ఏ నాటిక ప్రదర్శిస్తూ కామ్రేడ్ సఫ్దర్ హష్మి హత్యగావించబడ్డాడో అదే నాటిక 'హల్లాబోల్' వీధినాటికను సిఐటియు ఆవిర్భావ స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా ఇటీవల (మే 30) హైదరాబాదు సుందరయ్య విజ్ఞాన కేంద్రం కళానిలయంలో ప్రజానాట్యమండలి కళాకారులు ప్రదర్శించారు.
హల్లాబోల్ బలమైన కార్మికోద్యమ నాటిక. ఈనాటికీ ఎక్కడ ప్రదర్శిస్తుంటే అక్కడ కార్మికులు వువ్వెత్తున కదులుతారు. ఈ నాటకానికి కర్త, కర్మ, క్రియ అన్నీ సఫ్దర్ హష్మినే. ఈ దేశంలోని కోట్లాదిమంది అసంఘటిత కార్మికుల జీవన స్థితిని ఒడిసిపట్టుకుని ఓ చిన్న నాటికలో బంధించడం చిన్నవిషయమేమీ కాదు. రాజీలేని కార్మిక వర్గ దృక్పథం, అద్భుతమైన కళానైపుణ్యం ఉంటేనేకాని ఇది సాధ్యం కాదు. హష్మి ఈ జోడు గుర్రాల స్వారీ చేశాడు. అందుకే ఈ నాటిక దోపిడిదారుల గుండెల్లో రైలు పరిగెత్తించింది. ఓ చిన్న నాటిక కార్మికున్ని ఈ విధంగా కడలి తరంగం వలె ఉవ్వెత్తున కదిలిస్తుందని ఊహించలేకపోయారు. ఏ ఫాక్టరీ గేటు ముందు ప్రదర్శించినా, ఏ కార్మిక వాడలో ప్రదర్శించినా కార్మికులు కదలిపోయేవారు. కళాకారులతో కలసి నినదించేవారు. అంతగా నాటకంతో మమేకం అయ్యేవారు. ప్రేక్షకులకు, కళాకారులకు మధ్యగల అంతరం ఓ గమ్మత్తుగా అంతరించిపోయేది. నాటక ఇతివృత్తం తమ జీవితానికి సంబంధించినదని ప్రేక్షకులు భావించినప్పుడు మాత్రమే కళారూపంలో ఈ మాజిక్ రియలిజం (వాస్తవాద్భుతం) ఆవిష్కృతమవుతుంది. వస్తు-రూపాల కలయికే ఇందుకు గొప్ప తార్కాణం.
ఇతివృత్తం
తొలుత కళాకారులు ఓ నాటికను ప్రదర్శిస్తుండగా రాజ్య ప్రతినిధి (ఓ పోలీస్) వచ్చి ఏం చేస్తున్నారని అడుగుతాడు. మేం నాటకం ఆడుతున్నాం అని చెబుతారు. ఏం నాటకం అని అడుగుతాడు. కార్మికుల సమస్యలపై 'హల్లా బోల్' అని ఒక్కుమ్మడిగా చెబుతారు.
కుదరదు. నాటకం అంటే 'ప్రేమ-దోమ' వంటివి వేసుకోవాలని; అంతేకాని ఐక్యత, హక్కులు, పోరాటం, విప్లవం అంటే కుదరదని ఖండితంగా చెబుతాడు పోలీస్.
అట్లాగే అని కళాకారులు నాటకం మార్చి ఆడతారు. హీరో ఓ ఫ్యాక్టరీలో మిషన్ మెన్. సాధారణ కార్మికునికంటే కొంచెం పై స్థాయి. అలాంటి బీదవానికి ''మా పిల్లనిచ్చి గొంతుకోయలేమ''ని పిల్ల తల్లిదండ్రులు చెబుతారు. అప్పుడు హీరో తమ జీతాల పెంపుకోసం తమ సిఐటియు సంస్థ పోరాడుతుందని, త్వరలోనే జీతాలు పెరుగుతాయని అంటాడు.
వెంటనే పోలీసు వచ్చి అదిగో మళ్లీ జీతాలు, పోరాటాలు అంటూ మొదలుపెట్ట్లారు అంటూ గొడవ పడ్తాడు. అప్పుడు కళాకారులు ముక్త కంఠంతో ఈ దేశంలో కార్మికులు బ్రతకాలంటే తమ హక్కుల సాధనకోసం, జీతాల పెంపుకోసం అనునిత్యం పోరాడక తప్పదని, కార్మిక బతుకు అంటేనే ఓ పోరాట బతుకు అని, ఈ సూక్ష్మ సత్యం తెలుసుకోకుండా అడ్డుకోవడం మూర్ఖత్వమని పోలీస్ను హెచ్చరిస్తారు. ''అదే అదే పతాక జైత్రయాత్ర సాగుతోంది రా. పదే పదే పదే రణానికై నగారా మ్రోగుతోందిరా'' అన్న రాంభట్ల పతాక గేయానికి కళాకారుల నృత్యాభినయంతో నాటిక ముగుస్తుంది.
భిన్న భాషల్లో, భిన్న రాష్ట్రాల్లో లక్షలాది కార్మికులను చైతన్యపరచిన ఈ నాటికను 1989లో ముప్పరు ఏండ్ల క్రితం తెలుగు నాట టి.జి.రామనాథం దర్శకత్వంలో ప్రజానాట్యమండలి తూర్పుగోదావరి జిల్లా కళాకారులు ప్రదర్శించారు. 1990 నుండి 'సఫ్దర్ హష్మి ఓపెన్ ధియేటర్ (పాట్)'' పేరుతో ప్రతియేటా వివిధ ప్రాంతాల్లో జరిగే రాష్ట్ర స్థాయి (ఉభయ రాష్ట్రాల) వీధినాటకోత్సవాల్లో ఆరంభంగా ఈ నాటిక నిలిచేది. కళాకారులకు ఓ పాఠంగా మిగిలేది.
అదే దర్శకత్వ డిజైన్తో ప్రజానాట్యమండలి హైదరాబాదు కళాకారుడుసైదులు నేతృత్వంలో ప్రదర్శించి రక్తి కట్టించారు. చిన్న, పెద్ద కళాకారులు ఇలా సంయుక్తంగా ప్రదర్శించడం అభినందనీయం. ప్రజా కళాస్రవంతి ఇట్లాగే సాగాలి.
కార్మికులు సమ్మె చేస్తున్నప్పుడు నిజమైన కార్మిక వర్గ ప్రతినిధి ఒకరుంటే, యాజమాన్య తొత్తు ప్రతినిధిగా ఒకరుంటారు. కార్మిక వాడల్లో కార్మికుల జీవన స్థితిగతులు-భాష, యువతీ యువకుల మధ్య ప్రేమ సన్నివేశాలు- ఇవన్నీ నాటికలో సహజంగా, హాస్యయుతంగా ఆవిష్కృతమవుతాయి. అందుకనే ఆ సన్నివేశాలప్పుడు ప్రేక్షకుల కరతాళ ధ్వనులు వినిపిస్తూ ఉంటాయి.
ప్రజా కళారూపాలు ఎప్పుడూ నిరాడంబరతలోనే సౌందర్యాన్ని చూపాలి. తక్కువ ఖర్చుతో విస్తృతంగా ప్రజానీకం దగ్గరకు వెళ్లాలి. శ్రామిక వర్గ హృదయంతో ఆ విధంగా సంభాషించాలి. ఇందుకు వర్గచైతన్య, సాధన, పట్టుదల వినా మరో మార్గం లేదు. హష్మి బాటలో ప్రజా కళారూపాలు మరింత ఉదృతంగా నేడు రావాల్సిన ఆవశ్యకత ఎంతయినా ఉన్నదనే విషయాన్ని ఈ నాటిక మరోసారి రుజువుచేసింది.
- కె.శాంతారావు,
9959745723
Authorization