాళ్లను ఉపయోగిస్తారు. ఇందులో గులక రాతిని గాని, మరే ఇతర రాతిని కాని ఒక చేతిలో ఉంచుకుంటారు. ఇంకో చేతిలో గుండ్రని రాతిని పట్టుకొని దానిని సుత్తెగా వాడతారు. పై గుండ్రని రాతి సుత్తెతో ఇంకొక రాతికేసి ఒక నిర్ణీత కోణంలో కొడతారు. అప్పుడు ఒక అంచు వెంబడి ఒక పెచ్చు విడిపోతుంది. అట్లా ఊడదీయగా ఏర్పడిన పెచ్చు మచ్చలు ఒక అంచుదగ్గర కలుసుకున్నప్పుడు గులకరాతి అంచు సన్నబడుతుంది. ఈ పద్ధతిని కొనసాగిస్తే గులకరాతి చుట్టూ కానీ లేదా అనుకున్నంత వరకు కాని ఒక వంకర టింకర కోత అంచు ఏర్పడుతుంది. అట్లా ఏర్పడిన మొనదేలిన అంచును జంతువుల మాంసాన్ని కోయడానికి ఆనాటి మానవుడు వాడి ఉండవచ్చని భావిస్తున్నారు.
స్తూపాకారపు సుత్తెను వాడే పద్ధతి (సిలిండర్ హామర్ టెక్నిక్)
స్తూపాకారంలొ ఉన్న రాతి సుత్తెను వాడే పద్ధతిని రాతి గొడ్డళ్ల రూపంలో పరిపూర్ణత చెందిన కాలంలో ఉపయోగించేవారని తెలుస్తున్నది. అషూలియన్ రాతి గొడ్డళ్లు ఈ పద్ధతి ప్రకారం చేసేవారని భావించాలి. ఈ పద్థతిలో గుండ్రంగా ఉన్నరాతిని కాకుండా ఒక పొడుగాటి రాతిని కాని, ఎముకను కాని, కర్రను కాని సుత్తెగా వాడటం వల్ల ఈ విధానానికి స్తూపాకారపు సుత్తె పద్ధతి అనే పేరు వచ్చింది. పనిముట్టుగా చేయదలచిన రాతిని ఒకచేత్తో పట్టుకుని ఇంకొకచేతిలో ఉన్న పైన చెప్పిన పరికరాలతో మొదట రాతి అంచుల వెంబడి తర్వాత పై ముఖంమీద, కింది ముఖం మీద కొట్టడం వల్ల సన్నని పెచ్చులు ఊడిపోతాయి. చివరికి రాతి పనిముట్టు చుట్టూ సన్నని పదునైన అంచు ఏర్పడి పరికరం సన్నంగాను (తిన్ క్రాస్ సెక్షన్), ఆకర్షణీయంగాను తయారవుతుంది.
పైన పేర్కొన్న పద్ధతుల ద్వారా ప్రాచీన శిలాయుగంలో గులకరాళ్ల పరికరాలను అబ్బివిల్లియన్, అషూలియన్ పరిశ్రమలను తయారుచేసేవారని తెలుస్తున్నది. ఇవే కాకుండా ఈ శిలాయుగంలో ముఖ్యంగా అషూలియన్ చివరిదశలో లెవలోషియన్ పద్ధతి కనపడుతుంది. ఈ పద్ధతిలో కొన్ని పెచ్చు పరికరాలను తయారుచేసేవారు. ఇవి మధ్య ప్రాచీన శిలాయుగంలో కనిపిస్తాయి.
- జిఎస్ఆర్ కృష్ణయ్య
Authorization